Suryaa.co.in

Andhra Pradesh

2014-19మధ్య బీసీలకు ఏం మేలు చేశారో చెప్పే దమ్ముందా..?

– రాజ్యసభ సీట్లు అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుది
– అమర్నాథ్‌ హత్యకు రాజకీయ కారణాలు లేవు
– అమర్నాథ్‌ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకున్నాం
– నేతి బీరకాయ చందంగా.. బీసీలకు టీడీపీ న్యాయం
-ఎంపీ మోపిదేవి వెంకటరమణ

ఉనికి కోసం టీడీపీ పాట్లుః
ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు సర్వసాధారణం. కానీ, వాస్తవాల్ని నూటికి నూరుశాతం వక్రీకరించి.. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్లుగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కొత్త సంస్కృతికి తెరతీసింది. అబద్ధాలతో గ్లోబెల్స్‌ ప్రచారం చేయడమనేది తెలుగుదేశం పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఇందులో కొత్తేమీ లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ వారికి మద్ధతు తెలిపే కొన్ని ఇతర పార్టీలు కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నాయి. మరోవైపు చంద్రబాబు కొడుకు లోకేశ్‌ యువగళం పేరుతో కుల సంఘాల్ని కూడగట్టేందుకు డబ్బులు ఖర్చుపెట్టి సినిమా యాంకర్లను తెచ్చి సమావేశాలు పెడుతున్నాడు. చంద్రబాబు రాజకీయ కుట్రలను చూసి నేర్చుకున్న లోకేశ్‌ కూడా గ్లోబెల్స్‌ ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని పాట్లు పడుతున్నాడు.

అమర్నాథ్‌ హత్యకు రాజకీయ కారణాలు లేవు
నిన్న ఒంగోలులో బీసీ సభ పెట్టి, అందులో మా నియోజకవర్గం ( రేపల్లె)లో కిందటి నెలలో జరిగిన సంఘటనను ప్రస్తావించారు. అమర్నాథ్‌ హత్యకు గురవడంలో రాజకీయపరమైన కారణాలేమీ లేవు. బీసీ సదస్సుకు రేపల్లె నుంచి బాధిత అమర్నాథ్‌ కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లారు. అమర్నాథ్‌ చెల్లెలు, తల్లితో పచ్చి అబద్ధాలు మాట్లాడించారు. నిందితుల అరెస్టు విషయంలో పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని, ప్రభుత్వపరంగా సాయం చేయలేదని చెప్పించడం ఎంతవరకు సబబని టీడీపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నాను.
ఉగ్రవాద సంస్థల్లో పనిచేసేందుకు అమాయకుల్ని తీసుకొచ్చి వారికి శిక్షణ ఇచ్చి వారి చేత కొన్ని దుష్ట కార్యక్రమాలు చేయిస్తారు. అదేవిధంగా అభం శుభం తెలియని చిన్నారి(అమర్నాథ్‌ సోదరి)ని తీసుకొచ్చి ట్రైనింగ్‌ ఇచ్చి మరీ పచ్చి అబద్ధాలు మాట్లాడించడమనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని అందరూ ఖండించాల్సిందేనని కోరుతున్నాను.

హత్యకు గురైన విద్యార్థి, హత్యకు పాల్పడిన వారు కూడా ఇరువైపులా చిన్నపిల్లలే. నలుగురు ముద్దాయిలైన పిల్లల్ని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని, అరెస్టు చేశారు. ఆ తర్వాత వెంటనే కోర్టుకు రిమాండ్‌కు పెట్టారు. చట్టపరంగా ఉన్న సెక్షన్‌లు పెట్టి అరెస్టులు చేయడం జరిగింది. అంటే, సంఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు యాక్షన్‌ తీసుకున్నారు.

ఇంతవరకు పోలీసు పాత్ర అయితే, ఇక ప్రభుత్వం విషయానికొస్తే.. ఘటన జరిగిన సమాచారం తెలియగానే స్థానికంగా ఉన్న మేమంతా బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించాం. ఆ సమయంలో బాధితులు కోరిన మేరకు ప్రభుత్వం పరంగా సాయం అందించాలని మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘటనపై తీవ్రంగా చలించిపోయి, తక్షణ ప్రభుత్వ సాయంగా రూ.10 లక్షలు ప్రకటించారు. ఆమేరకు 24 గంటల్లోనే ఆర్థికసాయం చెక్కును తీసుకెళ్లి బాధితులకు అందజేశాం.

అలాగే వారు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కోరితే.. తక్షణమే స్థానికంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ ఆయా పోస్టును కూడా మంజూరు చేసి.. అప్పటికప్పుడు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా, బాధిత కుటుంబానికి ఒక ఇంటిస్థలం, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం శాంక్షన్‌ ఆర్డర్‌కు క్లియరెన్స్‌ కూడా తక్షణమే ఇచ్చాం.

అంటే, ప్రభుత్వపరంగా ఒక బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో 24 గంటలు కూడా పూర్తికాకుండానే మేము అన్ని విధాలుగా స్పందించాం. వారు కోరిన డిమాండ్లన్నీ నెరవేర్చాం. కారణమేమంటే, చనిపోయిన కుర్రవాడ్ని మనమెలాగూ ప్రాణాలతో తీసుకురాలేము కనుక మానవతాధృక్ఫథంతో ఎవరెంత సాయం చేయగలిగితే అంత సాయం అందించే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో మేము గానీ, ప్రభుత్వం గానీ ఎక్కడా అశ్రద్ధచూపకుండా గంట కూడా ఆలస్యం చేయకుండా స్పందించి ఆదుకున్న పరిస్థితులున్నాయని తెలియజేస్తున్నాను.

రిషితేశ్వరి తల్లిదండ్రులకు అపాయింట్ మెంటు కూడా ఇవ్వని దుర్మార్గుడు బాబు
చంద్రబాబు కుటుంబ సభ్యులు వాస్తవాలు మాట్లాడితే వారి తలలు వెయ్యివక్కలవుతాయనే నానుడి ఉంది. రాజకీయాల్లో పచ్చి అబద్ధాలకోరు చంద్రబాబే అని ఇన్నాళ్లూ అనుకుంటుంటే.. ఆయన కొడుకు లోకేశ్‌ ఈరోజు తండ్రిని మించి అబద్ధాల్ని అల్లి ప్రచారం చేస్తున్నాడు. ఆయన రాజకీయంగా ఎదిగాడు అని ఎవరైనా అంటే, వాస్తవాల్ని వక్రీకరించడంలో అందె వేసిన చెయ్యిగా లోకేశ్‌ తయారయ్యాడు. అమర్నాథ్‌ కుటుంబాన్ని ఆదుకుంది మా ప్రభుత్వమైతే.. కనీసం పట్టించుకోలేదని లోకేశ్‌ ఎలా మాట్లాడగలడు..?

బీసీల ద్రోహిగా చంద్రబాబుకు పేరుందని అతనికి తెలియదా..? నీ తండ్రి అధికారంలో ఉండగా, సీఎం కార్యాలయానికి సమీపంలో ఉన్న నాగార్జున యూనివర్శిటీ లో రిషితేశ్వరి అనే బీసీ విద్యార్థిని హత్యగావించబడింది. అప్పట్లో కనీసం బాధితురాలి తల్లిదండ్రుల్ని కలవడానికి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వని దుర్మార్గుడు నీ తండ్రి చంద్రబాబు కాదా..? అని ప్రశ్నిస్తున్నాను.

– అలానే మహిళా అధికారిణిపై మీ పార్టీ నేతలు చెయ్యి చేసుకుంటే, కనీసం వారిపై చర్యలు తీసుకునే సాహసం చేయనటువంటి నీచులు చంద్రబాబు, లోకేశ్‌లు.

ఈ సంఘటల పట్ల నువ్వెందుకు మానవత్వం చూపలేదని నీ తండ్రి చంద్రబాబును ప్రశ్నించే దమ్ముందా లోకేశ్‌..? అని అడుగుతున్నాను. కానీ, ఈరోజు మా జగన్‌ ప్రభుత్వం అలా కాదు. సంఘంలోని కొన్ని విద్రోహ శక్తుల వలన జరిగిన ఎలాంటి ఘటనపైనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి.. బాధిత కుటుంబానికి అండగా ఉంటూ వారిని ఆదుకోవడం, బాధ్యుల పై కఠినచర్యలు తీసుకోవడంలో ఎక్కడా వెనుకంజ వేయడంలేదు. దానికి ఉదాహరణ రేపల్లెలోని ఉప్పాలవారిపాలెం సంఘటనే అని మేం గుర్తుచేస్తున్నాం.

2014-19 మధ్య బీసీలకేం చేశారో చెప్పే దమ్ముందా..?
బీసీల్ని తామేదో ఉద్దరించామని..వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలు వెనుకబడి పోయారంటూ మైకు పట్టుకుని లోకేశ్‌ ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నాడు. స్థాయికి మించిన మాటలతో నోరుపారేసుకుంటు న్నాడు. 2014 నుంచి 2019 వరకు నీ తండ్రి అధికారంలో ఉండగా, బీసీ సామాజివర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయపరంగా మీ ప్రభుత్వం ఏం మేలు చేసిందో చెప్పాలని మేము అనేక సందర్భాల్లో సవాళ్లు విసురుతూనే ఉన్నాం. సమాధానం చెప్పడంలో మీరెందుకు భయపడి వెనుకంజ వేస్తున్నారు..? బీసీల భవిష్యత్తుకు, వారి అభ్యున్నతికి ఈ పథకాలు ప్రయోజనకరంగా మారాయని.. వాటిని మేమే అమలు చేశామని చెప్పే దమ్మూధైర్యం టీడీపీ నేతలకు లేదు.

