-నేను సీఎం కావాలన్న ఆలోచనే లేదు
– పార్లమెంట్ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితం
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో చిట్ చాట్
కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం కావాలనే ఆలోచనలేదు… అలా అనుకోవడంలేదని, అలాగని ఏ పార్టీకి తాను టచ్లో కూడా లేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఒకరు సీఎం కావాలంటే హైకమాండ్ కూడా కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది కదా..! ఎవ్వరికీ (బీజేపీ) టచ్ లోకి వెళ్ళలేదు. అదంతా ప్రచారం అని కొట్టిపారేశారు. గురువారం సూర్య ప్రతినిధితో మనసువిప్పి మాట్లాడారు. మా ప్రభుత్వం ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయదు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. బీఆర్ఎస్ మీద మేము కక్ష పూరితంగా కేసులు పెడుతున్నామంటున్నారు. అవన్నీ గత ప్రభుత్వంలో వారు అధికార దుర్వినియోగంతో చేసిన తప్పులు అన్ని కనబడుతున్నాయన్నారు. జలాశయాల్లో నీరు లేకపోవడం, పంటలు ఎండిపోవడం వంటి ఫోటోలు, వీడియోలు పెట్టి కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాయి. మా ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్లో. రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వ ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉంది, కాని చేయాల్సిన పనులు చేయకుండా బాధ్యత విస్మరించి మాపై రాళ్ళేయడం తగదన్నారు. కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి రెండు ఎంపీ సీట్లు గెలిస్తే గొప్ప అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. మాకు ఎంఐఎం మద్దతు తెలపుతుంది. ఇతర పార్టీల నుండి మా పార్టీలోకి రమ్మని మేం ఎవరిని అడగటం లేదు. వారికై వారు స్వచ్ఛందంగా వస్తున్నారు. మేం గేట్లు ఎత్తలేదు. ఎత్తితే వరద ఆగదు. మేం చెప్పిందే చేస్తున్నం. గత పాలకుల అవినీతి మీద పోరాడుతూనే. డిస్టర్బ్ అయిన వ్యవస్థను దారిలో పెడుతున్నం. 5ఎకరాలకు రైతు బంధు అని చెప్పినట్టే ఇస్తున్నాం. జీతాల చెళ్ళింపుల్లో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమే. ఆ దిశగా పరిష్కారం కోసం పనిచేస్తున్నాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు వెనుకాడబోము. 14 స్థానాలు గ్యారెంటీగా గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ అవినీతి సొమ్ము అంతా కక్కిస్తాం అని హెచ్చరించారు. ధరణిలో జరిగిన అవినీతిని బయటకు తీస్తాం అన్నారు. ప్రధానిని కలిస్తే పొల్యూట్ అయినట్టు కాదు. రెండు సంవత్సరాలు కంటే ఎక్కువగా ఉన్న అధికారులను మొత్తం మార్చేస్తాం. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తాం…ధరణి లో మంచిని ఉంచుతాం.. భూమాత పోర్టల్ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.