Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ అసెంబ్లీ స్టాండింగ్‌ కౌన్సెల్‌ చంద్రశేఖర్‌ అరెస్ట్

– జడ్జిలను దూషించిన కేసు

సామాజిక మాధ్యమాల్లో జడ్జిలను దూషిస్తూ పోస్టింగులు పెట్టారన్న అభియోగంపై ముగ్గురుని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు… గుంటూరు సీబీఐ న్యాయస్థానం ముందు హాజరుపర్చారు.ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి, ఏపీ అసెంబ్లీ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్న మెట్ట చంద్రశేఖర్‌రావు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుంట రమేష్‌కుమార్లకు సీబీఐ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీబీఐ ప్రత్యేకకోర్టు జడ్జి పొన్నూరు బుజ్జి ఎదుట ప్రవేశపెట్టారు.న్యాయవ్యవస్థను కించపరుస్తూ, న్యాయమూర్తులను అసభ్యకరంగా దూషిస్తూ, బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ మరో ముగ్గుర్ని శనివారం అరెస్టు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి, ఏపీఈపీడీసీఎల్‌కి స్టాండింగ్‌ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్న న్యాయవాది మెట్ట చంద్రశేఖర్‌రావు (ఏ18), న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి (ఏ19), సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుంట రమేష్‌కుమార్‌ (ఏ20)లను శనివారం ఉదయం హైదరాబాద్‌లో అదుపులో తీసుకున్న సీబీఐ అధికారులు రాత్రి 11 గంటల సమయంలో గుంటూరులోని సీబీఐ ప్రత్యేకకోర్టులో హాజరుపరిచారు.విచారణకు హాజరుకావాలంటూ ఈ నెల పదో తేదీనే ఈ ముగ్గురికీ సీబీఐ అధికారులు సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 41 ఏ నోటీసులు ఇచ్చారు. దీంతో వీరు శనివారం హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. నిందితులు విచారణకు సహకరించట్లేదని పేర్కొంటూ వారిని అరెస్టు చేశారు.వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుంటూరుకు తీసుకొచ్చారు.రాత్రి 11 గంటల సమయంలో సీబీఐ ప్రత్యేకకోర్టు జడ్జి పొన్నూరు బుజ్జి ఎదుట హాజరుపరిచారు.

భారీ కుట్ర: సీబీఐ
న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమ పోస్టుల వ్యవహారంలో చోటుచేసుకున్న భారీ కుట్రలో వాస్తవాల్ని నిందితులు విచారణలో వెల్లడించలేదని సీబీఐ పేర్కొంది. ఆ కుట్రను వెలుగులోకి తేవాలంటే వారిని కస్టడీకి తీసుకుని విచారించాలని పేర్కొంది.

న్యాయమూర్తుల్ని దూషిస్తూ నిందితులు చేసిన వ్యాఖ్యల వెనక ఎవరున్నారు? వారిని ప్రభావితం చేసిన వ్యక్తులెవరు? ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు? మిగతా నిందితులతో వీరికి ఉన్న సంబంధాలేమిటి? తదితర అంశాల్ని రాబట్టాలని, అందుకు ఈ ముగ్గుర్నీ మూడురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ డీఎస్పీ బి.పి.రాజు కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు.అంతకుముందు వీరి అరెస్టుకు దారితీసిన కారణాల్ని వివరిస్తూ మూడు వేర్వేరు రిమాండు రిపోర్టులను జడ్జి ఎదుట ఉంచారు.

LEAVE A RESPONSE