– పీఏను పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు
– ధర్మారెడ్డి అవినీతి చిట్టా నా దగ్గరుంది
– 50 కోట్ల కమిషన్ కోసం సత్రాలు కూల్చారు
– చైర్మన్కు 15 శాతం కమిషన్ ఇస్తేనే పనులు
– అందుకే ధర్మారెడ్డిని మార్చమని ఫిర్యాదుచేశాం
– సీఈసీ సానుకూలంగా స్పందించింది
– బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి సంచలన ఆరోపణలు
వివాదానికి కేంద్రబిందువుగా మారిన టీడీపీ ఈఓ ధర్మారెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధికార అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయనను తక్షణం అక్కడి నుంచి తప్పించాలని, దర్శనాలకు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆరోపించారు. ఒక పీఏను పెట్టి బెంగళూరు, మహారాష్ట్ర వంటి రాష్ట్రా్లల్లో ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వైనాన్ని త్వరలో బయటపెడతానని సంచలన ఆరోపణ చేశారు.
తిరుమలలో ఉండి స్వామి వారికి సేవలు చేయాల్సిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికార పార్టీ సేవలో తరిస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆయనపైన పూర్తి సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అనేక నియోజకవర్గాల ఇన్చార్జీలకు సుపథం, బ్రేక్ దర్శనాలు కేటాయించి దర్శనాలతో ఓట్లు లబ్దిగా పొందుతున్నారని, ఎన్నికల్లో అంగబలం, అర్థబలం సమకూర్చడానికే ఈ అధికారిని కొనసాగిస్తున్నారని అన్నారు.
అందుకే మార్చి 12న తిరుమలలో పని చేసే ఈవో సేవలు ఇంకా అవసరమని కేంద్రానికి సీఎం లేఖ రాశారన్నారు. రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను కాదని, ధర్మారెడ్డినే కొనసాగించాలా? మిగతా అధికారులపైన ముఖ్యమంత్రికి నమ్మకం లేదా? అని ప్రశ్నించారు.
అధికార దుర్వినియోగం చేసి, అనధికారికంగా ఓ పీఏను పెట్టుకుని దర్శనాలు చేయించి బెంగళూరు , ముంబాయి వంటి నగరాలకు చెందిన వారి నుంచి ఎక్కడికక్కడ ఎంత డబ్బులు తీసుకున్నారో వివరాలు తన వద్ద ఉందని… తొందర్లో బయటపెడతానని తెలిపారు.
వంద కోట్ల రూపాయలతో తిరుపతిలో పారిశుద్ధ్య పనులను దొంగదారుల్లో ప్రయత్నం చేశారని విమర్శించారు. తిరుపతిలోని రోడ్ల కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. 50 కోట్ల కమిషన్ కోసం ఇంకా 20 సంవత్సరాలు ఉపయోగపడే సత్రాలను కూలదోశారని మండిపడ్డారు.
టీటీడీలో ఏ పని జరగాలన్నా టీటీడీ చైర్మన్కు పది నుంచి 15 శాతం కమిషన్ ఇస్తే గానీ పనులకు అనుమతి లేదన్నారు. అందుకే ఈయన్ను కొనసాగించకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్కు సాక్ష్యాలతో ఫిర్యాదు చేశామని తెలిపారు.