సుప్రీం ఆదేశాలనూ పాటించరా?

-సీఐడీ తానంతట తానమే చట్టం చేస్తుందా?
-దారపనేనిని వెంటనే విడుదల చేయాలి
-డీజీపీకి చంద్రబాబు లేఖ

రాష్ట్రంలో సీఐడీ పనితీరు ప్రమాదకరంగా ఉందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను సీఐడీ పోలీసులు అర్ధరాత్రి వేళ, బ్యాడ్జీలు కూడా లేకుండా ఇంట్లోకి జొరబడి అరెస్టు చేయడం దారుణం అన్నారు. ఆ మేరకు డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు.. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరద్ధమని, సీఐడీ పోలీసులు కోర్టు ఆదేశాలను పాటించరా అని ప్రశ్నించారు. చంద్రబాబు లేఖ సారాంశం ఇదీ..

టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. సుమారు 7 మంది వ్యక్తులు రాత్రి సమయంలో నేమ్ బ్యాడ్జ్ లు కూడా లేకుండా నరేంద్ర ఫ్లాట్‌లోకి ప్రవేశించి, తాము సిఐడికి అని చెప్పి అతన్ని తీసుకువెళ్లారు.ఆరోగ్య సమస్యలు ఉన్న నరేంద్ర ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మొత్తం పోలీసు శాఖ బాధ్యత వహించాలి. ప్రతిపక్ష టీడీపీ నేతలు, క్యాడర్‌ను టార్గెట్ చేయడంలో సిఐడి పూర్తిగా నిమగ్నమైంది. సెక్షన్ 41A కింద నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది?ఇదే కేసులో అంకబాబును అరెస్టు చేసినందుకు కోర్టు సిఐడి పోలీసులకు షోకాజ్ నోటీసు జారీ చేసినవిషయం గుర్తులేదా? సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రాత్రి సమయంలో నరేంద్రను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? టీడీపీ కార్యాలయంపై వైఎస్‌ఆర్‌సిపి దాడి చేసి ఏడాది గడిచినా ఇప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

సిఐడి తనంతట తానే ఒక చట్టం అని భావిస్తుంది.వైఎస్సార్‌సీపీ ప్రతీకార రాజకీయాలకు సీఐడీ సహకారం విస్మయం కలిగిస్తోంది. అధికార పార్టీ ప్రయోజనాల కోసం సిఐడి దిగజారడం బాధాకరం. బాధితులను బెదిరించడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం కోసమే పోలీసులు ఈ తరహా అరెస్టులు చేస్తున్నారు.దారపనేని నరేంద్రను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ అరెస్టులు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాను.