Suryaa.co.in

National

స్పైవేర్ వివాదంపై నివేదికను బహిర్గతం చేయలేం

– దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన ఏ నివేదికనూ మేం బహిర్గతం చేయబోం
– అటువంటి నివేదికలను వీధి చర్చల పత్రంగా మార్చకూడదు
– సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం

న్యూఢిల్లీ: దేశ భద్రతకు సంబంధించిన నివేదికలోని అంశాలను బహిరంగ చర్చకు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. పెగాసస్ స్పైవేర్ వివాదంపై సాంకేతిక కమిటీ సమర్పించిన నివేదికను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పెగాసస్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన సున్నితమైన అంశాలున్నందున.. ఈ నివేదికను బయటపెట్టలేమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన ఏ నివేదికనూ మేం బహిర్గతం చేయబోం. అటువంటి నివేదికలను వీధి చర్చల పత్రంగా మార్చకూడదు అని వ్యాఖ్యానించింది. వ్యక్తిగత గోప్యతా ఉల్లంఘనకు సంబంధించిన ఆందోళనలను, పరిష్కరించే విషయాన్ని పరిశీలించవచ్చని ధర్మాసనం సూచనప్రాయంగా తెలిపింది. గోప్యతా హక్కుకు భంగం వాటిల్లిందని భావించే వ్యక్తుల నిర్దిష్ట కేసులను పరిశీలించే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.

LEAVE A RESPONSE