Suryaa.co.in

Telangana

నోటికివ‌చ్చిన‌ట్టు మాట్లాడటానికి సిగ్గుందా? బుద్ది ఉందా..?

-బిఆర్ఎస్ నేత‌ల వ్యాక్యాల‌పై డిప్యూటి సీఎం భ‌ట్టి ఫైర్‌
-బిఆర్ఎస్ పాల‌న‌లో జ‌రిగిన దోపిడిని ప్ర‌జ‌ల ముందు పెడ్తాం
-డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాదును మార్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం

ఇంటికో ఉద్యోగం, ఊరికో బడి, కేజీ టు పీజీ, మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు క‌ట్టిస్తామని వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు నలభై రోజుల నిండని కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్యారెంటీలు అమలు చేయడం లేదంటూ నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడాటానికి సిగ్గుందా? బుద్ధి ఉందా? అంటూ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి వ‌ర్యులు భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు మండిప‌డ్డారు.

మంగ‌ళ‌వారం సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో వేర్వేరుగా జ‌రిగిన‌ జూబ్లీహిల్స్, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కమిటీ నాయకుల సమావేశానికి డిప్యూటి సీఎం భ‌ట్టి హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర సంపదను, వనరులను దోపిడీ చేసిన గత బిఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊభిలోకి నెట్టేసి పుట్టబోయే బిడ్డపై కూడా అప్పుల భారం మోపార‌ని దుయ్య‌బ‌ట్టారు.

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి పుట్టబోయే బిడ్డపై కూడా భారం మోపి ఆర్ధికంగా రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన గ‌త బిఆర్ఎస్ పాల‌కులు నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్ల‌డాటానికి సిగుండాల‌ని ఫైర్ అయ్యారు. పదేళ్ల పరిపాలన లో గత బిఆర్ఎస్ పాలకులు చేసిన దోపిడిని లెక్కలతో సహా బయటపెట్టి వారిని ప్ర‌జ‌ల ముందు దోషులుగా నిలబెడుతామ‌న్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో హైదరాబాదులో సృష్టించిన ఆస్తులను గత బిఆర్ఎస్ పాలకులు అమ్ముకొని బతికిరాని, హైద‌రాబాద్ అభివృద్దికి వారు చేసింది ఏమిలేద‌ని విమ‌ర్శించారు. మాట్ల‌డటానికి కూడ హ‌క్కు లేకుండా చేసిన బిఆర్ఎస్ స‌ర్కార్ ను బంగాళాఖాతంలో పడేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న‌ ప్రజల కలలను నిజం చేస్తామ‌న్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతామ‌ని, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్య్రంతో బతకడానికి కావలసిన వాతావరణం కల్పిస్తామ‌న్నారు.

డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాదును మార్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం
డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాదును మార్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమ‌న్నారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ పరిపాలన అందిస్తామ‌ని, ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి సంక్షేమమే తప్పా డ్రగ్స్ ఉండదన్న భ‌రోసా హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు క‌ల్పించాల‌న్నారు. హైదరాబాదు ప‌బ్బుల్లో డ్రగ్స్ విక్రయాల‌కు చోటు లేదని, నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. ప్రాంతాలు, మతాల పేరిట విభజన చేసి ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల ఉపేక్షించమ‌న్నారు.

అనేక మతాలు, కులాల ప్ర‌జ‌ల‌ను కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూస్తామ‌న్నారు. ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప‌ని చేస్తుంద‌న్నారు. రాష్ట్రంలో ప్రజల ధన, మాణ‌, ప్రాణాలను కాపాడడానికి పోలీస్ వ్యవస్థను పటిష్ట పరిచామ‌న్నారు. పోలీస్, రెవిన్యూ, హెల్త్ ,సివిల్ సప్లై, జిహెచ్ఎంసి అన్ని వ్యవస్థలను ప్రజలకు జవాబుదారీగా పనిచేయిస్తామ‌న్నారు.

ఈ వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌లు నా కోస‌మే ఏర్పాటు చేశార‌న్న భావ‌న క‌ల్పించే విధంగా ప్ర‌జా పాల‌న ఉంటుంద‌న్నారు. హైద‌రాబాద్ డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చ‌డం, మూసీ నది ప్రక్షాళన తో పాటు సుందరీకరణ చేసి హైద‌రాబాద్ ను అంద‌మైన సిటిగా అభివృద్ది చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు త‌యారు చేశామ‌ని, ప్ర‌ణాళిక బ‌ద్దంగా హైద‌రాబాద్ అభివృద్ది జ‌రుగుతుంద‌న్నారు.

రాహుల్ సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలి
దేశాన్ని ఏకం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. దేశ సంపద ఈ ప్రజలకే చెందాలని రాహుల్ గాంధీ చేస్తున్న పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయాలని కోరారు. లౌకికవాదం కలిగిన ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఇక్కడి బిడ్డనేన‌ని మతం పేరిట విభ‌జ‌న చేయ‌డం త‌గ‌ద‌న్నారు.

మత విభజన పేరిట వైశ్యామ్యాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న పార్టీలను పార్లమెంటు ఎన్నికల్లో దూరం పెట్టాలని ప్ర‌జ‌ల‌కు విజ్ఙ‌ప్తి చేశారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిజం చేస్తున్నామ‌ని, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్ర‌మాణం చేసిన రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోప‌ల‌నే మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంలో భాగంగా మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప‌థ‌కాన్ని ప్రారంభించామ‌న్నారు.

రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయాన్ని రూ.10ల‌క్ష‌ల‌కు పెంచామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10.50 కోట్ల మంది మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.
వ‌చ్చే నెల‌లో మ‌రో రెండు ప‌థ‌కాలు ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. ప్రభుత్వానికి ప్రజల మధ్యన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారధులుగా పని చేసి ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందేలా చూడాలన్నారు.

LEAVE A RESPONSE