Suryaa.co.in

Andhra Pradesh

సిద్ధం అంటున్న సర్కారుకు సిగ్గుందా?

-ప్రజలు బాధ పడుతుంటే సిద్ధమంటారా? సిగ్గులేదూ
-సిద్ధం సభలతో ఆర్టీసీ ప్రయాణికుల అవస్థలు
-పరీక్షలు, పెళ్లిళ్ల సీజన్ పట్టవా?
-ఏపీ సీఎస్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ

ఓవైపు ప్రయాణాలకు సరిపడా బస్సులు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే, ప్రభుత్వం సిగ్గులేకుండా సిద్ధం సభలకు వేలాది ఆర్టీసీ బస్సులను తరలిస్తోందని, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాశారు.

లేఖ సారాంశం ఇదీ..
గత కొన్ని వారాలుగా వైకాపా నిర్వహిస్తున్న సిద్దం సభలకు ఆర్టీలు బస్సులు తరలిస్తున్నారు. ఫిబ్రవరి 18న రాప్తాడులో జరిగిన సిద్దం సభకు దాదాపు 3 వేల ఆర్టీసీ బస్సులు తరలించారు. జనవరి 27 న భీమిలీ సభకు వెయ్యి బస్సులు దారిమళ్లించారు. ఫిబ్రవరి 3 న దెందులూరు సభకు 1200 బస్సులు తరలించారు.

పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులు దారిమళ్లించడంతో సామాన్య ప్రజలు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గంటల తరబడి బస్టాప్‌లలో వేచిచూడాల్సి వస్తోంది.విద్యార్ధులు తమ క్లాసులకు హాజరుకాలేకపోతున్నారు. ఆర్టీసీ బసులే కాకుండా, పెద్ద ఎత్తున ప్రైవేటు బస్సులు పార్టీ కార్యక్రమాలకు తరలించడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆర్టీవో అధికారులు అధికారపార్టీతో కుమ్మక్కై ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

విద్యార్ధులకు పరీక్షల సీజన్ కావడంతో స్కూళ్లు, కాలేజీలు నిర్వహిస్తున్న ప్రత్యేక క్లాసులకు హాజరు కాలేకపోతున్నారు. విద్యార్ధులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ బస్సులు అధికారపార్టీ కార్యక్రమాలకు తరలించకుండా ఆదేశాలు జారీచేయండి. ప్రజలు ఇబ్బందులు పడకుండా.. ఆర్టీసీ బస్సులు అన్ని పార్టీలకు సమానంగా కేటాయించేలా చర్యలు తీసుకోండి.

LEAVE A RESPONSE