– సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామజోగయ్య లేఖ
– సుప్రీంకోర్టు కూడా అనుమతించిందని లేఖలో ప్రస్తావన
విజయవాడ: ఎన్నికల ముందు కూటమిని.. ప్రధానంగా పవన్కల్యాణ్ను తన వ్యాఖ్యలతో ఇబ్బందిపెట్టిన రాజకీయ కురువృద్ధుడు, కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య మళ్లీ వార్తలకెక్కారు. ఈసారి ఆయన కాపులకు 5 శాతం రిజర్వేషన్ డిమాండ్తో తెరపైకొచ్చారు.
కాపు నేత హరిరామ జోగయ్య మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లకు లేఖ రాశారు. కాపులకు డీఎస్సీ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్ కల్పించి కాపు సామాజికవర్గ అభ్యున్నతికి పాటుపడాలని కోరారు.
డీఎస్సీ నియామకాల్లో 103 రాజ్యాంగ సవరణ ప్రకారం షెడ్యూల్-14 చట్టం ద్వారా విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల్లోని పేదలకు ఈడబ్ల్యూఎస్ కోటాకింద కేటాయించిన 10 శాతంలో.. కాపు కులస్తులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఆ విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా హరిరామ జోగయ్య గుర్తు చేశారు.