Suryaa.co.in

Andhra Pradesh

సీఎస్ జవహర్‌రెడ్డిని తప్పించండి

పెన్షన్ పంపిణీ వ్యవహారంపై పేర్ని నాని, జోగి రమేష్ చంద్రబాబుపై దుష్ప్రచారం
బాలల హక్కులకు వ్యతిరేకంగా స్కూల్ పిల్లలను పెట్టుకొని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు
ప్రభుత్వ సలహాదారుడిపైనే కోడ్ ఉల్లంఘన కేసు నమోదైతే ఇక రాష్ట్ర బాగు కోసం ఏం సలహాలిస్తాడో?

– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
– ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన అధికారులు, అధికార పార్టీ నాయకులపై ఎన్నికల కమిషన్‌కు ఎన్డీఏ నేతలు ఫిర్యాదు

 

నేటికి ఎన్నికల కమిషన్‌కు ఎన్నో ఫిర్యాదులు చేశామని, అయినా ఇంకా కొంతమంది అధికారులు, అధికార పార్టీ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన చర్యలకు పాల్పడుతున్నారంటూ అదనపు ఎన్నికల ప్రధాన అధికారికి ఎన్డీఏ నేతలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, బిజెపి రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షడు షేక్ బాజి, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్వి అమ్మిశెట్టి వాసు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీ ఫిర్యాదు చేశారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెన్షన్ పంపిణీ వ్యవహారంపై తప్పుడు ప్రచారాలు, నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ… “సీఎస్ జవహర్ రెడ్డి ఎప్పుడూ జగన్ భజన చేస్తుంటాడు. పెన్షన్ పంపిణీ వ్యవహారంపై ప్రభుత్వం ఇంతలా అబాసుపాలు అవ్వడానికి సీఎస్ జవహార్ రెడ్డే కారణం. సీఎస్ పై చర్యలు తీసుకోకపోతే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదు. సీఎస్ జవహర్ రెడ్డిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టి ఆయన్ను నాన్ ఫోకల్ పోస్ట్‌లో పెట్టండని విజ్ఞప్తి చేశాం” అని తెలిపారు.

“వాలంటీర్ల చేత పెన్షన్‌లు పంపిణీ చేయించవద్దని చంద్రబాబు చెప్పలేదు. ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ పేర్ని నాని మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ…సస్పెండ్ అయిన వాలంటీర్లందరూ రండి..పింఛనుదారులను తీసుకువెళ్ళి అల్లరి చేయండని బాహాటంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ఫోన్ సంభాషనలను సైతం ఈసీకి సమర్పించాం” అని తెలిజేశారు.

“చిన్న పిల్లలు, ముఖ్యంగా 14 ఏళ్ళ లోపు పిల్లలు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకూడదు. కానీ జగన్ రెడ్డి మాత్రం మదనపల్లె సభలో స్కూలు విద్యార్ధులను కూర్చోబెట్టి ఫ్యాను గుర్తుకు ఓటు వేయండని 11 ఏళ్ళ బాలికతో చెప్పించాడు. ఇది బాలల హక్కులకు వ్యతిరేకం. ఇందుకు గాను ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలి. కౌన్సిలింగ్ పేరుతో ట్రైనింగ్ స్కూలుకు తీసుకెళ్ళి రాత్రంతా మా కార్యకర్తలను కర్నూలు ఎస్పీ రాత్రంతా చిత్రహింసలు పెట్టి కొట్టాడు. ఎందుకు కొట్టారని మా నాయకులు వెళ్ళి అడిగితే శాంతిభద్రలంటూ కారణం చెప్పాడు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారికి ఏ గతి పట్టిందో చూసైనా ఎస్పీ బుద్ది తెచ్చుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కర్నూలు ఎస్పీపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు అనే దుర్మార్గుడు పెన్షన్‌లను ఆపించాడని ఫన్నీ మినిస్టర్ జోగి రమేష్ దుష్ప్రచారాలు చేస్తున్నాడు. ఇలా దుష్ప్రచారాలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. అతను మాట్లాడిని విడియో క్లిప్పింగ్‌లతో సహా ఈసీకి ఫిర్యాదు చేశాం. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి” అని డిమాండ్ చేశారు.

బుద్ది ఉపయోగించి సలహాలు ఇవ్వాల్సిన ప్రభుత్వ సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించాడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని చంద్రశేఖర్ రెడ్డిపై తుళ్ళూరు పోలిస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఇక రాష్ట్ర బాగు కోసం సలహాలు ఏమి ఇస్తాడో తెలియదు. ఇటువంటి అధికారులు ఉంటే ఎన్నికలు సజావుగా సాగవు. ఇరు పార్టీల టీమ్‌కు సమానమైన గ్రౌండ్ కేటాయించిన ఎన్నికల ఆట ఆడుకునేటట్లు చేయండని ఈసీని కోరాం. మా అభ్యర్ధనలను విన్న అదనపు ఎన్నికల ప్రధానాధికారి సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మా ఫిర్యాదులను పరీక్షించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు” అని తెలియజేశారు.

LEAVE A RESPONSE