Suryaa.co.in

Andhra Pradesh

డబుల్ ఇంజన్ లా మంగళగిరిని అభివృద్ధి

-రాబోయే 20ఏళ్లకు సరిపడా మౌలిక సదుపాయాలు
-చిన్నతరహా పరిశ్రమలతో యువతకు ఉపాధి
-కల్పిస్తాం
మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్

మంగళగిరి: నేను, ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ డబుల్ ఇంజన్ మాదిరిగా పనిచేసి మంగళగిరి నియోజకవర్గాన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పైన్ వుడ్ అపార్ట్ మెంట్ వాసులతో యువనేత లోకేష్ సోమవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాబోయే 20ఏళ్లలో మంగళగిరి ప్రజలకు అవసరమైన రోడ్లు, తాగునీరు, అండర్ గ్రౌండ్, డ్రైనేజి, రైతుబజార్లు, శ్మశానవాటికలు తదితర మౌలిక సదుపాయల కల్పనకు అవసరమైన మాస్టర్ ప్లాన్ తమవద్ద ఉంది, గెలిపిస్తే అభివృద్ధి దిశగా మంగళగిరిని పరుగులు తీయిస్తామని చెప్పారు. చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుతో యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో రెండు కుటుంబాలు 25 ఏళ్ల పాటు పాలన సాగించారు. మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల, ఆళ్ల రామకృష్ణారెడ్డి హయాంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? టీడీపీ పాలనలో కేసులు వేసి మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిని ఆళ్ల రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. ఎమ్మెల్యేగా కనీసం ఒక్క డ్రెయిన్ అయినా కట్టారా? తాడేపల్లి వాసులకు తాగునీటి కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభిస్తే జగన్ వచ్చిన తర్వాత నిలిపివేశారు. ఎయిమ్స్ కసనీం నీటి సౌకర్యం కూడా కల్పించలేని దుస్థితిలో ఉన్నారు.

ప్రభుత్వానికి సమాంతరంగా సంక్షేమం పథకాలు
2019 ఎన్నికల్లో 5,350 ఓట్ల తేడాతో నేను ఓడిపోయాను. అయినప్పటికీ కసితో పనిచేస్తున్నా. మంగళగిరి నియోజకవర్గంలో 29 సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వానికి సమాంతరంగా మంగళగిరిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నా. వాటర్ ట్యాంకర్లు, ఆరోగ్య సంజీవని, పెళ్లి కానుక, చనిపోతే మట్టి ఖర్చులకు రూ.10వేల సాయం, వీవర్స్ శాల, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు వంటివి చేపట్టాం. ప్రతిపక్షంలో ఉండగానే ఇన్ని కార్యక్రమాలు చేపట్టాం. రేపు అధికారంలోకి వస్తే ఎన్ని కార్యక్రమాలు చేపడతామో ప్రజలు ఆలోచించాలి.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి కుళాయి తాగు సురక్షితమైన తాగునీరు అందిస్తాం. మంగళగిరిని బ్లాక్ డెవలప్ మెంట్ విధానంలో అభివృద్ధి చేస్తాం. రోడ్లు, డ్రైయిన్లు, పార్క్ లు, ఆసుపత్రి సదుపాయాలు కల్పిస్తాం. గత ఎన్నికల్లో ఓటమితో అనేక అవమానాలు ఎదుర్కొన్నా. శాసనసభ సాక్షిగా నా తండ్రి, తల్లిని అవమానించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుని 53,500 ఓట్ల భారీ మెజార్టీతో నన్ను గెలిపించండి. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఓర్పుతో ఉండి ఓటుహక్కు వినియోగించుకోండి. ప్రతిఒక్కరూ రోజూ పదిమందికి ఫోన్ చేసి చైతన్యవంతులను చేయండి.

జగన్ ముందు సద్దాం హుస్సేన్ దిగదుడుపే
టిడిపి ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు. అమరావతి అభివృద్ధి నిలిచిపోయింది. విట్, ఎస్ఆర్, అమృత వంటి యూనివర్సిటీలను చంద్రబాబు తీసుకువస్తే జగన్ రెడ్డి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అమరావతి కన్వెన్షన్, బీఆర్ఎస్ మెడికల్ అండ్ హెల్త్ సెంటర్, ఇండో-యూకే హెల్త్ కేర్ సెంటర్, హెచ్ సీఎల్(జీవో 424) వంటి సంస్థలు అమరావతి రాకుండా రద్దు చేశారు. హైదరాబాద్ ఐ ఇన్ స్టిట్యూట్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రాకుండా అడ్డుకున్నారు. వీటిల్లో సగం వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేది. చంద్రబాబుకు పేరువస్తుందనే దుగ్ధతో ఇవన్నీ చేశారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వ్యక్తిని ఇప్పటివరకు నేను చూడలేదు. జగన్ కంటే సద్దాం హుస్సేన్ చాలా బెటర్. విధ్వంస పాలనను ఎవరూ ఆమోదించరు. కులాల కురుక్షేత్రం నుంచి ప్రజలు బయటకు రావాలి. జరగబోయే ఎన్నికలు అధికార మార్పిడి వర్గాల కోసం కాదు.. తరాల భవిష్యత్ కోసం. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుని నన్ను,లోకేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

యువనేత ఎదుట తాడేపల్లి వాసుల విన్నపాలు
తాడేపల్లి పైన్ వుడ్ అపార్ట్ మెంట్ వాసులు తమ సమస్యలను లోకేష్ కు తెలియజేస్తూ… కనదుర్గ వారదిపై ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. కాజ్ వే నిర్మించి సమస్య పరిష్కరించాలి. కృష్ణానది పక్కనే ఉన్నా తాగునీటికి ఇబ్బంది పడాల్సి ఉంది. ఎగువభాగాన చెక్ డ్యామ్ లు నిర్మించి సమస్య పరిష్కరించాలి. హైదరాబాద్ కంటే తాడేపల్లిలో పన్నులు అధికంగా ఉన్నాయి. పన్నులభారం తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. డ్రైనేజీ వ్యవ్యస్థ సౌకర్యంతో పాటు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు. విజయవాడకు కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిని ఐటీ హబ్ గా మార్చాలని కోరారు. యువనేత లోకేష్ మాట్లాడుతూ… రాబోయే అయిదేళ్లలో అన్ని సమస్యలు ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తా. మంగళగిరిలో సుమారు 30వేలమంది స్వర్ణకారులు ఉన్నారు. గోల్డ్ సెజ్ ఏర్పాటుచేసి యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. చేనేతలకు అధునాతన మగ్గాలను ఏర్పాటుచేసి, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. చంద్రబాబుగారితో దెబ్బలాడి మంగళగిరి అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని యువనేత లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE