Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ అభ్యర్థులతో రేపు వర్క్ షాప్

హాజరుకానున్న అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి :- సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన కొన్ని మినహా దాదాపుగా తమ అభ్యర్థులను ప్రకటించాయి. మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ విడుదలతో కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలను చర్చించేందుకు అభ్యర్థులతో టీడీపీ వర్క్ షాప్ ను నిర్వహిస్తోంది. ఈ వర్క్ షాప్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.

విజవాయడలోని ఎ కన్వెన్షన్ లో శనివారం(రేపు) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ వర్క్ షాప్ జరుగుతుంది. ఈ వర్క్ షాప్ కు తెలుగు దేశం పార్టీ నుంచి లోక్ సభ, అసెంబ్లీకి అభ్యర్థులుగా ప్రకటించిన వారితో పాటు …ఇతర నియోజకవర్గాల్లోని ఇంచార్జ్ లు కూడా పాల్గొంటారు. అభ్యర్థులతో పాటు ఎన్నికల కోసం వారు ప్రత్యేకంగా నియమించుకున్న నలుగురు మేనేజర్లు కూడా ఈ వర్క్ షాప్ కు హాజరవుతారు.ఎన్నికల ప్రవర్తనా నియమావలి, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగుతుంది.

ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైనా వర్క్ షాప్ లో చర్చిస్తారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్దతులను, వ్యూహాలను ఈ సమావేశంలో వివరిస్తారు. చంద్రబాబు నాయుడు స్వయంగా దీనిపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జనసేన, బీజేపీల నుంచి ఆ పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఒక్కొక్కరు చొప్పున ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. ఉదయం వర్క్ షాప్ ను ఉద్దేశించి టీడీపీ అధినేత ప్రసంగం ఉంటుంది. ఈ ప్రారంభోపన్యాసానికి మీడియాకు అనుమతి ఉంటుంది.

LEAVE A RESPONSE