Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ఫక్తు రాజకీయ వ్యాపారి

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున

మా పార్టీ అభ్యర్థుల్ని మార్చితే మీకేంటి నొప్పి ?
రాబోయే ఎన్నికలకు సంబంధించి మా పార్టీ అభ్యర్థుల మార్పుల చేర్పుల్లో మా నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల మార్పులు, చేర్పులనేవి మా పార్టీ అంతర్గత వ్యవహారం. ఎన్నికల వ్యూహంలో గెలుపు తంత్రం కోసం అభ్యర్థులను మార్చుకోవడం అనేది రాజకీయాల్లో పరిపాటిగా వస్తున్న విషయమే. అయితే, పచ్చ మీడియా అధినేతలు రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడుకు ఏం సంబంధం ఉందని వారు ఉలిక్కిపడుతున్నారు. ఎందుకో వారందరూ విపరీతమైన భయంలో ఉన్నారు.

వారి వెన్నులో వణుకు, గుండెల్లో భయానికి కారణమేంటి..? మీ నాయకుడు చంద్రబాబు ఇక ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో మిగలడనా..? తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాజకీయాల్లో కనుమరుగవుతుందనా..? మీరు వెన్నుదన్నుగా ఉన్న పార్టీ అధికారంలోకి ఇక రాలేదనా..? ఎందుకంత ఆందోళనతో మీరు ఉలిక్కిపడుతున్నారు..? ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల సమరంలో మా అభ్యర్థుల్ని ఎవర్ని పెట్టుకుంటామో.. వారిని ఎలా గెలిపించుకుంటామో అనేది మా వ్యవహారం. అలాంటిది, మీకు సంబంధం లేని ఈ వ్యవహారంపై మీ పచ్చపైత్యపు రాతలెందుకు రాస్తున్నారు..? అని ప్రశ్నిస్తున్నాను.

పచ్చమీడియా ఊడిగానికి తోడైన పురంధేశ్వరిః
చంద్రబాబుకు పచ్చమీడియా పత్రికలు, చానళ్లు ఎటూ ఊడిగం చేస్తూనే ఉన్నాయి. రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడుతో ఆయన్ను గునపాలు పెట్టి పైకి లేపాలని ప్రయత్నిస్తున్నా.. చంద్రబాబు మాత్రం రాజకీయంగా అంగుళం కూడా పైకిలేచే పరిస్థితి కనిపించడంలేదు. వీళ్లందరితో పాటు కొత్తగా మరొకరు చేరారు. ఆమె ఎవరంటే, చంద్రబాబుకు బీ టీమ్‌ పురందేశ్వరి.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరి కూడా చంద్రబాబు బ్రాంచి ఆఫీసుగా ప్రతీరోజూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద, జగన్‌మోహన్‌రెడ్డి పైన విషం కక్కుతూనే ఉన్నారు. ఆమె పరిస్థితి ఎక్కడదాకా వెళ్లిందంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి మాట్లాతున్నారు. అమ్మా.. పురంధేశ్వరీ, ఎస్సీలపైన దాడుల చరిత్ర తెలుసుకోవాలంటే కారంచేడు ఘటనను గుర్తుకుతెచ్చుకో తల్లీ.. అక్కడ దళితుల ఊచకోత ఎలా జరిగిందో.. అగ్రకుల అహంకారంతో ఎస్సీలను ఏ విధంగా అణగదొక్కిందో తెలుసు కుంటే మంచింది. మరి, కారంచేడు ఘటనప్పుడు నువ్వెక్కడి పోయావు..? అలాంటి మీరు, ఈరోజు మా జగన్‌ని టార్గెట్‌ చేస్తూ ఎస్సీ, ఎస్టీల దాడుల గురించి మాట్లాడటం చాలా సిగ్గుచేటని తెలుసుకుంటే చాలా మంచిందని గుర్తుచేస్తున్నాను.

తండ్రికి వెన్నుపోటు పొడిచిన మరిది కోసం పురంధేశ్వరి పాట్లు
మీ నాన్న రెక్కల కష్టంతో నెలకొల్పింది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని అప్పన్నంగా లాగేసుకునేందుకు మీ మరిది చంద్రబాబు, మీ నాన్నను ఎలా వెన్నుపోటు పొడిచాడో మీకు తెలుసు. పార్టీని, జెండాను, ఎన్టీఆర్ ట్రస్టును, దాని ఆస్తుల్ని కూడా లాక్కుంటే మూగబోయిన నీ గళం మళ్లీ ఇన్నాళ్లకు మరిది బాగు కోసం వినిపిస్తున్నదా..? ఆనాడు, మీ తండ్రి ఎన్టీ ఆర్‌ గారు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే.. ఈరోజు అదే కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ దోస్తీ కట్టిన విషయం మీకు తెలియదా. మరోవైపు బీజేపీతో పొత్తుల కోసం ఆరాటపడుతుంది నిజం కాదా?. విలువలు, నైతికత, సిద్ధాంతం లేనటువంటి మీ మరిదికి సపోర్టు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు ఏవిధంగా అర్ధం చేసుకోవాలి..?. దయ్యాలు వేదాలు వల్లించినట్టు.. మీరొచ్చి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురించి మాట్లాడతారా..?

చంద్రబాబు బతుకంతా పొత్తులతో అంటకాగడమే..ః
నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం చూస్తే.. ఆయన పొత్తు పెట్టుకోని పార్టీ ఏమైనా ఉందా..?. ఆయన కాంగ్రెస్‌తో, బీజేపీతో, కమ్యూనిస్టులతోనూ.. ఆఖరుకు జనసేన పార్టీతోనూ పొత్తులు పెట్టుకున్నాడు. ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల ముందు నిలబడి గెలిచే దమ్ముంటే.. మూకుమ్మడిగా పార్టీల్ని కూడగట్టి పొత్తులు పెట్టుకోవడం ఎందుకు..? అలాంటి దమ్మూ, ధైర్యం లేదుకనుకనే చంద్రబాబు పరిస్థితి పొత్తుల వ్యవహారమైంది.

మంచి జరిగితేనే దీవించమన్న దమ్మున్న నేత జగన్‌
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చేస్తున్న నినాదం ఏంటో తెలుసా..? మన ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి కలిగి, మీ కుటుంబానికి మంచి జరిగితేనే మాకు ఓటేసి ఆశీర్వదించమని కోరుతున్న దమ్మున్న నాయకులు జగన్‌. నవరత్నాల సంక్షేమం రాష్ట్రంలోని ప్రతీ ఇంటింటికీ, గడప గడపకు అందించాము కనుకే, మేం ధైర్యంగా మా పార్టీ తరఫున పర్యటనలు చేస్తున్నాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి అక్కున జేర్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్ళినా ఇలాంటి పరిస్థితి ఉంది గనుకే, మా నాయకులు జగన్‌ రేపటి ఎన్నికల్లో ‘వై నాట్‌ 175’ అన్నారు.

LEAVE A RESPONSE