Suryaa.co.in

Andhra Pradesh

ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా!

-పసుపుజెండా ఎగరేస్తా…
-ప్రతిపక్షంలో ఉన్నా అహర్నిశలు సేవలందించా
-నేను చేసిన పనుల్లో 10శాతం కూడా ఆర్కే చేయలేదు
-పెన్షన్లలోనూ రాజకీయం చేస్తున్న దుర్మార్గుడు జగన్
-దుగ్గిరాల, పెరికలపూడి రచ్చబండ సభల్లో నారా లోకేష్

దుగ్గిరాల: గత ఎన్నికల్లో నేను ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అహర్నిశలు సేవలు చేస్తున్నా. రెండుసార్లు గెలిచిన ఆర్కే నేను చేసిన సంక్షేమంలో పదో వంతు కూడా చేయలేదని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల, పెరికలపూడి రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మీ అందరి ఆశీస్సులతో ఈసారి మంగళగిరిలో పసుపుజెండా ఎగురవేస్తా, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి దేశంలోనే ఆదర్శంగా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే పోరాడి అత్యధిక నిధులు తెస్తా. ఎన్నికల సమయంలో కరకట్ట కమలహాసన్ అద్భుతంగా నటిస్తారు, ఆ తర్వాత కన్పించకుండా పోతారు. ముఖ్యమంత్రి మంగళగిరికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రెండునెలల క్రితం పార్టీకి రాజీనామా చేశారు, మళ్లీ ఇప్పుడు జగన్ పంచన చేరారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి కనీసం నియోజకవర్గ ప్రజలకు తాగునీరు కూడా అందించలేకపోయారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో మోసపోయారు మరోసారి మాయమాటల నమ్మి మోసపోవద్దు.

సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం
టిడిపి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దుచేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారు. సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి – సంక్షేమాలను జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తాం. ప్రజల తరపున పోరాడినందుకే నాపై 22 కేసులు పెట్టారు, చంద్రబాబునాయుడు గారిపై తప్పుడు కేసులు పెట్టి 53రోజులు జైలులో ఉంచారు. కుంటిసాకులతో సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నారు, పెన్షన్లలో కూడా రాజకీయం చేస్తున్న దుర్మార్ముడు జగన్ ను రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా చైతన్యవంతులై తరిమికొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు. 3132 కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్ర నా దృష్టికి ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రజలకు అండగా నిలచేందుకు చంద్రబాబు పవన్ సూపర్ – 6 కార్యక్రమాలను ప్రకటించారు. ప్రజాప్రభుత్వం వచ్చాక గతంలో బీసీ, ఎస్సీ మైనారిటీలకు అమలుచేసిన సంక్షేమపథకాలను పునరుద్దరిస్తాం. హజ్ యాత్రకు వెళ్లేవారికి సాయం పెంచుతాం. ఏటా జాబ్ కేలండర్ తో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్ధరించి, వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

ఇంకా ఎంతమందిని పొట్టనబెట్టుకుంటారు?!
జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై పెద్దఎత్తున దాడులు పెరిగాయి. అమర్నాథ్ గౌడ్ అనే బాలుడు తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి తగులపెట్టారు. నిందితుడికి బెయిల్ వస్తే ఊరేగింపుతో తీసుకెళ్లారు. సీఎం సొంత జిల్లాలో చేనేత సోదరుడు సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు వైసీపీ ఎమ్మెల్యేనే కారణం. ఆయన భూమిని బినామీల పేరుతో కబ్జా చేయడంతో వారి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దళితులను కూడా వదిలిపెట్టలేదు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం, పలమనేరులో మిస్బా ఆత్మహత్యకు వైసీపీనే కారణం. నర్సరావుపేటలో వక్ఫ్ భూముల కోసం పోరాడిన ఇబ్రహీంను నడివీధిలో నరికి చంపారు. ఇంకా ఎంతమందిని పొట్టబెట్టుకుంటారు? ముస్లిం సోదరుల విషయంలో వైసిపి పేటిఎం బ్యాచ్ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. మైనార్టీలను కంటికిరెప్పలా కాపాడెుకుంటాం.

యువనేత దృష్టికి సమస్యల వెల్లువ
దుగ్గిరాల వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఇంటి స్థలాలు ఇవ్వాలి. ఎస్సీలకు ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ భవనం నిర్మించాలి. నిరుద్యోగ యువతకు లోన్లు ఇవ్వాలి. స్మశాన వాటిక, ఆరోగ్యకేంద్రం అభివృద్ధి చేయాలి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల వల్ల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

పెరికలపూడి వాసులు తమ సమస్యలను చెబుతూ… ప్రభుత్వాసుపత్రి లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడుతున్నాం, తెనాలి వెళ్లాల్సి వస్తోంది. గ్రామానికి రవాణా సౌకర్యం లేదు, ప్రస్తుతం ఒకే ఒక బస్సు నడుస్తోంది. పంచాయితీ పరిధిలో వీధిదీపాలు ఏర్పాటుచేయాలి. స్కూలు పిల్లలకు ప్లే గ్రౌండ్ అభివృద్ధి చేయాలి. గ్రామంలో క్రిస్మియన్ శ్మశాన వాటిక ఏర్పాటుచేయాలి. మోరంపూడి రోడ్డు వేయాలి, వంతెన నిర్మించాలి. గ్రామంలో 7వతరగతి వరకు స్కూలు ఉంది, 10వతరగతి వరకు అప్ గ్రేడ్ చేయాలి. పంటలు నిల్వ చేసుకోవడానికి గోడౌన్ నిర్మించాలి. యువనేత లోకేష్ స్పందిస్తూ… దుగ్గిరాల గ్రామంలో భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తాం. కుళాయి ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తాం. మంగళగిరి-తెనాలి రోడ్డు నిర్మించడంతో పాటు అంతర్గత రహదారులు కూడా అభివృద్ధి చేస్తాం. దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తాం. ఇళ్ల పట్టాలు ఇవ్వడంత పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామని యువనేత లోకేష్ హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE