Suryaa.co.in

Devotional

వారణాశిలో దీపావళి

ఉత్తరప్రదేశ్ లోని అతి మహిమాన్విత శైవక్షేత్రం వారణాశి. దీపావళీ పర్వదినాన ఈ నగరమంతా దేదీప్యమానమై కళకళలాడుతూంటుంది.పవిత్ర గంగ ఒడ్డున వున్న 64 తీర్ధ ఘట్టాలలో మణికర్ణికా ఘట్టం అత్యంత పునీతమైనది.
అమ్మవారి మణికర్ణాభరణం,పరమశివుని కర్ణాభరణం గంగాతీర స్నానఘట్టంలోని బావిలో పడినవి. అవి రెండూ కలిసి శివలింగ రూపాన బయటికి వచ్చాయి.ఆ లింగమే మణికర్ణికేశ్వరునిగా పూజింపబడుతున్నది.
ఇక్కడ మణికర్ణికా అమ్మవారు కొలువై వున్నారు. అప్పటినుండే ఈ స్నాన ఘట్టం మణికర్ణికా ఘట్టంగా కీర్తించబడుతోంది. ఈ మణికర్ణికా ఘాట్ లో స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది అని భక్తుల ధృఢ విశ్వాసం.
దీపావళి నాడు మణికర్ణికా ఘట్టంలోను, దశాశ్వమేధ ఘట్టం లోను భక్తులు స్నానాలు చేసి పితృతర్పణాలు యిస్తారు. కాశీవిశ్వేశ్వరుని అభిషేకానికి పవిత్రగంగాజలాన్ని తీసుకువెడతారు.మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసినవారు తమ అంత్యకాలం తర్వాత నారాయణుడినో, పరమశివుడినో చేరుకుంటారని మణికర్ణికాష్టకంలో ఆదిశంకరాచార్యుల వారు తెలిపారు.
కాశీలో దీపావళి రోజున దశాశ్వమేధ ఘాట్, తులసీ ఘాట్, హనుమాన్ ఘాట్ మొదలైన ఘాట్లలో పవిత్ర స్నానాలు చేయడం వలన పుణ్యం లభిస్తుంది. ఒక్కొక్క ఘాట్ కి ఒక్కొక్క విశిష్టత, పురాణ కధ వున్నది.
హనుమాన్ ఘాట్ లో కామకోటీశ్వరుని ఆలయం వున్నది. మరణించిన వారిని హరిశ్చంద్ర ఘాట్ లో దహనం చేస్తారు. అక్కడే హరిశ్చంద్రుడు కాటికాపరిగా వుండేవాడు. హరిశ్చంద్రుడు ప్రతిష్టించిన శ్మశాన ఈశ్వరుడు ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు.
కాశీ నగరంలో పరాశక్తి అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, దుర్గాదేవి, వారాహి అని అనేక రూపాలలో దర్శనమిస్తున్నా, అధికార పీఠంలో కొలువై వున్నది మాత్రం అన్నపూర్ణాదేవి.దీపావళి నాడు అన్నపూర్ణాదేవి ఆలయంల చాలా వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. అన్నపూర్ణాదేవి సర్వాలంకార భూషితయై అనుగ్రహం ప్రసాదిస్తున్నది.ఎడమ చేతిలో బంగారు పాత్ర, కుడి చేతిలో బంగారు గరిటెలతో భిక్షనర్ధిస్తూ కపాల పాత్రతో నిలబడిన పరమశివుని కి ఆహారం అందించే భంగిమలో దర్శనమిస్తున్నది.అన్నపూర్ణ ఆలయంలోని మరో విశిష్టత , ఆలయం మొదటి అంతస్తులో బంగారు అన్నపూర్ణాదేవి గా భక్తులను కరుణిస్తూంటుంది. నరక చతుర్దశి నాడు మాత్రం పై అంతస్తు నుండి క్రిందకిదిగి వచ్చి భక్తులకు దర్శనం కటాక్షిస్తుంది. అభిషేకం, హారతి ఉచ్చికాలపూజలు అయ్యేక తెరమరుగవుతుంది బంగారు అన్నపూర్ణాదేవి.
