Suryaa.co.in

Telangana

ఎన్‌ఎస్‌డిపి స్కీముతో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం

– నాలాలపై మంత్రి తలసాని, ఎంఏయుడి కార్యదర్శి అర్వింద్‌కుమార్ సమీక్ష

ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల వరదముంపు సమస్యకు నాలాల సమగ్ర అభివృద్ధి (SNDP) కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి GHMC, వాటర్ వర్క్స్, రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ MD దాన కిషోర్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ శర్మన్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, SNDP ENC జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బేగంపేట నాలా కు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ నుండి వచ్చే వరద నీటితో బేగంపేట డివిజన్ లోని బ్రాహ్మణ వాడి, అల్లంతోట బావి, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలలో ని ప్రజలు వరద ముంపుకు గురవుతున్నారని వివరించారు. SNDP కార్యక్రమం క్రింద ఈ నాలా కు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఆయా కాలనీల నుండి స్ట్రాం వాటర్ పైప్ లైన్, CC రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో ఆయా ప్రాంతాల ప్రజలకు వరదముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపినట్లు అవుతుందని మంత్రి తెలిపారు.

SNDP ప్రాజెక్ట్ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ముషీరాబాద్ మండల పరిధిలోని భోలఖ్ పూర్ లో గల సోమప్ప మఠం కు చెందిన 3,571 గజాల స్థలంలో సుమారు 130 నిరుపేద కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తున్నాయని, వీరిలో 53 కుటుంబాలకు 1996 సంవత్సరంలో పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న కుటుంబాల వారు విద్యుత్, నల్లా కనెక్షన్ వంటి సౌకర్యాలు పొందారని చెప్పారు.

ఈ స్థలాన్ని GHMC స్వాధీనం చేసుకొని, పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వివరించారు. అదేవిధంగా ముషీరాబాద్ మండల పరిధిలోని జీరా కాంపౌండ్ లో సుమారు 70 కుటుంబాల వారు ఎన్నో సంవత్సరాలుగా ఇండ్లను నిర్మించుకొని జీవనం
aravind1 సాగిస్తున్నారని, వీరికి రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. దేవాదాయ శాఖ కు చెందిన ఈ స్థలాన్ని GHMC స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన పరిహారాన్ని చెల్లించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. వీలైనంత త్వరగా స్థల సేకరణ జరిపితే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలను కూడా సిద్దం చేసినట్లు చెప్పారు.

రాంగోపాల్ పేట డివిజన్ లోని 134 గృహాల వారు GO 816 క్రింద 1994 సంవత్సరంలో రెగ్యులరైజేషన్ క్రింద దరఖాస్తు చేసుకున్నారని, సుప్రీం కోర్టు లో పలు వివాదాలు పెండింగ్ లో ఉండటంతో ప్రభుత్వం రెగ్యులరైజేషన్ ప్రక్రియ కొనసాగలేదని వివరించారు. 2002 సంవత్సరంలో కోర్టు తీర్పు లబ్దిదారులకు అనుకూలంగా వచ్చినప్పటికీ GO 816 గడువు ముగియడంతో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. రెగ్యులరైజేషన్ విషయమై ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అద్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశం సానుకూలత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా నగరంలోని గోడే ఖీ ఖబర్, జంగం మెట్, న్యూ బోయగూడ, హైదర్ బస్తీ తదితర 9 ప్రాంతాలలో 485 మున్సిపల్ క్వార్టర్స్ ఉన్నాయని, వీటిలో గోడే ఖీ ఖబర్, జంగం మెట్ లోని క్వార్టర్స్ ను తొలగించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు. మిగిలిన ప్రాంతాల లో ఉన్న GHMC క్వార్టర్స్ ను రెగ్యులరైజ్ చేయాలని లబ్దిదారుల నుండి వస్తున్న విజ్ఞప్తుల మేరకు రెగ్యులరైజ్ చేయాలని సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని న్యూ బోయగూడ, హైదర్ బస్తీ ప్రాంతాలలోని క్వార్టర్స్ ను GO 58 క్రింద రెగ్యులరైజ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని GHMC, రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు.

మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని నాలా బజార్ శంకర్ స్ట్రీట్ లో 7 కుటుంబాలు GO 59 క్రింద రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, సజన్ లాల్ స్ట్రీట్ లో 22 కుటుంబాలు GHMC స్థలంలో ఇండ్లను నిర్మించుకొని జీవిస్తున్నారని, GO 58, 59 క్రింద రెగ్యులరైజ్ ప్రక్రియ పెండింగ్ లో ఉందని, ఈ సమస్యను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని వెంగళరావు నగర్, సనత్ నగర్ డివిజన్ లోని శ్యామల కుంట లలో అనేక నిరుపేద కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నాయని, రికార్డ్ లో మాత్రం FTL గా నమోదై ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి చెరువులు, కుంటలు లేవని పేర్కొన్నారు.

గత సంవత్సరం వరంగల్ లో ఇలాంటి సమస్యను అయాన్ కన్వర్షన్ క్రింద పరిష్కరించడం జరిగిందని, అదే తరహాలో ఈ రెండు ప్రాంతాల ప్రజల సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఆయా ప్రాంతాలలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయని, ఎంత విస్తీర్ణం ఉందని పూర్తిస్థాయి అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించి మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో సమర్పించాలని సికింద్రాబాద్ RDO వసంత ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఎంతో చరిత్ర కలిగిన మోండా మార్కెట్, ఓల్డ్ జైల్ ఖానా భవనాలను మోజం జాహీ మార్కెట్ తరహాలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనులకు కార్యాచరణ ను రూపొందించాలని చెప్పారు.

అదేవిధంగా మినిస్టర్ రోడ్ లో ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం శిధిలావస్థకు చేరిందని, దాని స్థానంలో నూతన గాంధీ విగ్రహం ఏర్పాటు తో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ లను అక్కడి నుండి తరలించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.సనత్ నగర్ లోని ఇండస్త్రియల్ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణ పనులు, పతే నగర్ వంతెన విస్తరణ, రాణిగంజ్ రైల్వే బ్రిడ్జి పనులను చేపట్టేందుకు రైల్వే, GHMC, అధికారులతో కలిసి పర్యటిస్తామని మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE