Suryaa.co.in

Telangana

యోగా భారతీయ జీవన విధానం

– సింధూర్ పార్క్ లో జరిగిన 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి

ఝంజ్రా: పశ్చిమ బెంగాల్, ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లోని ఝంజ్రా ఏరియాలో ఉన్న సింధూర్ పార్క్ లో జరిగిన 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

శారీరక, మానసిక, పర్యావరణ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ “ఒకే భూమి, ఒకే ఆరోగ్యం” కోసం యోగా నేపథ్యంతో నేడు ప్రపంచవ్యాప్తంగా జరిగిన యోగా వేడుకలలో భాగంగా నేటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రితోపాటుగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్, కోల్ ఇండియా ఛైర్మన్ మరియు ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సీఎండీ పీఎం ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, 1500 లకు పైగా కార్మికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత పెద్దమొత్తంలో ఒకే చోట యోగా సాధనలో పాల్గొనడం స్థిరమైన ఆరోగ్యం పట్ల వారికున్న నిబద్ధతను తెలియజేస్తుంది.

కార్యక్రమంలో పాల్గొన్నవారికి కేంద్ర మంత్రి యోగా ఆవశ్యకతను వివరించారు. యోగాను మన నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక ధృఢత్వాన్ని, మానసిక స్పష్టతను, భాగోద్వేగ సమతుల్యతను సాధించవచ్చని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం ప్రతి రోజూ యోగాను సాధన చేయాలని కార్మికులను కోరారు. అనంతరం ఆయుష్ మంత్రిత్వ శాఖ చేసిన ప్రచురణల ఆధారంగా కోల్ ఇండియా లిమిటెడ్ రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్ పుస్తకాన్ని కేంద్రమంత్రి ఆవిష్కరించారు.

యోగా వేడుకల ప్రారంభానికి ముందురోజు పర్యావరణ స్థిరత్వం కోసం ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన సింధూర్ పార్క్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి, పార్క్ లో నిర్వహించిన ఏక్ పేడ్ మా కె నామ్ కార్యక్రమంలో భాగంగా ఒక మొక్కను నాటారు. అనంతరం కార్మికులు, సాంకేతిక నిపుణులతో కలిసి భూమి పొరలలో ఉన్న బొగ్గు గనులను సందర్శించారు.

ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన కేంద్రమంత్రి అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లను గురించి, తీసుకుంటున్న సంరక్షణ చర్యల గురించి తెలుసుకున్నారు. ఈ భద్రతా ఏర్పాట్లను మరింతగా మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. దేశానికి అవసరమైన ఇంధనాన్ని అందించి, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పాటును అందించడంలో కార్మికులదే కీలకపాత్ర అని వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి కృషి చేయాలని కార్మికులను కోరారు.

యోగా వేడుకలలో భాగంగా అద్భుతమైన పనితీరును కనబరచిన కార్మికులను కేంద్ర మంత్రి సత్కరించారు. అక్కడి రిహాబిలిటేషన్ సెంటర్లను సందర్శించి అక్కడ వారికందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వారి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం నిర్వహించిన సామాజిక కార్యక్రమంలో భాగంగా 21 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.

కొత్తగా నియమితులైన 25 మంది ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉపాధి కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రి వివరించారు. చివరగా ఆయా కోల్ ఫీల్డ్స్ లో జరుగుతున్న కార్యక్రమాల మీద ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్రమంత్రి బొగ్గు ఉత్పత్తిని స్థిరంగా పెంచడానికి, కార్మికులకు సంరక్షణకు మెరుగైన చర్యలను తీసుకోవడం గురించిన సూచనలు చేశారు.

LEAVE A RESPONSE