జగన్‌ హయాంలోనే బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ గుర్తింపుః
బీసీ సామాజికవర్గ సోదరులంతా నా వాళ్లని వారిని అక్కునచేర్చుకున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మేం గర్వంగా చెబుతున్నాం. నవరత్నాల పథకాల ద్వారా బీసీలకు ప్రభుత్వసంక్షేమాన్ని అందిస్తూ వారి అభ్యున్నతికి దారులేస్తూ వారికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా గుర్తింపు తెచ్చిన నాయకుడు జగన్‌ని గుర్తుచేస్తున్నాను. ఇదేదో చంద్రబాబు మాదిరిగా మేము అబద్ధాలు చెప్పడంలేదు. ఆధారాలతో సహా గతంలో అనేక సందర్భాల్లో వివరించాం.

రాజ్యసభ సీట్లు అమ్ముకున్న చరిత్ర బాబుదిః
– రాజకీయంగా చూస్తే, బీసీలకు శాశ్వతంగా బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశాం. అసెంబ్లీ స్పీకర్‌తో సహా కేబినెట్‌లో 45శాతం (11 మంది) బీసీ మంత్రులున్నారు. రాజ్యసభ సీట్ల విషయానికొస్తే .. టీడీపీ ఏనాడూ బీసీల్ని పంపిన చరిత్రలేదు. బేరాలు పెట్టి మరీ పెత్తందార్లకు రాజ్యసభ సీట్లు కట్టబెట్టిన నీచమైన రాజకీయ చరిత్ర చంద్రబాబుది. అలాంటిది, మా నాయకుడు జగన్‌గారు వైఎస్‌ఆర్‌ సీపీ కోసం కష్టపడిన నలుగురు బీసీ వ్యక్తులకు రాజ్యసభ సీట్లు ఇచ్చాడని ఈరోజు మేం దీమాగా చెబుతున్నాం.
ఆరుగురు బీసీలకు వైఎస్‌ఆర్‌సీపీ తరఫున లోక్‌సభలో కూర్చొనే అవకాశాన్ని మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారు. ఇక, అసెంబ్లీ సీట్ల విషయానికొస్తే 31 మంది బీసీ ఎమ్మెల్యేలు, 19 మంది బీసీ ఎమ్మెల్సీలు, 56 బీసీ కార్పొరేషన్లు, స్థానికసంస్థల ఎన్నికల్లో 9 మంది మేయర్లు, 98 మంది మున్సిపల్‌ చైర్మన్‌లు, 9 మంది జెడ్పీచైర్మన్‌లు, 215 మంది జెడ్పీటీసీలుగా బీసీలున్నారు. ఓసీ కేటగిరిలోనూ బీసీల్ని చైర్మన్‌లుగా నిలబెట్టిన చరిత్ర మాది. ఇలాంటి చరిత్ర టీడీపీలో ఏనాడైనా ఉందా..? ఇది మా నాయకుడు జగన్‌ బీసీలకు రాజకీయప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి.

డీబీటీ, నాన్‌ డీబీటీల ద్వారా బీసీలకు లబ్ధి రూ.1.33 లక్షల కోట్లుః
చివరికి, ఉద్యోగాల కల్పన విషయంలో కూడా రాష్ట్రంలో 1.50 లక్షల మందికి సచివాలయ ఉద్యోగాలిస్తే.. అందులో 60శాతం మంది బీసీలున్నారు. ఆర్థికపరంగా చూస్తే, వివిధ నవరత్నాల పథకాలతో డీబీటీ, నాన్‌డీబీటీల ద్వారా బీసీలకు మొత్తం రూ.1.33 లక్షల కోట్లు లబ్ధిని అందించాం. ఇందులో కేవలం 30 శాతం కూడా బాబు అధికారంలో ఉండగా బీసీలకు అందజేసిన దాఖలాల్లేవు. అదే మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లల్లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఇంతపెద్ద ఎత్తున బీసీలకు ఆర్థికప్రయోజనాల్ని అందజేసిన చరిత్రను మనం గుర్తుచేసుకోవాలి.

బీసీ సంక్షేమంపై చర్చించే దమ్ముందా..?
బీసీ సామాజికవర్గ అభ్యున్నతికి చంద్రబాబు హయాంలో, 5 ఏళ్ళలో కేవలం రూ.16వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తే.. వైఎస్‌ఆర్‌పీపీ ప్రభుత్వం నాలుగేళ్ళల్లో బడ్జెట్‌లో రూ.82వేల కోట్లు కేటాయించడం జరిగింది. బాబు వేదికల మీద బాకాలు పట్టుకుని ఊదరగొట్టడమే కాదు.. మీ హయాంలో బీసీల అభ్యున్నతికి మీరేం చేశారో.. మేమేం చేశామో చర్చించే దమ్మూ ధైర్యం ఉందా..? లోకేశ్‌ దొడ్డిదారిన మంత్రిగా పనిచేసినంత మాత్రాన చేయనిది చేసినట్టు అబద్ధాలు ప్రచారం చేస్తూ.. మా ప్రభుత్వం మీద తప్పుడు మాటలు మాట్లాడం సరైంది కాదు.

బీసీలకు నీ తండ్రి ఏం చేశాడో కూడా తెలియకుండా మా ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నాలు చేస్తే మేం చూస్తూ ఊరుకోం.. నీకులా డబ్బులిచ్చి పెయిడ్‌ ఆర్టిస్టుల్ని పిలిపించుకుని జనాల ముందు ఫోజులు కొట్టి ఎన్ని పాదయాత్రలు, విహారయాత్రలు చేసినా ప్రజల్ని మీ మాయ మాటలతో మభ్యపెట్టలేరని హెచ్చరిస్తున్నాను.

బీసీలంతా జగన్‌ వెంటే..
బీసీల్లో వైఎస్‌ఆర్‌సీపీ పట్ల, జగన్‌ పట్ల అంతులేని విశ్వాసం పెరిగింది. ఇన్నాళ్లకు తమ బాధలను తీర్చి, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తింపునిచ్చి భవిష్యత్తుకు దారులేసే నాయకుడు జగన్‌ గారి రూపంలో వచ్చారని బీసీ సోదరులంతా భావిస్తున్నారు. చంద్రబాబు, వారి దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌తో పాటు లోకేశ్‌ ఇంకా వాళ్లకు తాళమేసే భజనబృందాలు ఎంతమంది విషప్రచారం చేసి ప్రజల్ని మాయచేసి మభ్యపెట్టాలని చూసినా.. ఫలితం మాత్ర ఏముండదు. రేపు 2024 ఎన్నికల్లో కూడా మరోమారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు బీసీ సోదరులంతా ఎదురుచూస్తున్నారు.

ఎంపీ బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. ఏమన్నారంటే
కులాల్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ఎంతటి హీనమైన పనులైన చేసే వ్యక్తి చంద్రబాబు. నేను గతంలో తెలుగుదేశంలో పనిచేశాను. బీసీలకు బాబు ఏదో ఊడబొడుస్తాడనుకుంటే.. బీసీల అభ్యున్నతికి ఆ పార్టీ పనిచేస్తుందంటే నేతిబీర కాయలో నెయ్యి ఎంత ఉంటుందో అంతేనని చెప్పుకోవచ్చు. బీసీల ఆదరణ కోల్పోయిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి పోతుందనే ఆందోళనలో చంద్రబాబు ఇప్పుడు పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన కొడుకు లోకేశ్‌తో నిన్న బీసీ సదస్సు అంటూ మాయమాటలతో అబద్ధాలు ప్రచారం చేయించాడు.

మా జగన్‌ బీసీల్ని అక్కునజేర్చుకున్నారు కనుకనే ఈరోజు మేమంతా ఇలా రాజ్యసభకు రాగలిగాం. చట్టసభల్లో కూడా బీసీ రిజర్వేషన్‌ వర్తించేలా .. ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుకు మా నాయకుడు జగన్‌ సూచనలతో మేమంతా ఆ బిల్లును పెట్టాం. మరి, గతంతో చంద్రబాబు హయాంలో వాళ్లెందుకు బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టకపోగా.. మేం పెట్టిన బిల్లుకు మద్దతు తెలియజేయడానికి కూడా ధైర్యం చేయని పరిస్థితి చంద్రబాబుది. అదేవిధంగా జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు దామషా ప్రకారం కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు ఉండాలని.. తద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని మేం పోరాడుతున్నాం.

ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఆయన మద్దతుదారులు మా ప్రభుత్వం మీద విషప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారి మాయ మాటల్ని నమ్మరు గాక నమ్మరని.. రాబోయే ఎన్నికల్లో మరోమారు జగన్‌నే ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజికవర్గాలన్నీ ఎదురుచూస్తున్నాయి.

LEAVE A RESPONSE