రైతులను ఏ పార్టీ ఆదుకుందో ఆలోచించాలి

-మంత్రి హరీశ్‌రావు
రైతులను ఆదుకున్న పార్టీ ఏదో ప్రజలు ఆలోచన చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజురాబాద్‌లో రైతులు, విత్తన ఉత్పత్తి దారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ..మీరంతా మట్టిని, వ్యవసాయాన్ని నమ్ముకున్నవారు. మట్టిని నమ్ముకున్న వారిని పైకి తీసుకువచ్చిన పార్టీ ఏది.
రైతును ఆదుకున్న పార్టీ ఏది అన్నది ఆలోచించాలన్నారు. ఎన్నికలు వచ్చాయని ఆగం ఆగం కావొద్దన్నారు. రైతాంగాన్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. హుజూరబాద్‌లో కాంగ్రెస్ లేదు. డిపాజిట్ రాదు. దాని కోసం మాట్లాడటం దండగ అన్నారు. టీఆర్ఎస్ – బీజేపీ పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఏ తోవలో పోవాలో ఆలోచించుకోవాలన్నారు.
న్యాయానికి – ధర్మానికి , అన్యాయం- అధర్మానికి మధ్య పోటీ నడుస్తోందన్నారు. 2014 లో గులాబీ జెండా ఎగరక ముందు రైతు పరిస్థితి ఏలా ఉంది..ఆ తర్వాత రైతు పరిస్థితి ఎలా ఉందో గుర్తుకు తెచ్చుకుందామని మంత్రి తెలిపారు. ఎరువులు కావాలంటే గతంలో పోలీస్ స్టేషన్ ముందు క్యూ కట్టేవాళ్ళమన్నారు. కేసీఆర్ వచ్చాక రైతుల పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు.
రైతుల జీవితాల్లో వెలుగును నింపాలని రైతు బంధు, బీమాలు తెచ్చారని హరీష్‌రావు పేర్కొన్నారు. బీజేపీ ధరలు పెంచి… దొడ్డు వడ్లు కొనమంటోందన్నారు. 7 ఏళ్ళు మంత్రిగా ఉండి ఈటల ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదన్నారు. సంజయ్ ఎంపీగా గెలిచి పది రూపాయల పని చేయలేదని హరీష్ రావు పేర్కొన్నారు. సబ్సిడీలు ఇచ్చి రైతును ఆదుకునే టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారా..రైతుల ఉసురు పోసుకునే బీజేపీకి ఓటు వేస్తారా ఆలోచన చేయాలన్నారు.
కారుతోనే భవిష్యత్తు. కారు గుర్తు గెలుపులోనే హుజూరాబాద్ ప్రజల అభివృద్ధి ఇమిడి ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను ఆశీర్వదించాలన్నారు. అలాగే సీడ్ గ్రోవర్స్ అసోషియేషన్‌కు ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తాం విత్తనోత్పత్తి ఇక్కడే ఎక్కువ జరుగుతోంది. రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా. మీకు స్థలమే కాకుండా భవన నిర్మాణానికి ఆర్థిక సాయం ప్రభుత్వం తరపున చేస్తామని మంత్రి హామీనిచ్చారు.

Leave a Reply