Suryaa.co.in

Telangana

బేడ బుడగ జంగాలు విద్యా, ఉద్యోగ రంగాల్లో రాణించాలి

– మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి: ఆందోల్ నియోజకవర్గ స్థాయి బేడా బుడగ జంగాల ఆత్మీయ సమావేశం సంగారెడ్డిలోని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నివాసంలో జరిగింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతగా స్వీకరించి ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను, వివిధ సంఘాల వినతులను స్వీకరించి 2011 జనాభా లెక్కల ప్రకారం గా రూపొందించిన ఎంపరికల్ డేటా ఆధారంగా జనాభా, అక్షరాస్యత, వృత్తి, ఉపాధి, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ ను గ్రూప్ – I, II, III తరగతులుగా వర్గీకరణ చేసి రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ.

2011 భారత ప్రభుత్వం విడుదల చేసిన జనాభా లెక్కల ప్రకారం గా తెలంగాణ రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాల జనాభా 52 లక్షల 17 వేల 768 మంది గా ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. అందులో భాగంగా గ్రూపు – I లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గుర్తించింది . 15 కులాల జనాభా 1, 71, 625 గా (3.288 %) నిర్ధారించింది. వారందరి జనాభా దమాష ప్రకారంగా రావాల్సిన రిజర్వేషన్ 0.4 శాతం.

ప్రభుత్వం అత్యంత వెనుకబడిన 15 కులాలకు విద్యా, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో ప్రోత్సాహం అందించేలా వారికి 0.6 శాతం ను అదనంగా జోడించి మొత్తం 1 శాతం రిజర్వేషన్ ను అమలు చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో అత్యంత వెనుకబాటుకు గురైన బేడ బుడగ జంగాల (జనాభా 1లక్ష 11,710) , (2.141 శాతం) ను గ్రూపు – 1 లో చేర్చడం జరిగిందన్నారు. బేడ బుడగ జంగాల కులాలకు విద్యా, ఉద్యోగ రంగాలలో అవకాశాలు పెరుగుతాయన్నారు.

ఎస్సీ వర్గీకరణలో బేడ బుడగ జంగాల కులాలకు చెందిన వారు విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రభుత్వం కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు . సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ ఫలాలను బేడ బుడగజంగాలు అందిపుచ్చుకోవాలని ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ అవగాహన కల్పించారు. ఎస్సీ వర్గీకరణ ను సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా మంత్రి దామోదర్ రాజనర్సింహ వివరించారు.

ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న బేడ బుడగ జంగాల ప్రతినిధులు ఎస్సీ వర్గీకరణలో బుడగజంగాలను గ్రూపు – I లో చేర్చినందుకు కృషిచేసిన మంత్రి దామోద రాజనర్సింహ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జి. మల్లేశం, SC 57 కులాల అధ్యక్షులు బైరి వెంకటేష్, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంజయ్య, మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, ఆందోల్ నియోజకవర్గం ముఖ్య నాయకులు సురేందర్ గౌడ్, కిషన్, గోవర్ధన్, తదితరులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE