Suryaa.co.in

Andhra Pradesh

దేవుడనే వాడున్నాడు… ఆయనే అన్నీ చూసుకుంటాడు

-కాంగ్రెస్ నా కుటుంబాన్ని చీల్చింది
-అప్పుడు మా బాబాయ్‌ను పోటీగా దింపింది
-ఇప్పుడు చెల్లికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది
-దేవుడే అన్నీ చూసుకుంటాడు
-గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే.. తక్కువ అప్పులు
-తిరుపతిలో రెండు రోజుల పాటు ‘ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌’
-ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైయస్‌ జగన్‌.

ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం వైయస్‌. జగన్‌ సమాధానం ఇచ్చారు.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
విద్యా రంగంలో ఇంత మంచి చేస్తున్నా, ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటారు? జాతీయ మీడియాలో కూడా ఎప్పుడూ ఎందుకు కనిపించరు? మీరు రాష్ట్రానికే పరిమితం కావాలనుకుంటున్నారా?

సీఎం వైయస్‌ జగన్‌:
– ఇండియా టుడే జర్నలిస్టులు ఇక్కడి స్కూల్స్‌ సందర్శించి, అక్కడి అభివృద్ధి పనులు స్వయంగా చూడడం ఎంతో ఆనందదాయకం. అందుకు మీకు అభినందనలు. ఇక్కడ మేము ఏయే పనులు చేశామనేది చెప్పుకోవడం కాకుండా, మీరు స్వయంగా చూడడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
సాధారణంగా అన్ని ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలపై ఎక్కువ వ్యయం చేయవన్న విమర్శలు వినిపిస్తుంటాయి. అందుకు భిన్నంగా మీరు ఈ రెండు రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, వాటిని అభివృద్ధి చేసి, చూపించాలనుకుంటున్నారా?.

సీఎం వైయస్‌ జగన్‌:
– పేదరిక నిర్మూలనకు నాణ్యతతో కూడిన విద్య అనేది కీలకమని నేను గట్టిగా నమ్ముతాను. విద్యా హక్కు అనేది ఇంకా నినాదంగా మిగలకూడదు. నాణ్యతతో కూడిన విద్య అనేది హక్కుగా మారాలి. నిరుపేదలు ఒక చదువుకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు వేరే చదువులు చదువుతున్నారు. నిరుపేద పిల్లలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవడం, అది కూడా కేవలం తెలుగు మీడియమ్‌లోనే చదవడం.. మరోవైపు ధనికులైన పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియమ్‌లోనే చదవడం సరికాదు.

నిరుపేదలు, ధనికుల మధ్య కొనసాగుతున్న ఈ తేడా తొలగాల్సి ఉంది. ధనికుల మాదిరిగా నిరుపేద పిల్లలు కూడా చదవాల్సి ఉంది. వారికి ఆ విధంగా విద్యను అందించాల్సి ఉంది.
ఆ ఆలోచన నుంచి వచ్చినవే ఈ మార్పులు. మా ప్రభుత్వం ఆ దిశలోనే పని చేస్తోంది. వారికి కూడా అత్యుత్తమ నాణ్యతతో కూడిన విద్యను, ఇంగ్లిష్‌ మీడియమ్‌లో బోధన కొనసాగాలి.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌లో బోధన. మూడో తరగతి నుంచే గ్లోబల్‌ విద్య, టోఫెల్‌లో శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి నేత కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియమ్‌లోకి మారుస్తున్నారని, పిల్లలపై బలవంతంగా ఇంగ్లిష్‌ మీడియమ్‌ను రుద్దుతున్నారని, దీని వల్ల తెలుగు భాషకు మనుగడ లేకుండా పోతుందని ఆయన (వెంకయ్యనాయుడు) అన్నారు.

సీఎం వైయస్‌ జగన్‌:
– ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియమ్‌లోకి మారుస్తున్నారని విమర్శలు చేస్తున్న వారందరిని నేను ఒక్కటే అడుగుతున్నాను. వారి పిల్లలు, వారి మనవళ్లు, మనవరాళ్లు ఏ మీడియమ్‌లో చదువుతున్నారు? వారిని తెలుగు మీడియమ్‌ స్కూళ్లకే పంపిస్తున్నారా? అదే నా సూటి ప్రశ్న. ఇంగ్లిష్‌ మీడియమ్‌ వైపు నా చొరవను ప్రశ్నించే ముందు.. ముందుగా నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
వెంకయ్యనాయుడుకి ఇదే మీ సమాధానమా? నిజంగా ఇంగ్లిష్‌ మీడియమ్, తెలుగు మీడియమ్‌ మధ్య ఉన్న గ్యాప్‌ను అంత సులభంగా మార్చగలరా? రాష్ట్రంలో ఒక గ్రామంలో ఉన్న ఒక స్కూల్‌ను అంత త్వరగా, వేగంగా ఇంగ్లిష్‌ మీడియమ్‌లోని మార్చగలరా? దాని వల్ల పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాదా? ఇది వారి విద్యాభ్యాసంపై ప్రభావం చూపదా?

సీఎం వైయస్‌ జగన్‌:
– ఈ ప్రక్రియ అలా జరగడం లేదు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఏకపక్షంగా ఇంగ్లిష్‌ మీడియమ్‌లోని మార్చడం లేదు. ప్రతి ఒక్కటీ ఒక పద్ధతి ప్రకారం, శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ఒక సమగ్ర విధానంలో కొనసాగుతుంది.
ప్రతి పుస్తకాన్ని బైలింగ్యువల్‌లో (ఒక పేజీ ఇంగ్లిష్‌లో, పక్క పేజీ తెలుగులో) ముద్రిస్తున్నాం. ఇంకా బైజూస్‌ కంటెంట్‌ను కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో అనూహ్య మార్పులు చేస్తున్నాం. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.

6వ తరగతి నుంచి, ఆపై తరగతుల్లోని ప్రతి క్లాస్‌రూమ్‌లో ఐఎఫ్‌పీ (ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌) ఏర్పాటు చేస్తున్నాం. ఆ మేరకు 62 వేల తరగతులు ఉండగా, వాటికే ఇప్పటికే 40 వేల తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేశాం. మిగిలిన తరగతి గదుల్లో వచ్చే నెల చివరి నాటికి ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం.

ఆ విధంగా ఒక ప్రణాళికా బద్దంగా పాఠశాల విద్యా రంగంలో ఒక వినూత్న మార్పుల దిశలో పని చేస్తున్నాం. బైలింగ్యువల్‌ పాఠ్యపుస్తకాలు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్, టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపు, బైజూస్‌ కంటెంట్, తరగతి గదుల్లో ఐఎఫ్‌పీల ఏర్పాటు.. ఇలా వీటన్నింటి వల్ల ప్రాథమిక విద్యా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఇవన్నే కాకుండా.. పిల్లలు 8వ తరగతిలోకి వచ్చే సరికి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఇస్తున్నాం. 2021 డిసెంబరు నుంచి ఆ ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నాం.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
– రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి మీరు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఇచ్చారు. కోవిడ్‌ విద్యా రంగంపై కూడా ప్రభావం చూపింది. దేశమంతా ఆ ప్రభావం కనిపించింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో.. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో 8, 9, 10వ తరగతి పిల్లలందరికీ ట్యాబ్‌లు అందుతాయా? ఈ విషయాన్ని గట్టిగా చెప్పగలరా?.

సీఎం వైయస్‌ జగన్‌:
– రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9 తరగతి పిల్లలందరి వద్ద ట్యాబ్‌లు ఉన్నాయి. 2021 డిసెంబరు నుంచి వాటిని ఇస్తున్నాం. ఇప్పటికే రెండుసార్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు సందర్భంగా నేను స్వయంగా స్కూళ్లకు వెళ్లి, పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాను. అది నాకెంతో ఇష్టం. సంతోషం కలిగిస్తోంది.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
ప్రభుత్వ యంత్రాంగంలో ఏదీ అంత త్వరగా మారదు. ఇది అందరికీ తెలుసు. కానీ మీరు గవర్నమెంట్‌ స్కూళ్లను చాలా వేగంగా మార్చాలనుకుంటున్నారు? వాటిని అంతర్జాతీయ స్థాయిలో మారుస్తూ.. చివరకు కేవలం పెద్ద నగరాల్లోనే ప్రతిష్టాత్మక స్కూళ్లలో ఉన్న ‘ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌’ (ఐబీ) సిలబస్‌ తీసుకువస్తున్నారు. ఇది పిల్లలపై ప్రభావం చూపుతోందని.. పిల్లల డ్రాపవుట్స్‌ పెరుగుతున్నాయని, గవర్నమెంట్‌ స్కూళ్లు కూడా కొన్ని మూతబడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ సమాధానం.

సీఎం వైయస్‌ జగన్‌:
– రాష్ట్రంలో ఐబీ సిలబస్‌కు సంబంధించి ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌)తో ఈనెల 31న ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. తొలి ఏడాది.. అంటే 2024–25 విద్యా సంవత్సరంలోలో కేవలం టీచర్ల సామర్థ్యం పెంపుపైనే పని చేస్తాం. ఆ తర్వాత 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రతి ఏడాది.. ఒక్కో తరగతి (ఫస్ట్‌ క్లాస్‌తో మొదలు)లో ఐబీ సిలబస్‌ అమలు చేస్తాం. ఆ విధంగా 10 ఏళ్లలో.. అంటే 2035లో ఇక్కడి గవర్నమెంట్‌ స్కూళ్ల పిల్లలు, పదో తరగతిని ఐబీ సిలబస్‌తో పూర్తి చేస్తారు.

ఆ సిలబస్‌తోనే పరీక్ష రాస్తారు. వారికి ఆ సర్టిఫికెట్‌ కూడా వస్తుంది. దీని వల్ల వారు ప్రపంచంలో పోటీని సమర్థంగా ఎదుర్కోగలరు. నాణ్యతతో (క్వాలిటీ) కూడిన విద్య లేకపోతే.. మన పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడలేరు. వారు జీవితంలో ఎదగలేరు. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఉంటేనే వారు కేవలం ఈ దేశంలోనే కాకుండా.. గ్లోబల్‌గా కూడా పోటీ పడగలరు. అయితే ఈ అవకాశం కేవలం ధనికుల పిల్లలు.. ప్రైవేటు స్కూళ్లలో చదువుకున్న వారికే కాకుండా, నిరుపేద పిల్లలకు కూడా ఉండాలన్న ధృఢ సంకల్పంతో ప్రభుత్వం ఇవన్నీ చేస్తోంది.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
గుంటూరు జిల్లాలోని ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థి కూడా అమెరికా లేదా మరే పశ్చిమ దేశాల్లో పోటీని ఎదుర్కొనేలా చేయాలన్న మీ విజన్‌ అభినందనీయం. అయితే మీరు ఆశిస్తున్నట్లు ఆ పిల్లలను ఆ స్థాయిలో తీర్చి దిద్దేలా టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం ఉందా?. అలాగే గవర్నమెంట్‌ స్కూళ్లలో తగిన సంఖ్యలో టీచర్లు ఉన్నారా?.

సీఎం వైయస్‌ జగన్‌:
– ఐబీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో కలిసి పని చేస్తున్నాయి. వారు మాతో కలిసి పని చేసేలా ఐబీ డైరెక్టర్‌ జనరల్‌తో నేను స్వయంగా మాట్లాడాను. వారు రాష్ట్ర ఎస్‌సీఈఆర్‌టీతో ఒప్పందం చేసుకుని, వారితో భాగస్వామ్యం అయ్యాక.. మాతో పూర్తిస్థాయిలో కలిసి పని చేస్తారు. వారు ఇక్కడ పూర్తిస్థాయిలో అధికారికంగా ఆఫీస్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్థాయిలో ఇక్కడ వారి భాగస్వామ్యం వస్తుంది కాబట్టి.. మేము లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా 2035 నాటికి మా పిల్లలు (గవర్నమెంట్‌ స్కూళ్ల విద్యార్థులు) 10వ తరగతి పరీక్షలు ఐబీ సిలబస్‌లో రాస్తారు.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
అయితే ఇది 12 ఏళ్ల ప్రణాళిక అన్నమాట. ఐబీ సహకారంలో టీచర్ల సామర్థ్యం పెంచడమే కాకుండా, పిల్లలను కూడా ఆ స్థాయిలో తీర్చిదిద్దుతారన్న మాట.

సీఎం వైయస్‌ జగన్‌:
– ఔను. ఆ విధంగా మేము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. తొలి ఏడాది టీచర్ల నైపుణ్యం, సామర్థ్యం పెంచుతాం. ఆ తర్వాత ఫస్ట్‌ క్లాస్‌ నుంచి మొదలుపెట్టి, ఒక్కో ఏడాది ఒక్కో తరగతిలో ఐబీ సిలబస్‌ ప్రారంభించి, ఆ పిల్లలు 10వ తరగతి చేరే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
అయితే ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది కదా? అందుకు తగిన నిధులు ఉన్నాయా? ఆ స్థాయిలో మీరు ఖర్చు చేసి, అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరా?

సీఎం వైయస్‌ జగన్‌:
– ఇది ప్రభుత్వ ప్రాజెక్టు. మా లక్ష్యం ఏమిటన్నది ఐబీకి కూడా స్పష్టంగా తెలుసు. అందుకే వారు మాతో భాగస్వామ్యం అవుతున్నారు. అందుకే వారు వ్యాపారధోరణితో కాకుండా, మా లక్ష్యసాధనలో మాతో కలిసి పని చేస్తున్నారు. ఆ మేరకే అవగాహనకు వచ్చాం. అందుకే ఖరీదైన స్కూళ్ల మాదిరిగా, మేము ఐబీకి రాయల్టీ వంటివి చెల్లించడం లేదు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా ఐబీ సిలబస్‌తో చదివి పోటీ ప్రపంచంలో ధీటుగా నిలబడాలన్న మా ప్రభుత్వ లక్ష్యసాధనలో, ఐబీ కూడా పూర్తి భాగస్వామి అవుతోంది.
ఇక నిధులకు సంబంధించి చూస్తే.. ఇప్పటికే స్కూళ్లలో పూర్తి మౌలిక సదుపాయాల కల్పన మొదలైంది.

మొత్తం రూ. 14 వేల కోట్ల వ్యయం అంచనాతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే రూ. 8300 కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రంలో 44 వేల స్కూళ్లు ఉండగా, నాడు–నేడు తొలి దశలో ఇప్పటికే 15,575 స్కూళ్లలో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించాం. నాడు–నేడు రెండో దశలో 16 వేలకు పైగా స్కూళ్లలో పనులు సాగుతున్నాయి. వచ్చే మార్చి నాటికి ఆ పనులు పూర్తవుతాయి. దీంతో రాష్ట్రంలో రెండో వంతు స్కూళ్లలో పూర్తి మౌలిక వసతులు ఏర్పడతాయి. మిగిలిన స్కూళ్లలో వచ్చే ఏడాదిలో పనులు చేపట్టి పూర్తి చేస్తాం.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
2018లో రాష్ట్రంలో ప్రాథమిక విద్యా రంగంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) 84.48 శాతం ఉండగా.. అప్పుడు జాతీయస్థాయి సగటు జీఈఆర్‌ 99.21 శాతం ఉంది. ఈ పరిస్థితుల్లో మీ పిల్లల డ్రాపవుట్స్‌ తగ్గవని, మీరెలా విశ్వాసం కలిగించగలుగుతారు. ఆ దిశలో మీరు ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి ద్వారా, పిల్లల తల్లుల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు. అది పిల్లల విద్యపై ప్రభావం చూపుతుందా?

సీఎం వైయస్‌ జగన్‌:
– రాష్ట్రంలో ప్రాథమిక విద్యా రంగంలో ఉన్న పరిస్థితి చూసినప్పుడు.. మార్పులపై ఆలోచించినప్పుడు.. జీఈఆర్‌లో మా రాష్ట్రంలో దేశంలో చాలా తక్కువ స్థాయిలో ఉంది. 29 రాష్ట్రాలు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు ఏడింటిలో చూస్తే.. మా రాష్ట్రం జీఈఆర్‌లో దారుణంగా 32వ స్థానంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో అన్ని కోణాల్లో ఆలోచించి, వినూత్న చర్యలు మొదలుపెట్టాం. పిల్లలు స్కూళ్లకు ఎందుకు వెళ్లడం లేదన్న కారణాలు తెలుసుకున్నాం. ఆ దిశలో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాం.
అందులో కీలకమైంది. మధ్యాహ్న భోజనం. దాన్ని సమూలంగా మారుస్తూ.. రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇస్తూ గోరుముద్ద అమలు చేస్తున్నాం.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. తమిళనాడులో పిల్లలకు మ్యాంగో షేక్‌ ఇస్తున్నారు. ఇక్కడ మీరు వారంలో ప్రతి రోజూ ఒక్కో మెనూతో పథకం అమలు చేస్తున్నామంటున్నారు. ఇది నిజమా? మా రిపోర్టర్లు స్కూళ్లకు వెళ్లి చెక్‌ చేయొచ్చా?

