Suryaa.co.in

Telangana

దక్షిణ భారతదేశంలో బీజేపీ అనూహ్య ఫలితాలు

– గ్రామాలనుంచి పట్టణాల వరకు ప్రతిచోటా మోదీ నాయకత్వానికి అన్నివర్గాల మద్దతు లభిస్తోంది
‑ ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400+ సీట్లు దాటడం ఖాయమన్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
– లిక్కర్ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేయడం సిగ్గుచేటు
– తప్పుచేస్తే, అవినీతికి పాల్పడితే.. ఎంతవారైనా వదిలిపెట్టబోమని మోదీ గారే స్వయంగా చెప్పారన్న కిషన్ రెడ్డి
‑ బీజేపీలోకి బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ను కండువాకప్పి ఆహ్వానించిన కిషన్ రెడ్డి
– ఈ సందర్భంగా.. రమేశ్ తో పాటుగా బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరిన.. వరంగల్ జిల్లాకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

17 మార్చి, 2024, హైదరాబాద్: సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తూ.. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి పాలనపట్ల ప్రజలనుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోందని కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ గారి పాలనపట్ల అభిమానంతోనే వేలాంది మంది ఇతరపార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారన్నారు.

ఆదివారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ను కండువా కప్పి బీజేపీలోకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోదీ గారి పాలన పట్ల ఆదరణ పెరుగోతందని.. దీని కారణంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి 400కు పైగా సీట్లను గెలుచుకునే లక్ష్యంతో ముందుకెళ్తోందన్నారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయన్నారు.

ప్రతి ఒక్కరి నోట.. మోదీ గారి మాట వినబడుతోందని.. గత పదేళ్లలో ఇసుమంత అవినీతికి కూడా తావులేకుండా.. సమగ్రాభివృద్ధి, పేదలు, అణగారిన వర్గాలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు మొదలైన వర్గాల సంక్షేమానికి ప్రజలు ఆకర్శితులై.. ‘మేమంతా మోదీ కుటుంబం’ అని గర్వంగా చెబుతున్నారన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పని అయిపోయిందని.. పదేళ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడటంతపాటుగా.. నిరంకుశ, నియంతృత్వ పాలనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలను ప్రజలు ద్వేషించారన్నారు.
కేసీఆర్ కూతురు కవితను మనీలాండరింగ్ కేసులో అధికారులు అరెస్టు చేయడం.. పూర్తిగా ఈడీ దర్యాప్తులో లభించిన ఆధారాలు, ఆమె దగ్గర, ఆమెతో కలిసి పనిచేస్తున్న వారు ఇచ్చిన వాంగ్మూలాల కారణంగానే కోర్టులో హాజరు పరిచారన్నారు.

బీజేపీకి, ఈడీకి సంబంధం లేదని.. తప్పుచేసింది ఎంతవారైనా.. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చర్యలు తప్పవన్నారు. చివరకు బీజేపీ కార్యకర్తలు తప్పుచేసినా వదిలిపెట్టబోమన్నారు.
అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకోవడం, సిగ్గులేకుండా మద్యం కుంభకోణంలో భాగస్వామి కావడం పట్ల పశ్చాత్తాప పడాల్సింది పోయి.. బీజేపీ మీద, మోదీ గారిమీద విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.

కోర్టు బోనులో తప్పుచేశామని ఒప్పుకుని.. న్యాయపరమైన చర్యలకు సహకరించాల్సింది పోయి.. ఏదో సాధించినట్లు మాట్లాడటాన్ని,సెల్‌ఫోన్లను ధ్వంసం చేసి.. ఆధారాల్లేకుండా చేసేందుకు ప్రయత్నించిన కవిత తీరును చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ‘తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు కవిత లిక్కర్ కుంభకోణంలో దూరారా? దీని వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా?’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తాను పర్యటిస్తున్నప్పుడు ఒక ఊళ్లో 16 బెల్టు దుకాణాలు ఉన్న విషయం చూసి ఆశ్చర్యపోయానని.. తెలంగాణలో బెల్టు షాపులను ప్రోత్సహించి.. ప్రజల రక్తం తాగిన కల్వకుంట్ల కుటుంబసభ్యుల బాటలోనే.. ఇవాళ్టి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

బీజేపీ తీరును ఇప్పుడు కాంగ్రెస్ కూడా విమర్శిస్తుండటం హాస్యాస్పదమన్నారు. దేశవ్యాప్తంగా అనేక అవినీతి కేసుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వందల కోట్ల రూపాయల నల్లధనంతో పట్టుబడిన విషయాన్ని మరిచారా? అని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.

తెలంగాణలో బీజేపీ 17 సీట్లు గెలిచే దిశగా కార్యకర్తలు కృషిచేయాలన్నారు. బీజేపీకి రోజురోజుకూ గ్రామాల్లోనూ బలోపేతం అవుతోందని.. ఇది ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోందన్నారు.

అంతకుముందు.. పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మాట్లాడుతూ.. దేశ ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్న మోదీ గారి నాయకత్వం పట్ల ఆకర్శితుడనై బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. దీనికితోడుగా ఎస్సీ ఉపవర్గీకరణ విషయంలో బీజేపీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని.. అందుకే తాను బీజేపీలో చేరానన్నారు. పదేళ్లలో ఒక్క అవినీతి మరకలేకుండా మోదీ గారు పాలన కొనసాగిస్తుండటం పట్ల.. గ్రామాల్లో యువత బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు, బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అయిన..ధర్మారావు, కొండేటి శ్రీధర్, జైపాల్, పొన్నాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఆరూరి రమేశ్ తో పాటుగా.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు తదతరులు పార్టీలో చేరారు.

LEAVE A RESPONSE