– ఫర్నీచర్, సిసి టీవీలు ధ్వంసం
– నిరసనగా రోడ్డెక్కి కార్యకర్తల ఆందోళన
– ఏ పార్టీ అధికారంలో ఉందంటూ నినాదాలు
– గుడివాడలో ఇంకా వైసీపీ పెత్తనమా అని ప్రశ్నలు
గుడివాడ: జగన్ జమానాలో రెచ్చిపోయిన గుడివాడ గడ్డం గ్యాంగ్.. కూటమి సర్కారులోనూ టీడీపీ నేతలపై స్వైరవిహారం చేస్తుండటం టీడీపీ శ్రేణులకు ఆగ్రహం కలిగిస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని దన్నుతో ఐదేళ్లు టీడీపీ నాయకులు, శ్రేణులపై దాడులకు తెగబడిన వైసీపీ నేతలు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, అధికార పార్టీ నాయకులపై తెగబడి దాడులు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనితో ‘రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది’ అంటూ కార్యకర్తలు, రోడ్డెక్కి ప్రశ్నించిన దృశ్యం గుడివాడలో ఆవిష్కృతమయింది.
మార్కెట్ యార్డు వద్ద తెలుగుదేశం నేత అడుసుమిల్లి శ్రీనివాస్కు చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంపై అర్ధరాత్రి మూకుమ్మడిగా వైసీపీ మూకలు దాడి చేశారు. ఈ కార్యాలయంలోని ఫర్నిచర్, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.
వైసీపీ నేత లింగం చిట్టిబాబు, తన అనుచరులు మరో 15 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు గుర్తించారు. అర్ధరాత్రి కార్యాలయం పరిసరాల్లో విధ్వంసం సృష్టించారు.
కార్యాలయంలో రూ. 3 లక్షల నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుడు అడుసుమిల్లి శ్రీనివాస్ తెలిపారు.దాడి జరుగుతున్నప్పుడు అడ్డుకోబోయిన స్థానికులను చంపుతామంటూ బెదిరించారని అడుసుమిల్లి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం తెలియడంతో గుడివాడలోని టీడీపీ నేతలు నిరసనకు దిగారు.కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ గుడివాడలో ఇంకా వైసీపీ అరాచకాలు కొనసాగడం ఏమిటని కార్యకర్తలు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో తమకు అర్ధం కావడం లేదని నినాదాలు చేశారు.