సీఎం వైయస్‌ జగన్‌:
– నిరభ్యరంతంగా వెళ్లొచ్చు. ఎక్కడికైనా వెళ్లి చూడొచ్చు. గోరుముద్దలో ఏమేం ఇస్తున్నామో చూడొచ్చు. అదే విధంగా పిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రులను కూడా ప్రోత్సహిస్తున్నాం. అదే సమయంలో స్కూళ్లలో 10 రకాలుగా పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. నీటి సదుపాయంతో కూడిన టాయిలెట్స్, 6వ తరగతి నుంచి క్లాస్‌రూమ్‌లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్, పిల్లలకు పరిశుభ్రమైన మంచినీరు, స్కూళ్లకు అవసరమైన మరమ్మతులు, పెయింటింగ్‌.. ఇలా 10 రకాల మార్పులు చేస్తున్నాం.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
మీరు చెబుతున్నట్లుగా.. ఇది రాష్ట్రంలో ప్రతి చోటా అమలవుతోందా? ఎందుకంటే, మనం గతంలో చాలా చూశాం. గవర్నమెంట్‌ స్కూళ్లలో అనుకున్న విధంగా పనులు జరగవు. ప్రమాణాలు ఉండవు.

సీఎం వైయస్‌ జగన్‌:
– ఇక్కడ మానిటరింగ్‌ వ్యవస్థ పక్కాగా ఉంది. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు మాత్రమే కాకుండా.. నా స్థాయిలో నేను కూడా స్వయంగా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాను. సీఎం స్థాయిలో ఈ ప్రక్రియలో పాలుపంచుకుని, పని చేస్తున్నప్పుడు.. మిగిలిన యంత్రాంగం కూడా ఎలా పని చేస్తుందో తెలుసు కదా?

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
కేవలం నాణ్యతతో కూడిన విద్య మాత్రమే కాకుండా, విద్య అనేది ఉద్యోగ, ఉపాధి కల్పన దిశలో ఉండాలనేది కూడా ఒక సవాల్‌. మీరు అధికారంలోకి రాక ముందు కూడా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఈ పరిస్థితిని మీరెలా మార్చగలుగుతారు?

సీఎం వైయస్‌ జగన్‌:
– రాష్ట్రంలో మా ఫోకస్‌ కేవలం స్కూళ్ల మీదనే కాదు.. ఉన్నత విద్యా రంగంలో కూడా చాలా మార్పులు చేశాం. ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా కరికులమ్‌లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేశాం. వేసవి సెలవులు కూడా ఉపయోగించుకుని, ఇంటర్న్‌షిప్‌ చేసేలా అవకాశం కల్పిస్తున్నాం. అన్ని డిగ్రీ కోర్సులను అనర్స్‌గా మార్చి, నాలుగేళ్లు చేస్తున్నాం. కరికులమ్‌లో భాగంగా ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ ప్రారంభిస్తున్నాం. ఇంటర్న్‌షిప్, కరిక్యులమ్‌లో మార్పులు.. ఇవన్నీ కూడా మా లక్ష్య సాధనకు మార్గం వేస్తున్నాయి.

ఎడెక్స్‌తో కూడా వచ్చే నెలలో ఒప్పందం చేసుకోబోతున్నాం. మనకు 1800 సబ్జెక్ట్స్‌ ఉన్నాయి. వాటి కోర్సులు అందించడం కోసం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకోబోతున్నాం. కరికులమ్‌ను కూడా మారుస్తున్నాం. హార్వర్డ్, ఎల్లెస్సీ వంటి ప్రీమియమ్‌ సంస్థలను ఎడెక్స్‌ ద్వారా కోర్సులను ఆన్‌లైన్‌లో ఆఫర్‌ చేసేలా చర్యలు చేపడుతున్నాం.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
దానికి సంబంధించి ఉదాహరణ చెప్పగలరా? పిల్లలకు ఎలాంటి ఆఫర్స్‌ ఇవ్వబోతున్నారు?

సీఎం వైయస్‌ జగన్‌:
– ఉదాహరణకు. బికాం కోర్సు తీసుకొండి. ఆ కోర్సు విద్యార్థులు కూడా ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలు నేర్చుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నాం. అవన్నీ పాఠ్య ప్రణాళికలో భాగం చేస్తున్నాం. పశ్చిమ దేశాల్లో మాత్రమే కనిపించే అంశాలను, ఇక్కడ కరికులమ్‌లో చేరుస్తూ.. పిల్లలను ఆ స్థాయిలో తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నాం. ఎడెక్స్‌ ఒప్పందం ద్వారా ఆన్‌లైన్‌ విద్యాబోధన ద్వారా.. ప్రతిష్టాత్మకమైన ఎల్లెసీ, హార్వర్డ్‌ సంస్థలు.. సర్టిఫికెట్‌ ఇస్తాయి. ఇది మా పిల్లలకు ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుంది.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
ఇవన్నీ చూస్తుంటే.. ఉత్తర భారత్‌తో పోలిస్తే దక్షిణ భారత్‌ ఎప్పుడైనా ముందు ఉంటుంది అంటారు. ఇక్కడ జగన్‌గారు అక్షరాస్యత వృద్ధి కోసం ఎంతో చేస్తున్నారు. విద్యా రంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అక్షరాస్యత అభివృద్ధి కోసం కేరళలో ఒక ప్రక్రియ చేపట్టారు. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గవర్నమెంట్‌ స్కూళ్లు అభివృద్ధి చేశారు. ఇక్కడ మీరు ప్రత్యేక విధానంలో, మీ స్టైల్‌లో (మీ శైలిలో) పని చేస్తున్నారు. ఇవన్నీ మిమ్మల్ని ఎన్నికల్లో గెలిపిస్తాయని అనుకుంటున్నారా? నేను ఇవన్నీ చేశాను కాబట్టి.. గెలిపించమని అడుగుతారా? అసలు ఈ ప్రక్రియకు, ఎన్నికలకు ఏ మాత్రం సంబంధం లేదని చెబుతారా?

సీఎం వైయస్‌ జగన్‌:
– రాజకీయాలు వేరు. పిల్లలు, విద్యార్థులు ఓటర్లు కారు కాబట్టి, వారి గురించి ఎవరూ పట్టించుకోరు. ఇది దురదృష్టకరం. అయితే పిల్లలు మంచి విద్యావంతులవుతేనే, వారికి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తేనే.. సమాజంలో దారిద్య్రం పోతుంది. పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే.. వచ్చే 10, 15 ఏళ్లలో వారు ఎంతో వృద్ధి చెందుతారు. తద్వారా సమాజం కూడా మారుతుంది. పేదరికం పోతుంది. పిల్లలకు ఈ స్థాయిలో ఉన్నత ప్రమాణాలు, నాణ్యతతో కూడిన విద్యను అందిస్తే.. వారు పోటీ ప్రపంచంలో ధైర్యంగా నిలబడగలరు. ప్రపంచ స్థాయిలో పోటీ ఎదుర్కోగలరు.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
అంటే, మీ విజన్‌ అక్షరాస్యత స్థాయి పెంపు నుంచి నాణ్యతతో కూడిన విద్య వరకు అన్నట్లుగా ఉందని చెప్పొచ్చు కదా?

సీఎం వైయస్‌ జగన్‌:
– ఔను. ఇది నిజం. వాస్తవం.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
తన (సీఎం వైయస్‌ జగన్‌) విజన్‌ ఇంత స్పష్టంగా ఉన్నందుకు, ఆ దిశలో ఆయన చేస్తున్న కృషిని మనమంతా కచ్చితంగా అభినందించాల్సిందే. (అనడంతో అందరూ చప్పట్లతో అభినందించారు)
మీ ప్రయత్నంలో కనీసం సగమైనా మీరు సఫలమైతే విద్యా రంగంలో మీరు ఆంధ్రా మోడల్‌ను అవిష్కరించిన వారవుతారు.

ఈ సందర్భంగా నేను రాజకీయం గురించి మాట్లాడదల్చాను.
ఎందుకంటే రానున్న ఒకటి, రెండు నెలల్లో ఇక్కడ ఎన్నికలు రానున్నాయి. వాటిని మీరు ఎదుర్కోవాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో మీరు తిరిగి ఎన్నిక కావడంపై మీకెంత నమ్మకం ఉంది.
మీ అయిదేళ్ల పాలన చూపి ఓట్లు అడగడం సులభంగా ఉంటుందా? లేక 2019కి ముందు ప్రతిపక్షంలో ఉన్న మీరు యాత్ర చేసి ఓట్లు అడిగారు. గెల్చారు. రెండింటిలో ఏది మీకు బాగుందని అనుకుంటున్నారు. నిజాయితీగా సమాధానం చెప్పండి.

