Suryaa.co.in

Andhra Pradesh

జత్వానీ కేసులో నిఘా మాజీ దళపతి పీఎస్సార్ అరెస్ట్

– హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు
– సీఐడీ ఆఫీసులో 7 గంటలపాటు విచారణ
– గుంటూరులో ఆయనపై మరో కేసు
– తనను తుపాకీతో బెదిరించారని ఉద్యోగనేత సూర్యనారాయణ ఫిర్యాదు
– రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులోనూ నిందితుడే
– ఆ రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్?
– తాజా అరెస్టుతో చల్లబడిన టీడీపీ సోషల్‌మీడియా

అమరావతి: జగన్ జమానాలో టీడీపీ అగ్రనేతల అరెస్టు వ్యవహారాల్లో అంతా తానై చక్రం తిప్పిన నాటి నిఘా దళపతి పీఎస్సార్ ఆంజనేయులను, సినీనటి జత్వానీ కేసులో సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కుందన్‌బాగ్‌లోని ఆయన నివాసం నుంచి విజయవాడకు తీసుకుని వచ్చిన పోలీసులు.. దాదాపు 7 గంటలపాటు పీఎస్సార్‌ను విచారించారు. బుధవారం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు.

కాగా పీఎస్సార్‌పై ఇప్పటికే గుంటూరులో ఒక కేసు నమోదయింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న తనను ఆయన తుపాకీ చూపి బెదిరించారని సూర్యనారాయణ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
నటి కాదంబరి జెత్వానీని అప్పటి ప్రభుత్వం పెద్దలు చెప్పిన మేరకు ముంబై నుంచి ఇక్కడకు తీసుకొచ్చి, వీటీపీఎస్‌కు సంబంధించిన గెస్ట్‌హౌస్‌లో ఉంచి వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. నటి కుటుంబసభ్యులపై కూడా కేసులు పెట్టి వేధించారు.

ఓ పారిశ్రామికవేత్తపై ఉన్న కేసును విత్‌డ్రా చేసేందుకు తనను ఇలా ఇబ్బందులకు గురిచేశారని నటి ఆరోపించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తనకు న్యాయం చేయాలంటూ నటి కోరారు. ఆ సమయంలో ఈ వ్యవహారాన్ని అధ్యయనం చేసిన కూటమి ప్రభుత్వం, సీఐడీకి ఈ కేసును అప్పగించింది.

కేసు నమోదు చేసిన సీఐడీ, ఈ కేసులో భాగ్యస్వాములైన పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, క్రాంతి రాణా టాటాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే విశాల్‌ గున్నీ, క్రాంతి రాణా టాటా కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోగా, పీఎస్‌ఆర్ మాత్రం బెయిల్‌ కూడా దరఖాస్తూ చేసుకోలేదు.

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా..
మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కూడా పీఎస్‌ఆర్‌పై అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండు కేసులకు సంబంధించి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆయనను కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ తరలించనున్నారు. ఆ తరువాత కోర్టు ద్వారా అనుమతి పొందిన అనంతరం, ఒక్కొక్క కేసుపై పీటీ వారెంట్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి కూటమి సర్కారు పీఎస్సార్‌ను అరెస్టు చేయడం ద్వారా, సోషల్‌మీడియా కార్యకర్తలను సంతృప్తి పరిచినట్టయింది. పీఎస్సార్, సునీల్‌ను ఇంకా ఎందుకు అరెస్టుచేయడం లేదంటూ కార్యకర్తలు సోషల్‌మీడియా వేదికల ద్వారా తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీఎస్సార్‌ను అరెస్టు చేయడం ద్వారా, వారి అసంతృప్తికి తెరదించింది.

LEAVE A RESPONSE