Suryaa.co.in

Andhra Pradesh

క్రైస్తవ పాస్టర్లు… ప్రభుత్వ వ్యవహారాలు

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయంలో ఒక సీనియర్ ఐ ఎ ఎస్ అధికారిని కలిసి చాలా రోజులు అయిందని జస్ట్ గ్రీట్ చేద్దామని ఈ మధ్య వెళ్ళాను. అప్పుడే టీడీపీకి చెందిన ఒక రాజ్యసభ సభ్యుడు కూడా వచ్చారు. ఆయన ఒక వినతి తీసుకొని వచ్చారు. క్రైస్తవ పాస్టర్లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం తొమ్మిది నెలల నుంచి పెండింగ్ లో ఉందని, ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ముందు ఒక మూడు నెలల డబ్బులు రిలీజ్ చేస్తే గుడ్ ఫ్రైడే… ఈస్టర్ పండుగ సమయంలో వాళ్ళు కొద్దిగా సంతోష పడతారన్నది ఆయన విన్నపం.

ఆ సమయంలో అక్కడ ఇంకో నాయకుడు కూడా ఉన్నారు. పాస్టర్లు రాజకీయంగా ఎవరితో ఉంటారని ఆయన ఆ ఎంపీని అడిగారు. నూటికి తొంభై శాతం వై సి పి పార్టీతో ఉంటారని, అయినా వారిని కూడా దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి గదా అని ఆ ఎంపీ బదులిచ్చారు. సీఎం కార్యాలయ అధికారి ఆ రాజకీయ చర్చ లోకి పోలేదు.

ఇవి విడుదల చేయడానికి పార్టీ నుంచి వాగ్దానం ఉందా… ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆ ఎంపీని అడిగారు. లోకేష్ గారు ఈ బకాయిలు ఇస్తామని వాగ్దానం చేశారని, సమస్యలు ఏవీ లేవని ఎంపీ చెప్పారు. సరే… నేను చూసుకుంటాను లెండి అని ఆ అధికారి భరోసా ఇవ్వడంతో ఎంపీ వెళ్లిపోయారు.

పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారు. రాష్ట్రంలో సుమారుగా ఎనిమిదన్నర వేల మంది ఈ వేతనం పొందుతున్నారు. మూడు నెలల వేతనం అంటే తొమ్మిది కోట్ల రూపాయలు. ఈ సంభాషణ జరిగిన రోజుకు గుడ్ ఫ్రైడే సరిగ్గా మూడు రోజులు ఉంది. బకాయిల విడుదలకు మార్చి నెల వరకూ పంపిన బిల్లులు మార్చి నెలాఖరుతో మురిగిపోతాయి.

ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. సంబంధిత శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బి ఆర్ వో) విడుదల చేయించుకొని అప్పుడు బిల్లు పెట్టాలి. డబ్బులు ఉంటే బిల్లు పాస్ అవుతుంది. లేకపోతే ఆగిపోతుంది. బిల్లు మంజూరైనా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళడానికి మళ్ళీ కొంత సమయం పడుతుంది. ఈ సంభాషణ అంతా వింటున్న నేను ఇంత ప్రాసెస్ ఈ రెండు రోజుల్లో కావడం అసాధ్యమని నా మనసులో అనుకొన్నాను. కనీసం 15- 20 రోజులు…. అదృష్టం బాగోలేక పోతే ఒక నెల పట్టవచ్చని నేను అంచనా వేశా.

ఎంపీ వెళ్ళి పోగానే సీఎం కార్యాలయ అధికారి రంగం లోకి దిగారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శికి ఫోన్ చేసి తొమ్మిది కోట్ల విడుదలకు బి ఆర్ వో జారీ చేయాలని ప్రపోజల్ పంపాలని ఆదేశించారు. ఫైనాన్స్ కార్యదర్శి ఎక్కడ ఉన్నారా అని ఆరా తీశారు. ముఖ్యమంత్రి వద్ద సమావేశంలో ఉన్నారని సమాధానం వచ్చింది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తున్నందువల్ల పాస్టర్ల వేతన బకాయిల విడుదలకు బి ఆర్ వో ఇవ్వాలని ఒక నోట్ తయారు చేసి ఇచ్చి ఫైనాన్స్ కార్యదర్శి బయటకు రాగానే ఆయన చేతిలో పెట్టాలని తన కార్యాలయ సిబ్బందిని ఒకరిని పురమాయించారు.

ఈ లోపు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఫోన్ చేశారు. ఈ క్వార్టర్ లో బకాయిలు 30 కోట్ల రూపాయల వరకూ విడుదల చేయడానికి అవకాశం ఉందని, ప్రపోజల్ తొమ్మిది కోట్లకు పెట్టాలా లేక ముప్పై కోట్లకు పెట్టాలా అని ఆయన అడిగారు. అవకాశం ఉంటే ముప్పై కోట్లకు పెట్టాలని సీఎం కార్యాలయ అధికారి సూచించారు. ఆ తర్వాత నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. రెండంటే రెండే రోజుల్లో… గుడ్ ఫ్రైడే కు ముందే పాస్టర్లకు ముప్పై కోట్ల రూపాయల బకాయిలు విడుదల కావడం… ఖాతాల్లోకి వెళ్ళడం జరిగిపోయాయి.

పాస్టర్ల సంఘం నాయకులు ఎవరూ రాష్ట్ర సచివాలయం చుట్టూ తిరగలేదు. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి వాళ్లేమీ టిడిపికి దగ్గర కాదు. వాళ్ళ కోసం రిప్రజెంట్ చేసిన ఎంపీ గాని… ఫాలో అప్ చేసిన సీఎం కార్యాలయ అధికారి గాని క్రైస్తవులు కాదు. వారిద్దరూ హిందువులు. ఎంపీ పేరు సానా సతీష్. ఆ అధికారి పేరు రాజమౌళి. వ్యవస్థ లో మంచి అధికారులు ఉంటే సాధారణ ప్రజలకు ఎంత తేలిగ్గా ఉపశమనం కలుగుతుందో ఇదొక ఉదాహరణ. ఆ అధికారిది యూపీ క్యాడర్. చంద్రబాబు పట్టుబట్టి ఆయనను తెచ్చారు.

– నూతక్కి భార్గవ

 

LEAVE A RESPONSE