మరునాడు దీపావళీ దిన ప్రాతఃకాలమున దర్శనమిస్తుంది. దీపావళి మరుసటి రోజున కూడా దర్శనం వుంటుంది. అన్నపూర్ణాదేవి ఒక ఉన్నత మండపం మధ్య పద్మాశీనురాలై నవరాత్నాలు బంగారు ఆభరణాలు ధరించి ఉంటుంది. బంగారు కవచం ధరించి కిరీటానికి పైన బంగారు ఛత్రముతో దర్శనం ఇస్తుంది.అన్నపూర్ణాదేవికి కుడిప్రక్కన ఐశ్వర్య నాయకియైన మహాలక్ష్మి , ఎడమప్రక్కన ఐశ్వర్యాన్ని తనలో దాచుకున్న భూదేవి, అన్నపూర్ణాదేవి కి ముందు భిక్షాపాత్రతో వెండికవచం ధరించిన విశ్వనాధుల దివ్యదర్శనం మామూలు రోజలలో కిటికీలో నుండి మాత్రమే చూడడానికి వీలవుతుంది.
కానీ ఒక్క దీపావళి నాడు మాత్రమే అమ్మవారిని నేరుగా దర్శించే అవకాశం లభిస్తుంది.ఆనాడు అన్నపూర్ణాదేవిని లడ్డూల రధంలో ఊరేగిస్తారు. ప్రజలంతా ఆ దివ్యదర్శనం చేసుకుని లడ్డూ ప్రసాదం పొంద వచ్చును. ఆనాడు నాదస్వరంతో అన్నపూర్ణాష్టకం వినపడుతుంది..ఈ ఆలయానికి కొంచెం దూరంలో విశాలాక్షి ఆలయం వున్నది. తమిళనాడు శిల్ప శైలిలో గోపురం విమానం వుంటాయి. పూజలు అర్చనలు అన్నీ తమిళ బాణీలో జరుపుతారు.నవరాత్రి , శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. కాశీకి వచ్చిన భక్తులు డుండి గణపతిని, సంకటమోచన హనుమంతుని కాశీ రక్షణనిచ్చే కాలభైరవుని ముఖ్యంగా దర్శిస్తారు.
కాశీలో హనుమన్ ఘాట్ లో కొలువైన హనుమంతుడు మహిమాన్వితుడు. దీపావళినాడు కొన్ని వేలమంది ఒంటికి నూనె రాసుకుని గంగా స్నానం చేస్తారు. గంగానది ఒడ్డున వరుసగా దీపాలు వెలిగించి, గంగా దేవికి పుష్పాలు సమర్పించి స్త్రీలు తాము దీర్ఘ సుమంగళులుగా వుండాలని ప్రార్ధిస్తారు. హనుమాన్ ఘాట్ లో కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, మదుర మీనాక్షి , ముగ్గురు దేవేరులు ప్రత్యేక సన్నిధులలో కొలువై ఉన్నారు.
ప్రతి సంవత్సరం దీపావళికి ముందు వచ్చే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, ఆ మరునాడు పాడ్యమి, ఆ నాలుగు రోజులు మాత్రమే ముగ్గురు దేవేరులు కలిసిన దర్శనం త్రిదేవి దర్శనంగా అనుగ్రహిస్తారు. గంగాస్నానం అనంతరం ఈ ముగ్గురు దేవేరులను దర్శిస్తే వంశాభివృధ్ధి, దీర్ఘసుమంగళిత్వం లభిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి.
కాశీ విశ్వనాధుని ఆలయానికి ఉత్తరాన ఒక మైలు దూరంలో కాలభైరవుని ఆలయం వున్నది. కాలభైరవుడు కాశీ నగర క్షేత్ర పాలకుడు. ఇక్కడ కాలభైరవుని స్వర్ణ ఉత్సవ విగ్రహం వున్నది. దీపావళినాడు కోలాహలంగా ప్రజలు తండోపతండాలుగా యీ స్వర్ణోత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు. కాశీకి వచ్చిన భక్తులు యీ స్వామిని దర్శించిన పిమ్మటే కాశీ నగరాన్ని వదలి వెళ్ళాలని ఐహీకం.
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE