Suryaa.co.in

Political News

కేసీఆర్ నుంచి కేటీఆర్ దాకా…..

ఒక రాజకీయ పార్టీ ఇరవై ఏండ్ల పాటు మనగలగడం విశేషం కాకపోవచ్చును.కానీ ఒక లక్ష్యం కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీ ఆ లక్ష్యాన్ని సాధించి,రాజకీయ అధికారాన్ని కూడా కైవసం చేసుకోవడం అసాధారణమే.పైగా ఉద్యమసారథే ముఖ్యమంత్రిగా జనరంజక పాలన సాగించడం మామూలు విషయం కాదు.తెలంగాణ రాష్ట్రం అరవై ఏండ్ల డిమాండ్.దాన్నిటిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ సాకారం చేశారు.ఆ చారిత్రక సన్నివేశానికి పధ్నాలుగేండ్ల పాటు నిర్విరామంగా ‘యుద్ధం’ సాగింది.”ముందుగా సంకల్పం ఉండాలి.సంకల్పించిన తర్వాత దాన్ని గట్టిగా పట్టుకోవాలి.ఎట్టి పరిస్థితుల్లోనూ సంకల్ప బలాన్ని విడిచిపెట్టకూడదు.మిగతావన్నీ వాటంతట అవే అనుసరిస్తాయి. విజయానికి సహకరిస్తాయి” అని తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే అన్నాడు.కేసీఆర్ చేసింది అదే.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న సంకల్పాన్ని పట్టుకున్న తర్వాత ఇక దాన్ని విడిచిపెట్టలేదు. ఆయన విజయరహస్యం అదే.కొన్ని సందర్భాల్లో కొంత గందరగోళం సహజమే.కొన్ని సమయాల్లో నిస్పృహ కూడా ఆవరించవచ్చు. నిరాశ చుట్టుముట్టవచ్చు. అయినప్పటికీ ‘సంకల్పాన్ని’ గట్టిగా పట్టుకునే ఉన్నారాయన. 2001 నుంచి 2014 జరిగిన ‘ప్రత్యేక’ యుద్ధంలో ఎన్నో ఆటుపోట్లు.తుపానులు.ఎదురుగాలి.ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ఇంటా బయటా కుట్రలు.మోసాలు.అవమానాలు.కేసీఆర్ ఆత్మస్థయిర్యాన్ని చావుదెబ్బ కొట్టే చర్యలు.తెలంగాణ వస్తుందా రాదా అని సామాన్య జనంలోనూ, మేధావుల్లోనూ అనుమానాలు.ఎడతెగని చర్చలు.కేసీఆర్ పై అపోహలు.ఆయన నాయకత్వంపై సందేహాలు.ఆయన చిత్తశుద్ధిపై శంక.
“మానవ చరిత్ర గతిని నిర్ణయించేవి ఆర్థిక పరిస్థితులే కాని రాజకీయ,మత, సాంస్కృతిక పరిస్థితులు కావు” అని మార్క్స్ చెప్పారు.తెలంగాణ గురించి ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా చాలామంది పండితులు, నిపుణులు చాలా రకాలుగా చెప్పారు.ఎంతోమంది ఎన్నో రకాలుగా విశ్లేషించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాలు,వివక్ష,నిర్లక్ష్యం గురించి తెలంగాణా ప్రజలకు తెలియనిది కాదు. ‘తెలంగాణను సమూలంగా మార్చాలి.తెలంగాణను పునర్నిర్మించాలి’ అన్నదే 2014 జూన్ 2 నాటి కెసిఆర్ ఎజండా. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభాన్ని , కరువు, వలసలను నివారించడానికి, రైతుల ఆత్మహత్యలను అదుపు చేయడానికి సాగునీటి వసతిని పెంచడమే అత్యంత ప్రాధాన్య విషయంగా కేసీఆర్ గుర్తించారు.రాష్ట్రంలో ఒక కోటి 23 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం మూడంచెల వ్యూహాన్ని అనుసరించింది. గత పాలకవర్గాలు ప్రారంభించి అనేక కారణాల వలన పూర్తి చేయకుండా పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, కొన్నింటిని తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్ చేసుకొని పూర్తి చేసుకోవడం.
గత ప్రభుత్వాలు ఆమోదించి అటకెక్కించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు,వేలాది గ్రామాలకు తాగునీరు అందించడం. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురై శిథిలమైపోయిన పాత సాగునీటి ప్రాజెక్టుల కాలువల వ్యవస్థను ఆధునీకీకరించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడం వంటి వ్యూహాలు ఫలితాలనిస్తున్నవి.గడచిన ఏడున్నర ఏండ్లుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అధికార పార్టీ టిఆర్ఎస్ చెలరేగిపోతున్నది.ఈ దశలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ద్రుష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ ఊపందుకుంది. ఈనెల 25 న జరగనున్న పార్టీ ప్లీనరీ, నవంబర్ 15 న వరంగల్ లో తలపెట్టిన ‘విజయగర్జన ‘ టిఆర్ఎస్ ప్రయాణంలో కీలక మైలు రాళ్లు. సీఎం కేసీఆర్‌కు తెగింపు ఎక్కువ. నాన్చుడు ధోరణి ఉండదు. సూటిగా సుత్తి లేకుండా కుండ బద్దలు కొట్టగలరు.”మాది సన్యాసుల మఠం కాదు,రాజకీయప్రయోజనాల కోసం పథకాలు ప్రవేశపెడతాం” అని కూడా ఆయన పలు సందర్భాల్లో అరమరికలు లేకుండా చెప్పారు.
కెసిఆర్ వ్యూహం, రాజకీయ చాణక్యం ముందు ప్రతిపక్ష పార్టీలు చిత్తవుతున్నవి. రాష్ట్రంలో, టిఆర్‌ఎస్ పార్టీలో కెసిఆర్‌కు ఎదురు తిరిగే నాయకుడు లేరు.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ‘రెబల్’ నాయకుడు ఈటల రాజేందర్ రాజకీయభవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారినది.నవంబర్ 2 న ఆయన భవిష్యత్తు తేలనున్నది.
తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించిన కేసీఆర్ అసెంబ్లీ వెలుపల, లోపల విపక్ష పార్టీలు చేసే విమర్శలను ఒంటిచేత్తో తిప్పిగొడుతూ మొగ్గదశలోనే చీల్చి చెండాడుతున్నారు.విద్యుత్, బిసి, ఎస్సీల సంక్షేమం, నిధుల విడుదల, నిరుద్యోగం, రైతుల సమన్వయ సమితులు, భూసర్వే, పరిపాలన సంస్కరణలు, వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణ రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల పరిరక్షణ అంశాలపై కెసిఆర్, ఆయన టీంలో ముఖ్యులైన హరీశ్ రావు, కేటిఆర్ స్వైరవిహారం చేస్తున్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రేవంత్ రెడ్డి చేబట్టిన అనంతరం కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా యాద్దేశంలోనే ఎదురులేని మనిషిగా నిలిచిపోయేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుచేస్తున్న కార్యక్రమాలు ఉపయోగపడుతున్నవి.
రైతుబంధు,రైతుభీమా,దళిత బంధు వంటి పథకాలు దుమ్ము రేపుతున్నవి. రాబోయే పదేళ్ళు కూడా టిఆర్ఎస్ కు ఎదురులేకుండా అవసరమైన వ్యూహాలను ఆయన రచిస్తున్నారు.పార్టీ వ్యవహారాల బాధ్యతలను కుమారుడు కేటీఆర్ కు అప్పగించారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే టాస్క్ ను కేటీఆర్ చేబట్టారు.సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయకపోతే నష్టపోగలమని కేసీఆర్ ఆలస్యంగా గ్రహించి ఉండవచ్చు.ఎల్ల కాలం తన బ్రాండ్ ఇమేజ్ సంపూర్ణ ఫలితాలు ఇవ్వకపోవచ్చు నని కూడా ఆయన నిర్ధారణకు వచ్చి ఉండవచ్చును.
ఒకవైపు రాజకీయాలు, మరోవైపు పరిపాలనను కేసీఆర్ నేర్పుగా నడుపుతున్నారు. ప్రతిపక్షాల్లో కెసిఆర్ కు సమఉజ్జీ నాయకుడు లేకపోవటం ఆయనకు 2014 నుంచి కలిసి వస్తున్న అనుకూల అంశం. ఆయన ప్రతిపక్షాలను ముందస్తుగా నిర్వీర్యం చేయగలిగారు.లేదా చిన్నాభిన్నం చేశారు. బీజేపీకి దుబ్బాక, జీహెచ్ఎంసి ఫలితాలు ఆక్సిజన్ ఇచ్చాయి.దాంతో ఇక తామే కేసీఆర్ కు ప్రత్యామ్నాయమని బండి సంజయ్,కిషన్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. ప్రజలకు కావలసిందేమిటి ? ప్రభుత్వం చేయ వలసిందేమిటి? అనే విషయాల్లో కేసీఆర్ కు ఉన్న స్పష్టత మరెవరికీ లేదు. నిరంతర విద్యుత్, త్రాగు, సాగునీరు,మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు.మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పొరుగు రాష్ట్రాలతో విద్యుత్తు ఒప్పందాలు, ఐటి పరిశ్రమకు ఊతమివ్వటం, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించటం లాంటి వాటితో పాటు పారిశ్రామిక విధానాలు, యూత్, పర్యాటక రంగాలను ప్రోత్సహించటం లాంటివి చేపడుతున్నారు.ఈ చర్యలతో అభివృద్ధిలో తెలాంగాణ శరవేగంగా దూసుకు పోతోంది.
ఏ ఎన్నిక జరిగినా విపక్షాల వైపున గెలుపు గుర్రాలే లేకుండా చేయాలన్నది కేసీఆర్ టార్గెట్. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి 119 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలన్నీ టిఆర్ఎస్ శిబిరంలో ఉండాలన్నది ఆయన వ్యూహం.కేసీఆర్ పాలన అంతా నల్లేరు మీద బండిలా సాగుతుండడం వెనుక ఆయన ప్లానింగ్ బలమే. తెలంగాణలో కేసీఆర్ మొనగాడుగా తయారు కావడం కాంగ్రెస్,బీజేపీ లు జీర్ణించుకోలేని అంశం. రాజకీయ సుస్థిరత కేసీఆర్ కు అదనపు బలం. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో సెటిలర్స్ కు ఇబ్బంది వస్తుందా అన్న భావనకు పూర్తిగా తెర పడింది. వారిలో ‘భద్రత’ వాతావరణాన్ని కల్పించారు.మంత్రులు హరీష్ రావు,కేటీఆర్ లను కెసిఆర్ బ్యాలెన్సు చేయగలుగుతున్నారు. ప్రగతిభవన్ లో అంతర్గతంగా ఎవరి మధ్య అయినా పొరపొచ్చాలు వస్తే వెంటనే కేసీఆర్ వాటిని చక్కదిద్దుతున్నారు.
కుమారుడికి అధికారం అప్పగించి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కకు తప్పుకుంటారని కొద్ది నెలలుగా ప్రచారం సాగుతున్నది. ఎడతెగకుండా వినపడుతున్నది. తేదీలు, ముహూర్తాలు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై తాడూ బొంగరం లేని ప్రచారం సాగుతోంది.అధికారం కోసం దశాబ్దాల తరబడి వారసులు నిరీక్షిస్తున్న సన్నివేశాలు చూస్తున్నాం. అధికారం లభించి ఇంకా పదేళ్లు కాకముందు కెటిఆర్ కు తొందరెందుకు? అనే చర్చ ఉన్నది.అంతే గాకుండా కార్యదక్షత, వక్తృత్వం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అవసరమైన వనరులను సమీకరించగలిగిన సామర్థ్యం కెటిఆర్ కు పుష్కలంగా ఉన్నట్టు ఆయన అభిమానులు, మద్దతుదారులు అంటున్నారు.
రాజకీయంగా ఇంకా అనుభవం, పరిణతి పెరగవలసి ఉన్నదన్నది మరికొందరి వాదన.ఇక పొరుగున ఉన్న తమిళనాడులో తొంభై రెండేళ్ల వయసులో కరుణానిధి చక్రాల కుర్చీలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఘటనలను చూసాం. ”ప్రకృతి నన్నేదైనా చేస్తే తప్ప,నేనే కొనసాగుతాను” అని కూడా ఒక సందర్భంలో కరుణానిధి అన్నారు.ఆయన మరణించిన తర్వాత డెబ్భయి ఏండ్ల వయసు వచ్చాక స్టాలిన్ ముఖ్యమంత్రి కాగలిగాడు. కరుణానిధికి పుత్రప్రేమ లేదని కాదు.కానీ చనిపోయేదాకా తానే కొనసాగాలని ఆయన కోరుకున్నాడు. తెలంగాణలోనూ అదే పరిస్థితి రిపీట్ కావచ్చు.కాకపోవచ్చు.ఎందుకంటే కేసీఆర్ మదిలో ఏమున్నదో తెలియదు.ఆయన నిర్ణయాలన్నీ అనూహ్యంగా ఉంటాయని కొత్తగా చర్చించవలసిన అవసరం లేదు.
ఇదిలా ఉండగా ఉద్యమపార్టీ ప్రభుత్వంలోకి రావడం వల్ల తెలంగాణకు ప్రయోజనం సమకూరింది. కానీ క్రమంగా ఉద్యమబలం స్థానంలో, వ్యక్తిగత ఆకర్షణ, జనరంజక పాలన వైపునకు కేసీఆర్ పూర్తిగా మొగ్గారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు.’రాజకీయ పునరేకీకరణ పేరిట గతంలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరచినవారిని,కేసీఆర్ ను అత్యంత కిరాతకంగా తిట్టిన వారిని సైతం కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు.టిఆర్ఎస్ 2014 లో ‘ ఫక్తు రాజకీయ’పార్టీగా మారిపోయాక ఇక ఇలాంటి అంశాలు చర్చకు రావని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.కెసిఆర్ రాజకీయాల సరళి వేరు. కెటిఆర్ ది అందుకు భిన్నం. ఆయనది కార్పొరేట్ కంపెనీ సిఇఓ వైఖరి వలె ఉంటుందని కొందరు అంటుంటారు.కనుక కేటీఆర్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంకా కొంత కాలం అప్రెంటిస్ షిప్ చేయక తప్పదు.
కేసీఆర్ కుటుంబంలో దాదాపు అందరూ నాయకత్వ లక్షణాలతో పోటాపోటీగా ఎదగడం చాలా మందిని ఆశ్చర్యం కలిగిస్తుంది.కూతురు కవిత దుబాయిలోని బుర్జ్ ఖలీఫా పైన ‘బతుకమ్మ’ ను ప్రదర్శించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ జోగినపల్లి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నవి.

ఎస్.కె.జకీర్
( రచయిత ప్రముఖ పాత్రికేయులు

 

LEAVE A RESPONSE