Suryaa.co.in

Andhra Pradesh

ఎండల బాదుడు కంటే…వైసీపీ బాదుడే ఎక్కువ

-మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ మసై పోతుంది
-సంక్షేమ పథకాలు రద్దు చేసిన పేదల ద్రోహి జగన్
-రాష్ట్రంలో క్లాస్ వార్ కాదు…క్యాష్ వార్ నడుస్తోంది
-రాష్ట్రంలోని డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కే
-యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం..ఆక్వాకు పూర్వవైభవం తెస్తాం
-కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 చూడాలంటే కోలార్ వెళ్లాలి…కేజీఎఫ్-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి
-కేజీఎఫ్ అంటే….కాకాణి గోవర్థన్ ఫీల్డ్
-కాకాణి అక్రమాలపై పోరాడి చంద్రమోహన్ రెడ్డి బక్కచిక్కారు
-రూ.200 కోట్లు ఖర్చు పెట్టినా కాకాణి గెలుపు అసాధ్యం
-పొదలకూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

పొదలకూరు/సర్వేపల్లి : భగభగ మండే ఎండలకంటే జగన్ రెడ్డి ప్రభుత్వంపైనే ప్రజలు మంటగా ఉన్నారు. ఎండల బాదుడుకంటే వైసీపీ బాదుడే ఎక్కువగా ఉంది. రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుంది. మే 13న వైసీపీ మస్సయిపోతుంది. అహంకార ప్రభుత్వం కూలిపోవాలి. మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేయడానికే వచ్చాను. జగన్ రెడ్డి ఒళ్లంతా అహంకారం. దోపిడీ, విధ్వంసం తప్పంచి ఏమీ తెలియని జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిస్తున్నా.

కాకాణి టోల్ గేట్ తో కంటైనర్ టెర్మినల్ పరార్
కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చూడాలంటే కోలార్ పోవాలి. కేజీఎఫ్ 3 చూడాలంటే సర్వేపల్లి రావాలి. కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఫీల్డ్. అవినీతి మంత్రి పాతిపెట్టాలి. కాకాని మంత్రిగా మీకేమైనా సాయం చేశాడా? సర్వేపల్లి ఖర్మ. ఇలాంటి వ్యక్తిని మంత్రిగా గుర్తించాలంటే ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతుంది. అక్రమ టోల్ గేటు ద్వారా కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు వెళ్లిపోవడం వల్ల 10 వేల మంది ఉపాధి కోల్పోయారు. మితిమీరిన దోపిడీ, ఇష్టారాజ్యంగా జిల్లాను కొల్లగొట్టేశాడు. పోరాడి పోరాడి సోమిరెడ్డి బక్కచిక్కిపోతే దోచుకుని దోచుకుని ఒళ్లు బలిసింది . ఒక్క క్వాడ్జ్ లోనే 4 వేల కోట్లకు పైగా దోచారు. కోర్టులో ఫైల్స్ దొంగిలించిన దొంగ కాకాణి. నాటకాలరాయుడు. అన్నీ కక్కిస్తా. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగిచ్చి గుణపాఠం చెబుదాం. లీజు దారులను తరిమేసి దోచేసుకున్నారు.

కేజీఎఫ్ కాకాణిని ఓడించండి
జగన్ రెడ్డి వల్ల రైతులకు, కూలీలకు, మహిళలకు ఏమైనా మేలు జరిగిందా? ఇచ్చేది రూ.10 దోచేది రూ. 1000. ఏ స్కీమ్ అయినా స్కామ్ ఉంటుంది. భూగర్భ ఖనిజ సందప, సహజవనరులు మొత్తం దోచేశారు. జగన్ రెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డికి తోడు కాకాని తోడయ్యాడు. ఉదయగిరి నారాయణ అనే దళితుణ్ణి చంపేస్తే చర్యల్లేవు. ఇళ్ల పట్టాలకు 3 వేల ఎకరాలు కొని 6 ఎకరాలు చూపించి డబ్బులు కొట్టేశారు. కరోనాలో పెద్ద ప్యాలెస్ కట్టాడు. వైసీపీ అక్రమాలపై పోరాడితే సోమిరెడ్డిపై 22 కేసులు పెట్టారు.

నాపైన కేసులు పెట్టిన హీనుడు జగన్ రెడ్డి. భవిష్యత్ లో నేనేంటో చూపిస్తా. చక్రవడ్డీతో సహా తీర్చుకుంటా. ఖబడ్దార్ జాగ్రత్. నేను అనుకుంటే ఇలాంటి దుర్మార్గులను తుంగలో తొక్కేస్తా. ఎన్నికల్లో కాకాణి వందల కోట్లు గుమ్మరిస్తాడు. మందు పోసి మోసం చేస్తాడు. సోమిరెడ్డి దగ్గర డబ్బు లేదు. అలసిపోయాడు. పార్టీ కోసం పోరాడాడు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నాడు. మీ మీద నమ్మకంతోనే సోమిరెడ్డిని అభ్యర్థిగా పెట్టాను. దుర్మార్గపు కాకాణిని సోమిరెడ్డే ఢీ కొట్టగలడు. సమర్థుడైన సోమిరెడ్డిని గెలిపించుకోండి. కేజీఎఫ్ కాకాణిని ఓడించండి.

శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్ రెడ్డి
పెన్షన్ , రూ. 2కే కిలో బియ్య తెచ్చింది అన్న ఎన్టీఆర్. రూ. 200 నుంచి పదిరెట్లు పెన్షన్ పెంచింది నేనే. పేదలకు పండుగ కానుకలు ఇచ్చాం. ఐదేళ్లుగా వస్తున్నాయా? సన్నబియ్యం పేరుతో మోసం చేసిన సన్నాసి జగన్ రెడ్డి. జగన్ రెడ్డి టైం అయిపోయింది. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికన మహానాయకుడు ఎన్టీఆర్ దానికి కొనసాగింపుగా అభివృద్ధినీ జోడించి ముందుకెళ్లాను నేను. వందల సంక్షేమం అందించన మాతో మీకు పోటీనా? సంక్షేమానికి నువ్వెంత ఖర్చు పెట్టావ్ జగన్ రెడ్డి.

సంపద సృష్టించడం, ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం. క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ జరుగుతోంది. రాష్ట్రంలోని డబ్బంతా తాడేపల్లి కొంపకు పోయింది. నాశిరకం మద్యంతో మహిళల మాంగల్యాలు తెంచాడు. ఇసుకను కొల్లగొట్టాడు. ఒకప్పుడు ట్రాక్టర్ వెయ్యి. నేడు ఐదు వేలు. మిగిలిన నాలుగు వేలు జగన్ రెడ్డి జేబులోకి పోతున్నాయి. పేదలకు ఒక్క ఇల్లు అయినా కట్టాడా. సెంటు భూమిలో ఇల్లా..ఎన్డీఏ అధికారంలోకి రాగానే అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. ప్రతి పేదవాడికి రెండు సెంట్లు జాగా ఇచ్చి ఇళ్లు కడతాం. ఒక్క చాన్స్ అయిపోయింది. ఇక ఆటలు సాగవు. మళ్లీ ప్రజలు ఓటేయరు.

ఆక్వా పరిశ్రమకు పూర్వ వైభవం తెస్తా. రూ. 1.50 పైసలకే కరెంటు ఇస్తా. జాబ్ క్యాలెండర్ పెడతా. మొదటి సంతకం డీఎస్సీ పైనే పెడతా. సూపర్ సిక్స్ లో భాగంగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా. రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాను. పెన్షన్ కోసం వృద్ధుల జీవితాలతో చెలగాటమాడాడు.రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేశాడు. సైకోల నేచర్ అలా ఉంటుంది.

ప్రజలు జగన్ రెడ్డి చెవిలో పూలు పెట్టాలి
గొడ్డలి , కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడాయి. నేను జగన్ రెడ్డిపై గులకరాయి వేయించి హత్యాయత్నం చేశానంట. మీ చెవుల్లో పూలు పెడదామనుకుంటున్నాడు. అందరం కలిసి జగన్ రెడ్డి చెవిలో పూలు పెట్టాలి. గంజాయి కావాలో ఉద్యోగాలు కావాలో, అభివృద్ధి కావాలో విధ్వంసం కావాలో ప్రజలే తేల్చుకోవాలి. నకిలీ నవరత్నాలు కాదు…సూపర్ సిక్స్ తో ఆదుకుంటాం. యానాదుల్లో పేదరికం ఎక్కవ ఉంది. విద్యా, ఆరోగ్య, ఆదాయ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.

ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలోని యానాదులకు అభృవృద్ధి చేస్తాం. కృష్ణపట్నం పోర్టు కింద భూములు కోల్పోయిన వారికి రూ. 10 లక్షలు నష్టపరిహారం ఇస్తాం. ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. పనులు చేసే బాధ్యత మాది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర ప్రసాద్ లను గెలిపించండి. చట్టసభలకు పంపండి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ మనతో జట్టు కట్టాడు. జనసైనికులు, బీజేపీ క్యాడర్, టీడీపీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి. రాష్ట్రాభివృద్ధికే కూటమిగా ఏర్పడ్డాం.

మైనారిటీలను ఆదుకుంటాం. 2014లో మేము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం. మీకేమైనా అన్యాయం జరిగిందా?ముస్లిం సోదరులను ఆర్థికంగా ఆదుకుంటాం. సొంత చెల్లికి ద్రోహం చేసినవాడు రాష్ట్రానికి న్యాయం చేయడు. సిగ్గులేకుండా మాట్లాడే సైకోని ఓడించండి. డబ్బు, మద్యం, రౌడీయిజానికి భయపడొద్దు. ఉమ్మడి నెల్లూరు జిల్లా అన్ని సీట్లు ఎన్డీఏ కూటమికే దక్కాలి. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టండి’’ అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE