Suryaa.co.in

Andhra Pradesh

ఎలక్షన్ కోసం కలెక్షన్ తప్ప.. కరువు తీవ్రత పట్టని సీఎం జగన్ రెడ్డి

వర్షాభావంతో సుమారు 30 లక్షల ఎకరాల్లో పంట సాగు నిలిచిపోయింది. రూ.20 వేల కోట్ల విలువైన దిగుబడి ఆగిపోయింది
60 శాతం లోటు వర్షపాతంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే వ్యవసాయ, ఇరిగేషన్ మంత్రులేమైపోయారు
కరువుపై కనీసం కేబినెట్ సమావేశంలో సమీక్షించలేనంత ఘనకార్యాలు మీరేం వెలగబెడుతున్నారు
రైతులు, ప్రజలు, వారి కష్టాలు పట్టని సీఎం జగన్ రెడ్డి ఆర్నెళ్లలో ఇంటికి పరిమితవడం ఖాయం
ఇప్పటికైనా నిద్ర మేల్కొని అన్ని మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించడంతో పాటు రైతులను ఆదుకునే ప్రయత్నాలు చేపట్టాలి
నంద్యాల జిల్లా బనగానపల్లిలో మీడియాతో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది..ఆహార ధాన్యాల ఉత్పత్తి ఘోరంగా పడిపోయింది..రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. సాగు, తాగునీటికి కొరత ఏర్పడింది.పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కీలక శాఖల మంత్రులేమో పత్తాలేరు.రైతులు ఇన్ని కష్టాల్లో ఉంటే వ్యవసాయ, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏమైపోయారో తెలియడం లేదు. కేబినెట్ సమావేశం నిర్వహిస్తే కరువు గురించి ఎలాంటి చర్చ చేపట్టకపోవడం దురదృష్టకరం. మంత్రులకే కాదు, సీఎం జగన్ రెడ్డికి కూడా రైతులు, ప్రజల కష్టాలపై శ్రద్ధ లేకుండా పోయింది. కరువు మండలాలతో తమకేం సంబంధమని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి సెలవిచ్చాడు. ఇంకెవరికి సంబంధమో?

రాష్ట్రంలో కరువు వస్తే మంత్రి పట్టించుకోకుండా, వ్యవసాయ శాఖ కార్యాలయంలోని సిబ్బంది బాధ్యత వహిస్తారా?2018లో కరువు పరిస్థితులు నెలకొంటే ఆగస్టులోనే 383 మండలాలు ప్రభావితమవుతున్నాయని ఉత్తర్వులు జారీ చేశాం.ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం అక్టోబర్ 30వ తేదీ లోపు కరువు మండలాలను ప్రకటించాలి. కానీ 31 వరకు మనోళ్లకు తీరిక లేదు.470 మండలాలుంటే, 103 మండలాలే కరువు ప్రభావితమైనవిగా ప్రకటించారు. అసలు ఈ రాష్ట్రంలో జరుగుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం వర్షపాతం లోటు ఉంది. పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం సరికాదు.మా ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతంలో రైతులు రెయిన్ గన్స్ ఇచ్చి పండ్ల తోటలు కాపాడాం. 80 శాతం సబ్సిడీతో ట్యాంకర్లతో నీటిని తరలించుకునే అవకాశం కల్పించాం.

ఈ రోజు మంత్రులతో పాటు అధికారులు ఎవరూ ఈ ప్రాంతంలో పర్యటించిన పాపాన పోవడం లేదు.బనగానపల్లిలో దద్దనాల చెరువుకు రూ.23 కోట్లు ఖర్చుతో ఎత్తిపోతల ద్వారా ఎస్ఆర్బీసీ నుంచి నీటిని తరలించే ప్రాజెక్టును అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిని ఒప్పించి బీసీ జనార్ధన్ రెడ్డి తీసుకొచ్చారు.దద్దనాల చెరువుకు నీటిని తరలిస్తే భూగర్భ జలాలు పెరగడం, మనుషుల తాగు, సాగు నీటి అవసరాలు తీరడంతో పాటు పశువులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది.వైసీపీ ప్రభుత్వంలో ఆ చెరువును పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎండబెట్టేశారు.రైతులు, రైతుబిడ్డలన్నా, మనుషులన్నా, పశువులన్నా వైసీపీ ప్రభుత్వానికి, జగన్ రెడ్డికి అంత నిర్లక్ష్యమెందుకో?

ప్రజల ఓట్లతో అధికారం చేపట్టిన పాలకులకు అంత అహకారం, కండఖావరం తగదు.నాలుగున్నరేళ్లలో కీలకమైన వ్యవసాయ శాఖను పూర్తి మూతవేసేయడం దురదృష్టకరం . పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో రెండు రోజులుగా కరువుతో దెబ్బతిన్న పంటలను మా బృందం పరిశీలిస్తోంది.మిర్చి పంటకు ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడుతున్నారు. నీళ్లు చాలక తోటలు నిలువునా ఎండిపోతున్నాయి.టీడీపీ ప్రభుత్వం తరహాలో 80 సబ్సిడీపై ట్రాక్టర్లతో నీటిని తోలుకునే అవకాశం కల్పించే వారు ఇప్పుడు లేకుండాపోయారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.నీళ్లు లేక సుమారు 24 లక్షల ఎకరాల్లో వరి పంటకు విరామం ప్రకటించేశారు. 6 లక్షల ఎకరాల్లో తోటల సేద్యం నిలిచిపోయింది..మొత్తంగా రూ.20 వేల కోట్ల విలువైన దిగుబడులు ఆగిపోయాయి.ఇంత భారీగా నష్టం జరుగుతుంటే కనీసం ఒక్క సమీక్ష నిర్వహించే తీరిక లేకుండా పోయిందా?

రైతులు నిలువునా నష్టపోతుంటే కేంద్రాన్ని అడిగి నిధులు తెచ్చే దమ్ము లేకుండా పోయింది.2018లో కరువు తీవ్రతను కేంద్రం దష్టికి తీసుకెళ్లి సుమారు రూ.1800 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయాలని కోరాం.కడప జిల్లాలో రూ.100 కోట్లకు పైగా రైతులకు ముందస్తుగా బీమా పరిహారం చెల్లించాం.తిత్లీ తుఫాను సంభవించిన సమయంలో సీఎంతో పాటు మంత్రులందరం వారం రోజుల పాటు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాం..సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే శ్రీకాకుళం నుంచి తిరుగుముఖం పట్టాం.బాధితులను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు నష్టపరిహారాన్ని ఎన్డీఆర్ఎఫ్ ప్రమాణాలకు మించి అందజేశాం.

ఏపీలో ప్రస్తుతం ప్రభుత్వం చచ్చింది. చట్టాలు జగన్ రెడ్డి కాళ్ల కింద నలిగిపోతున్నాయి. వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలు మూతపడ్డాయి.మా ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ పరిధిలో రూ.63 వేల కోట్లు ఖర్చుపెట్టాం.ప్రస్తుత స్టాండర్డ్ షెడ్యూల్ ధరలు(ఎస్ఎస్ఆర్) ప్రకారం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.90 కోట్లు ఖర్చుపెట్టాలి..కానీ సుమారు రూ.20 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు.ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ మూలనపెట్టేశారు. పోలవరం, వెలుగొండతో పాటు అనేక భారీ, మధ్యతరహా, చిన్న ప్రాజెక్టులను కూడా మధ్యలోనే ఆపేశారు. వచ్చే ఎన్నికల కోసం కలెక్షన్ తప్ప రాష్ట్రం, ప్రజలు, రైతులు సీఎం జగన్ రెడ్డికి పట్టడం లేదు.

ఇప్పటికైనా మేలుకుని రాష్ట్రంలోని 470 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించాలి.పత్తికి ఎకరాకు రూ.50 వేలు, మిరపకు రూ.50 వేలు, పొగాకుకు రూ.30 వేలు పరిహారం చెల్లించాలి, మొక్కజొన్న రైతులను కూడా ఆదుకోవాలి.80 శాతం సబ్సిడీపై ట్యాంకర్లతో నీటిని తరలించి తోటలను కాపాడుకునే అవకాశం రైతులకు కల్పించాలి.
మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లి నియోజకవర్గంలోని కరువు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లరావు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE