Suryaa.co.in

Telangana

పరమాన్నం అని చెప్పి పంగ నామాలు పెడుతున్నడు

– పేదలను రేషన్ కార్డులకు దూరం చేసే కుట్ర
– మొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదు
– చివరి హామీ చేయూతకు దిక్కు లేదు
– పాపం రేవంత్ రెడ్డిది, శాపం అధికారులకు
– చెత్తబుట్టలో 11 లక్షల ప్రజాపాలన దరఖాస్తులు
– తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: రాష్ట్రంలో 26 జనవరి నుంచి కొత్తగా పలు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని చెబుతున్న ప్రభుత్వ తీరు చూస్తే పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దాని కంటే కోతలు ఎలా పెట్టాలి అనే చూస్తున్నట్లుంది. అందరికీ పరమాన్నం అని చెప్పి, అధికారంలోకి రాగానే పంగ నామాలు పెడుతున్నడు రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదు, చివరి హామీ చేయూతకు దిక్కు లేదు.. మధ్యలో ఉన్న అన్ని హామీలదీ దాదాపు అదే పరిస్థితి. అన్నింట్లో కోతల విధింపే.

దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్లు, జనవరి 26 రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజున ప్రారంభించే కార్యక్రమాల్లోనూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. రేషన్ కార్డుల విషయంలో రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నాం. ప్రజలు తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఉన్నరు. పాపం రేవంత్ రెడ్డిది, శాపం అధికారులకు. రేషన్ కార్డుల ఎంపిక గ్రామాల్లో జరగాలి.

కుల గణన సర్వేను బేస్ చేసుకొని, ఆ లిస్టును మాత్రమే ప్రింట్ తీసి గ్రామాలకు పంపారు. ఆన్ లైన్ లో మీ సేవలో కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నరు. ప్రజా పాలన సమయంలో దరఖాస్తులు చేశారు. ఆ దరఖాస్తులు అన్నీ చెత్తబుట్టలో వేశారు. 11 లక్షల దరఖాస్తులు ప్రజాపాలనలో వస్తే ఎందుకు పరిశీలించడం లేదు? మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదు? కుల గణన సర్వే చేసేటప్పుడు ఇది ఆప్షనల్, బలవంతం లేదు. ఇష్టం ఉన్న వారు మాత్రమే పాల్గొనవచ్చు అన్నరు. ఇప్పుడు మాత్రం దాన్ని బేస్ చేసుకొని అర్హులకు రేషన్ కార్డులు రాకుండా కోతలు పెడుతున్నరు.

నా నియోజకవర్గం నంగునూరులో, గట్ల మల్యాల గ్రామంలో 110 మంది ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టారు. లిస్టులో 40 మంది పేరు మాత్రమే ఉంది. అధికారులను అడిగితే హైదరాబాద్ నుంచి పేర్లు వచ్చాయి. మాకేం తెల్వదు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలో ఉన్నరు. కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డుల విషయంలో మా ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేశారు. పదేళ్ల మా పాలనలో 6,47,479 రేషన్ కార్డులును ఇచ్చాం. 20,69,033 మంది లబ్ధిదారులు అదనంగా రేషన్ ఇచ్చినం.
కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించారు. నిరుపేదలకు రేషన్ కార్డులు రావాలనే ఆలోచనతో ఆదాయ పరిమితి సడలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదాయ పరిమితి గ్రామీణంలో 60వేలు, పట్టణంలో 75వేలు ఉంటే, దాన్ని గ్రామీణంలో లక్షా 50వేలకు, పట్టణంలో 2.50 లక్షలకు పెంచారు. అంగన్ వాడీలు, ఆశాలు, ప్రైవేటు, ఔటో సోర్సింగ్, కాంట్రాక్టు, పేద వర్గాలకు లాభం జరగాలని నిర్ణయం తీసుకున్నరు.
ఎక్కువ మందికి ఇవ్వాలనే ఆలోచన మాది. ఎక్కువ మందికి కోత పెట్టే ఆలోచన మీది.

గడిచిన పదేండ్లలో ద్రవ్యోల్బణం ప్రతి సంవత్సరానికి సగటున 5.42శాతం ఉందని, పది సంవత్సరాలకు గాను సుమారు 69.60శాతం ద్రవ్యోల్బణం రికార్డు అయినట్లుగా OECD & World Bank స్పష్టం చేసింది. దీని ప్రకారం, 1.7 రెట్లు ధరలు పెరుగుదల నమోదైనట్లు.

గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 50వేల ఆదాయ పరిమితిని, ద్రవ్యోల్బణం ప్రకారం గుణిస్తే 2.55లక్షలు అని తేలుతుంది. అంటే ఆనాటి లక్షా 50వేలు, ఈ నాటి 2.55లక్షలతో సమానం.

