Suryaa.co.in

Telangana

కేసీఆర్‌తో దీక్ష చేయించింది కాంగ్రెస్ పార్టీనే!

– నాడు ఆయన ఆమరణదీక్ష విరమించుకోవాలన్నారు
– కానీ కాంగ్రెస్ పార్టీనే అడ్డుపడి దీక్ష కొనసాగేలా చేసింది
– మంద కృష్ణ మాదిగ, కోదండరామ్ ద్వారా కేసీఆర్‌పై ఒత్తిడి చేయించాం
– అందుకే అప్పుడు కేసీఆర్ దీక్ష కొనసాగించారు
– కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: నాడు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. కేసీఆర్ ఖమ్మంలో చేసిన ఆమరణ దీక్ష వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహం ఉందని, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడించారు. ‘‘అసలు ఆమరణ నిరాహారదీక్ష విరమించుకోవాలని భావించిన కేసీఆర్ దీక్షను, కొనసాగించేలా చేసిందే మా కాంగ్రెస్ పార్టీ. మా పార్టీనే ఆయనతో దీక్ష కొనసాగించేలా చేసింది. నేను నిజమే చెబుతున్నా. తెలంగాణ కోసం కేసీఆర్ త్యాగాలు చేశారు. కష్టాలు పడ్డారన్న దానిలో అనుమానమేమీ లేద’’ని జగ్గారెడ్డి కుండబద్దలు కొట్టారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్న సమయంలో ఒకానొక దశలో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కలిసి కోదండరాం, మంద కృష్ణ మాదిగ వంటి వారి ద్వారా ఆయనతో ఆమరణ నిరాహార దీక్షను కొనసాగింపజేశామని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వాతంత్రం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి సభ విజయవంతమైందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షాలకు సభలు నిర్వహించుకోవడానికి అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తెలంగాణ ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులను నిర్బంధాలకు గురిచేశారని ఆరోపించారు.

ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని.. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కూడా దక్కలేదని, కానీ తమ ప్రభుత్వం ఆ స్వేచ్ఛను కల్పించిందని స్పష్టం చేశారు.

రైతుల సంక్షేమం విషయంలోనూ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తోందని.. వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ప్రకటించడం ద్వారా రైతులకు గత ప్రభుత్వం కంటే అధిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు మాఫీ చేయడం గొప్పదో, లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే సంవత్సరంలో రూ. 22 వేల కోట్లు మాఫీ చేయడం గొప్పదో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ఐదు ఎకరాలు ఉన్న రైతుకు, రైతుబంధు ద్వారా రూ. 75 వేలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న రూ.500 బోనస్‌తో అదనంగా మరో రూ. 50 వేల వరకు లబ్ధి చేకూరుతుంది. ఇది రైతులకు సంతోషం కలిగించే విషయమే కదా? రైతు రుణమాఫీ విషయంలో ఎవరు గొప్పో ప్రజలే నిర్ణయిస్తార ని అన్నారు.

LEAVE A RESPONSE