వైఎస్‌ వివేకా హత్య కేసు.. సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

విచారణ అక్టోబర్‌ 14కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. హత్య కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్టున్నారని.. సాక్షులను బెదిరిస్తున్నారని సునీత తరపు సీనియర్‌ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

విచారణలో ఎలాంటి పురోగతి లేదని, దర్యాప్తు సంస్థ అధికారులపై ప్రైవేటు ఫిర్యాదులు చేయడంతోపాటు.. క్రిమినల్‌ కేసులు పెట్టి విచారణకు ఆటంకం కల్పిస్తున్నారని వివరించారు. కావున విచారణ తెలంగాణ లేదా దిల్లీ సహా దేశంలో మరేదైనా హైకోర్టు పరిధిలో దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశాలు ఇవ్వాలని సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు.

సాక్షులను బెదిరిస్తున్నట్లు ఆధారాలు లేవని శివశంకర్‌ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 140 మంది వరకు సాక్షులు ఉన్నారని.. వారందరిని అంత దూరం ఎలా పిలుస్తారని అనగా.. ఆ విషయం ఏదో సీబీఐనే చెప్పనీయండి అని ధర్మాసనం అభిప్రాయపడింది.

సునీత పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు ఇచ్చిన ధర్మాసనం.. తదుపరి విచారణ అక్టోబర్‌ 14కు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టుకు శివశంకర్రెడ్డి..
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంలో పిటిషన్ వేశారు. సీబీఐ, వైఎస్ సునీతను ప్రతివాదులుగా చేర్చారు.శివశంకర్‌రెడ్డి తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.

Leave a Reply