Suryaa.co.in

Telangana

తెలంగాణలో తిరిగి అధికారంలోకి రానున్నది బిఆర్ఎస్ పార్టీనే

వరంగల్ సభకు లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ ప్రజలు చెప్పిన సందేశం ఇదే
– రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను అన్యాయాలను మరింతగా ఎండగడతామన్న బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సందర్భంగా వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడంలో కీలకపాత్ర వహించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

లక్షల సంఖ్యలో ప్రజలు సభకు హాజరై, కేసీఆర్ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారని కొనియాడారు. నిన్నటి సభ ద్వారా భారత రాష్ట్ర సమితి మరోసారి అధికారంలోకి రాబోతోందని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు.దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా ఈ రజతోత్సవ సభ నిలిచిపోతుందని కేటీఆర్ తెలిపారు.

భారత రాష్ట్ర సమితి ప్రజా బలాన్ని ఈ సభ మరోసారి నిరూపించిందని గర్వంగా పేర్కొన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం విఫలమైనప్పటికీ, లక్షలాది మంది ప్రజలు ముందే సభ ప్రాంగణానికి చేరుకోవడం తెలంగాణ ప్రజల నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. భారీ ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ, సభ విజయవంతంగా పూర్తి కావడం గర్వకారణమని పేర్కొన్నారు.

నిన్న జరిగిన ఈ సమావేశం రజతోత్సవ సమావేశాల కార్యక్రమాలకు కేవలం ప్రారంభమాత్రమేనని ఆయన తెలిపారు. కేసీఆర్ స్వయంగా “నేనే ముందుండి పోరాడతాను” అని ప్రకటించడంతో, భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, ఇకపై ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని వెంటాడుతామని కేటీఆర్ అన్నారు.

ప్రజలను చైతన్యపరిచేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను, దోపిడీ చర్యలను మీడియా ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే అరాచకాలను, వారి ప్రచారాలను ఎక్కడికక్కడ ఎదుర్కొని ప్రజల్లో స్పష్టత తీసుకురావాలని, మరింత చురుకుగా ముందుకు సాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

పార్టీ శ్రేణులకు నాయకులకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. పార్టీ శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్
రాష్ట్ర పార్టీ నాయకులతో పాటు పార్టీ శ్రేణితో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున స్పందించి సభ విజయవంతం కావడంలో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రత్యేక కృషి చేసిన వరంగల్ జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ కార్యకర్తలకు కూడా కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సభా ప్రాంగణం వద్ద గత నెల రోజులుగా నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి ఫలితంగా ఈ సభ ఎంతో విజయవంతంగా జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. నాయకులందరి నిబద్ధత, కృషి వల్లనే ఇంత భారీ సభ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముగిసిందని ప్రశంసించారు.

స్థానిక శాసనసభ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా అధ్యక్షుల సమన్వయంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి కార్యకర్త సురక్షితంగా తమ ఇండ్లకు చేరుకున్నారని, ఇందుకోసం శ్రమించిన ప్రతి నాయకునికి, కార్యకర్తకు కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు ప్రతి ఒక్కరూ సభ విజయవంతం కావడానికే పని చేశారని కేటీఆర్ అభినందించారు.

ఈ భారీ బహిరంగ సభను పక్కా ప్రణాళికతో, ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతం చేయగలిగామని పేర్కొన్నారు. సభ విజయవంతం కావడానికి కృషి చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులకు, పార్టీ శ్రేణులకు, దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించిన సీనియర్ నాయకులకు, సోషల్ మీడియా వారియర్లకు కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వీరందరి కృషితో ఈ చారిత్రాత్మక సభ మరువలేని ఘట్టంగా నిలిచిందని చెప్పారు. అదేవిధంగా, మంచి కవరేజ్తో సభా కార్యక్రమాలను ప్రజలకు అందించిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A RESPONSE