Suryaa.co.in

Andhra Pradesh

భువనమ్మ వచ్చింది..భరోసా ఇచ్చింది పేరుతో పాట

-నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం పై పాట ఆవిష్కరణ
– పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించిన టీడీపీ నేతలు

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి కార్యక్రమం పై పార్టీ నాయకులు దారపనేని నరేంద్ర, పెద్ది వంశీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘‘భువనమ్మ వచ్చింది-భరోసా ఇచ్చింది’’ అనే పాటను పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు ఆవిష్కరించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో పార్టీ కార్యకర్తలు మనస్తాపానికి గురై 206మంది మృతిచెందారు. వారి కుటుంబాలను నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పేరుతో పరామర్శించి, వారిని ఆదుకుంటున్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ నాయకులు రూపొందించిన పాటను పార్టీ సీనియర్ నాయకులు ఎం.ఏ.షరీఫ్, టీడీ జనార్థన్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బీ.టీ.నాయుడు, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, నీలాయపాలెం విజయ్ కుమార్, మర్రెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాదెండ్ల బ్రహ్మంచౌదరి తదితరులు ఆవిష్కరించారు.

కుటుంబ పెద్దలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేస్తున్న భువనమ్మ భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. ‘‘భువనమ్మ వచ్చింది-భరోసా ఇచ్చింది’’ పాట ఆవిష్కరణ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా 206మంది కార్యకర్తలు చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతిచెందారు. ఇప్పటి వరకు నారా భువనేశ్వరి 33రోజుల్లో, 10 విడతలుగా, 20 పార్లమెంటు నియోజకవర్గాలు, 66అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 6,092కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి 149మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థికసాయం అందించి వారిలో మనోధైర్యాన్ని నింపారు.

చదువుకుంటున్న కార్యకర్తల కుటుంబాల్లో కొంతమందికి ఎన్టీఆర్ ట్రస్టులో చదువుకునేందుకు పూర్తిబాధ్యతలను భువనేశ్వరి చేపట్టారు. మీకు కష్టం వస్తే పార్టీ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందనే నమ్మకాన్ని కార్యకర్తల కుటుంబాల్లో నింపారు. మిగిలిన కుటుంబాలను కూడా భువనేశ్వరి పరామర్శించి మీకు నేనున్నానంటూ ముందుకు కదులుతున్నారు అని అన్నారు. కార్యక్రమంలో పరుచూరి కృష్ణ, వల్లూరి కిరణ్, ఎస్.పి.సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE