Suryaa.co.in

Andhra Pradesh

బెజవాడలో 10 మంది సిమీ ఉగ్రవాదులు?

– పోలీసుల అలర్ట్
– ఆరుగురు అనుమానితుల గుర్తింపు?
– తనిఖీలపై దృష్టి

విజయవాడ: రాష్ట్ర రాజధాని నగరమైన విజయవాడలో సిమీ ఉగ్రవాదుల కదలికలను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తం పదిమంది సిమీ ఉగ్రవాదులు విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో వివిధ వేషాలలో తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఆ మేరకు పోలీసులు నగరంపై దృష్టి సారించారు.

కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన నిర్దిష్టమైన సమాచారం మేరకు, నగరంలో పది మంది అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. రెండు నెలల క్రితం, కేంద్ర నిఘా వర్గాలు నలుగురు అనుమానిత సిమి సానుభూతిపరులకు సంబంధించిన వివరాలను విజయవాడ పోలీసు కమిషనరేట్ అధికారులకు అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, మరో ఆరుగురు అనుమానితులను గుర్తించినట్లు సమాచారం. దీంతో మొత్తం పది మంది వ్యక్తుల కదలికలపై నిఘా వ్యవస్థను కేంద్రీకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ పది మంది అనుమానితులు నగరంలోని గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేట వంటి ప్రాంతాలలో నివాసం ఉంటున్నారని, వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని గుర్తించినట్లు తెలిసింది.

LEAVE A RESPONSE