అదే విధంగా పట్టణ ప్రాంత 2లక్షల ఆదాయ పరిమితిని, ద్రవ్యోల్బణం ప్రకారం గుణిస్తే 3.40లక్షలు అని తేలుతుంది. అంటే ఆనాటి లక్షల ఆదాయం, నేటి 3.40లక్షలకు సమానం. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అనుసరించి రేషన్ కార్డుల కోసం కుటుంబ ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో 2.55లక్షలుగా, పట్టణ ప్రాంతాల్లో 3.40లక్షలుగా సవరించి పెంచాలని, తద్వారా పేదలందరికీ లబ్ది చేకూరే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ద్రవ్యోల్బణం లెక్కల ఆధారంగా పరిగణించి రేషన్ కార్డులు ఇస్తే ఎంతో మంది నిరుపేదలు రేషన్ కార్డులు పొందుతారు. మా ప్రభుత్వ నిర్ణయం వల్ల జర్నలిస్టులు, ప్రైవేటు ఉద్యోగులు, చిరు ఉద్యోగులు ఇలా ఎంతో మంది తెల్ల రేషన్ కార్డులు పొందారు.

అభయహస్తం మేనిఫెస్టోలో రేషన్ కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్నా అతీగతీ లేదు. మేనిఫెస్టోలో మేము పెట్టక పోయినప్పటికీ రేషన్ కార్డు ద్వారా కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యంను 4కేజీల నుంచి 6కేజీలకు పెంచడం జరిగింది. కుటుంబానికి 20కేజీలే ఉన్న పరిమితిని ఎత్తివేసి, ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 6కేజీలు ఇచ్చినం.

ఉదాహరణకు 2014లో అంగన్ వాడీల వేతనం రూ.4200 ఉండేది. కేసీఆర్ ప్రభుత్వం మూడు దఫాలుగా పెంచి వారి వేతనాన్ని రూ. 13,650కి చేర్చింది. 2014లో వీరి వార్షికాదాయం 50,400 ఉండగా, పెరిగిన వేతనం ప్రకారం ఇప్పుడు వారి వార్షికాదాయం రూ. 1,63,800. రేషన్ కార్డుల జారీలో 2014 నిబంధనలను అనుసరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతీ అంగన్ వాడీకి రేషన్ కార్డులు రానట్లే.

అదే విధంగా ఆశాలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, చిరు ఉద్యోగులకు మీ ప్రభుత్వ అశాస్త్రీయ నిబంధనల వల్ల రేషన్ కార్డులు రాని దుస్థితి నెలకొంది. పేదలను రేషన్ కార్డులకు దూరం చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తున్నది. పెరిగిన ధరలకు అనుగుణంగా అర్హత పరిమితిని పెంచి పేదలకు లాభం చేయాలి. 28వ తేదీ నుంచి గ్రామ సభల్లో రేషన్ కార్డుల గురించి ప్రశ్నించాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి.

అర్హులకు వచ్చే దాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. మళ్లీ దరఖాస్తులు పెట్టాలి అంటున్నరు. యాడాది కింద పెట్టిన దరఖాస్తుల పరిస్థితి ఏమిటి రేవంత్ రెడ్డి? షరతులు లేకుండా మీసేవ, ప్రజాపాలన, కుటుంబ సర్వే దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని అందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నం.

ధరణిలో పెట్టి ఆ 25లక్షల్లో గుంట భూమి ఉన్నా ఇచ్చేది లేదని అర్హుల సంఖ్యను ఆరు లక్షలకు కుదించారు. కోటి మంది వ్యవసాయం కూలీలు ఉంటే, ఆరు లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తరట. ఇదేం న్యాయం. వ్యవసాయ కూలీలు నిర్ణయించాల్సింది గ్రామాల్లో. ఎవరు కూలీ పోతున్నరో అడగాలి. అంతేగాని కంప్యూటర్ డేటా ఆధారంగా కోతలు విధించడం దుర్మార్గం.

ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదల ఉసురు పోసుకుంటున్నడు. ఆత్మహత్య చేసుకున్న రైతుకు 10లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ తరుపున ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థికంగా ఆదుకుంటం.

వాయిదా వేసుకోనైనా అర్హులందరికి రేషన్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే గ్రామ గ్రామాన నిరసనలు తప్పవు. ప్రభుత్వాన్ని ఎక్కడిక్కడ నిలదీయాలని బీఆర్ఎస్ పక్షాన పిలుపునిస్తున్నాం.

LEAVE A RESPONSE