సీఎం వైయస్‌ జగన్‌:
– వాస్తవం కంటే విశ్వాసం అనేది ఎప్పటికైనా బలమైంది. అదే అందరూ చెబుతారు. నా విషయానికి సంబంధించి నేను ఒక్కటే చెబుతాను. నేను ఏం చెప్పాను? ఏయే హామీలు ఇచ్చాను? ఏమేం చేశాను?. అన్నదే ముఖ్యం.
మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99 శాతం అమలు చేశాం. వాటిని అమలు చేయడమే కాకుండా, ఆ మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజలకు చూపి, వారి విశ్వాసం పొందుతున్నాం. ఆ విధంగా మా ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకుంది.
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాం. ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేశాం. ప్రతి 60 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందజేస్తున్నాం. ఎక్కడా వివక్ష చూపడం లేదు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్కటీ డీబీటీ ద్వారా ఇస్తున్నాం.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
ప్రత్యక్ష నగదు బదిలీ. అదే డీబీటీ. అంటే మీ మేనిఫెస్టో అమలు.. పథకాల అమలు.. ఎక్కడా అవినీతికి తావు లేకుండా డీబీటీ ద్వారా పథకాల అమలు.. ఈ అంశాలు చెప్పి మీరు ఎన్నికల్లోకి వెళ్తారా?

సీఎం వైయస్‌ జగన్‌:
– రాజ్‌దీప్‌.. ఇక్కడ డీబీటీ అనేది మొత్తం మార్పులో ఒక భాగం మాత్రమే. నిజం చెప్పాలంటే.. విద్య, వైద్య రంగాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ పనితీరు మారింది. మహిళ సాధికారతలో మార్పు వచ్చింది. వీటన్నింటికీ తోడుగా డీబీటీ. ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా నేరుగా పథకాల అమలు. లబ్ధిదారులకు నగదు బదిలీ. ఇవన్నీ మా ప్రభుత్వాన్ని నిలబెడుతాయని మా నమ్మకం.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
మీ పరిపాలన. మీరు చేసిన పనులు మిమ్మల్ని గెలిపిస్తాయని మీరంటున్నారు. కానీ విపక్షాలన్నీ మీపై చాలా ఆరోపణలు చేస్తున్నాయి. మీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ.. విమర్శలు చేస్తున్నాయి.

సీఎం వైయస్‌ జగన్‌:
– ఏ పార్టీ కూడా మేము హామీలు అమలు చేయలేదని చెప్పలేదు. మేము అవినీతి చేశామని చూపలేరు. ఎందుకంటే ఈ 56 నెలల్లో వివిధ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో పూర్తి పారదర్శకంగా రూ. 2.53 లక్షల కోట్లు డీబీటీ విధానంలో జమ చేశాం.
అదే ప్రభుత్వం. అదే బడ్జెట్‌. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే.. తక్కువ అప్పులు. మరి ఈ పరిస్థితుల్లో కేవలం సీఎం మాత్రమే మారారు. మరి ఈ ప్రభుత్వం ఇన్ని చేయగలిగినప్పుడు.. గతంలో ఎందుకు చేయలేదన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌:
మాజీ సీఎం జైలుకు వెళ్లాడు. ఇక్కడ ప్రతీకార రాజకీయాలు కొనసాగుతున్నాయని అని విపక్షం ఆరోపిస్తోంది.

సీఎం వైయస్‌ జగన్‌:
– ఇది పూర్తిగా అవాస్తవం. ఆయన అవినీతి ఆరోపణలపై అరెస్ట్‌ అయ్యారు. అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టే.. కోర్టు ఆయనను జైలుకు పంపింది. మరి అలాంటప్పుడు ఎవరైనా అది ప్రతీకార రాజకీయం అని అంటారు?.
ఎవరైనా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయలేరు. ఎందుకుంటే, ఏం చేసినా కోర్టుల్లో లిట్మస్‌ టెస్ట్‌ ఉంటుంది కదా? ఆధారాలు లేకపోతే, ఆరోపణల్లో వాస్తవాలు లేకపోతే, కేసులు కోర్టుల్లో నిలబడవు కదా? ఆధారాలు ఉన్నాయని కోర్టులు కన్విన్స్‌ అయితే తప్ప, నిర్ణయాలు తీసుకోవు కదా? పైగా ఇక్కడ హైప్రొఫైల్‌ కేసు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏ సీఎం కూడా, అలాంటి చర్యలకు దిగరు కదా? కచ్చితమైన ఆధారాలు ఉంటే తప్ప.. కేసు బలంగా ఉంటే తప్ప.. అలాంటివి జరగవు కదా…

ఇంకా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, కేంద్రంతో సయోధ్య, వచ్చే ఎన్నికలు, వైయస్సార్‌ïసీపీ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం వైయస్‌ జగన్‌ సమాధానం ఇస్తూ…

– రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు నామమాత్రమే. కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ బలం లేదు. కాబట్టి సహజంగానే ఇక్కడ మా వైయస్సార్‌సీపీకి, తెలుగుదేశం, జనసేన కూటమితో పాటు, వారికి మద్దతు ఇచ్చే వారితోనే ఉంటుంది.

– ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ స్వయంగా సర్వే నిర్వహిస్తుంది. దాని ప్రకారం వ్యూహరచన చేసుకుంటుంది. మార్పులు చేర్పులు ఉంటాయి. మేము ప్రజలకు చాలా మేలు చేశాం. దాంతో మా ప్రభుత్వంపై ప్రజలకు చాలా నమ్మకం ఉంది. కానీ స్థానికంగా కొందరు నాయకుల తీరు, వారు ప్రజలతో మమేకం కాకపోవడం.. వారిపై వ్యతిరేకత.. ఇలా అనేక అంశాల ఆధారంగా కొన్ని మార్పులు అనివార్యం. మాకు సంబంధించి.. ఎన్నికలు మరో 70, 80 రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆఖరి క్షణంలో మార్పులు చేసి, లేనిపోని ప్రయోగాలు చేసే బదులు.. ముందుగా చేస్తే క్లారిటీ ఉంటుందని ఆ నిర్ణయం తీసుకున్నాం.

– మాకు తొలి నుంచి ఒక స్పష్టమైన విధానం ఉంది. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సయోధ్య కొనసాగిస్తున్నాం.

– రాష్ట్రంలో కాంగ్రెస్‌ డర్టీ పాలిటిక్స్‌ (నీచ రాజకీయాలు) చేస్తోంది. వారి స్వార్థం కోసం ఆనాడు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారు. అలా రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారు.

– విభజించు–పాలించు అన్నది రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా, మా కుటుంబంలో కూడా చేశారు. నేను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిలబడినప్పుడు, నా సొంత బాబాయిని మంత్రిని చేశారు. తర్వాత మా పార్టీ అభ్యర్థిపైనే పోటీకి నిలబెట్టారు. ఆ విధంగా కాంగ్రెస్‌ ఎప్పుడూ విభజించు–పాలించు అన్న రాజకీయాలే చేసింది. ఇప్పుడు కూడా అదే చేశారు. నా కుటుంబాన్ని విడగొట్టారు. మా చెల్లిని తీసుకొచ్చి, ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షరాలిని చేశారు. కానీ వారొక విషయాన్ని మర్చిపోతున్నారు. పైన దేవుడనే వాడున్నాడు. ఎవరికి ఎప్పుడు, ఎలా గుణపాఠం చెబుతాడో అప్పుడు చెబుతాడు.

– మనం ఏది అనుకున్నా దేవుడనే వాడున్నాడు. ఆయనే అన్నీ చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. కాంగ్రెస్‌ చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించక తప్పదు. దేవుడు అన్నీ చూస్తున్నాడు.

– రాజకీయాల్లో నా ప్రస్థానం, నాలో మార్పులను నా కంటే నీవే (రాజ్‌దీప్‌) ఇంకా బాగా చెప్పగలవు.

– ఈ 56 నెలల పాలనలో నా వంతుగా నేను శాయశక్తులా చిత్తశుద్ధితో పని చేశాను. దాన్ని ఆత్మ విశ్వాసంతో చెప్పగలను. కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలు తాకాను. అది నాకెంతో తృప్తి ఇస్తోంది.

– ఇప్పుడు అన్ని బహిరంగ సభల్లో నేను ఒకటే చెబుతున్నాను. నేను మీకు మంచి చేశానని అనుకుంటే, మీకు మేలు చేశానని అనుకుంటే.. నాకు తోడుగా నిలవమని కోరుతున్నాను.

LEAVE A RESPONSE