తపస్వి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు

• ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన తపస్వి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబునాయుడు
• పాలకులసేవలో తరిస్తూ పోలీస్ శాఖ శాంతిభద్రతల్ని విస్మరించబట్టే, రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణలేకుండా పోయింది
• ప్రేమెన్నాదులను కట్టడి చేయలేని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత?
• మూడున్నరేళ్లలో శాంతి భద్రతలపై ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించని బలహీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
• తపస్వి అంతిమయాత్రలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన వైద్య విద్యార్ధిని తపస్వి అంతిమయాత్రలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తపస్విని తల్లితండ్రులతో ఫోన్ లో మాట్లాడి ఓదార్చి, దైర్యం చెప్పారు. అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ…

టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో లేక, కొన్నిసార్లు అదే టెక్నాలజీ వెర్రితలలు వేసి కొందరి ప్రాణాలు తీస్తున్నందుకు బాధపడాలో అర్థంకాని పరిస్థితి, అగమ్యగోచర పరిస్థితి మనకళ్లముందు ఉన్నది. ప్రేమపేరుతో, అబద్ధాలు, మాయమాటలతో, ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టుగా టెక్నాలజీని ఉపయోగించి, యువతుల్ని మభ్యపరిచి, వారిని ట్రాప్ చేసి, వారి బంగారు జీవితాలను నాశనం చేస్తున్న ప్రేమోన్మాదుల అఘాయిత్యాలకు ఈ ప్రభుత్వం లో అంతులేకుండా పోయింది.

మొన్నటి రమ్య ఉదంతం నుంచి నిన్నటి తపస్వి హత్యవరకు ఇదేపరిస్థితి. ప్రేమపేరుతో యువతుల్ని ట్రాప్ చేసి, తరువాత ఒప్పుకోలేదని నిర్దాక్ష్యణ్యంగా వారిప్రాణాలు బలిగొంటున్నారు. మనరాష్ట్రంలో శాంతిభధ్రతలు క్షీణించి, అరాచకశక్తుల్ని అదుపుచేయలేని దుస్థితిలో రాష్ట్ర పోలీస్ శాఖ ఉంది. నిర్వీర్యమైన హోంశాఖ, అధికారంచేపట్టి మూడున్నరేళ్లైనా శాంతిభద్రతల్ని సమీక్షించలేని బలహీన ముఖ్యమంత్రిని చూశాక, ఇక మనరాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని గగ్గోలు పెట్టడం అర్థవంతమే. నిన్నటి తపస్వి కేసులో దుండగుడు ప్రేమ పేరుతో సదరు యువతి వెంటపడి వేధిస్తుంటే, బాధితులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆనాడే ఈ ప్రేమోన్మాదిపై పోలీసులు కఠినచర్యలు తీసుకొని ఉంటే, ఈ ఘటన జరిగేదికాదు, తపస్వి బలయ్యేదికాదు.

పోలీసుల ప్రధాన విద్యుక్తధర్మం మరిచి, ముఖ్యమంత్రికి పరదాలు కట్టడంలో, ఆయన సభలకు బారికేడ్లు ఏర్పాటుచేయడంలో, ప్రత్యర్థుల్ని వేధించడంలో, ప్రశ్నించే గొంతుకలను నొక్కడంలో నిమగ్నమై శాంతిభద్రతల్ని గాలికి వదిలేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి శాంతిభద్రతలు సమీక్షించి, మహిళల రక్షణకు ప్రాథాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రాణాలు కోల్పోయిన తపస్వి అంతిమయాత్రలో టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్యతో పాటు మాజీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ, పామర్రు టీడీపీ ఇన్ ఛార్జ్ వర్ల కుమార్ రాజా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply