Suryaa.co.in

Andhra Pradesh

హిట్లర్ వద్ద గోబెల్స్.. జగన్ వద్ద సజ్జల

-అబద్ధాలు చెప్పడం… విషప్రచారం చేయడంలో జగన్ ను మించిన వారులేరు
• రాష్ట్రానికి.. ప్రజలకు మరలా జగన్ ఎందుకు అవసరం సజ్జలా?
• వివేకానందరెడ్డిని చంపినవారిని కాపాడుతున్నందుకా.. తన దోపిడీ..అవినీతి..దుర్మార్గపు పాలనను ప్రశ్నిస్తున్న మీడియా.. ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నందుకా?
• రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్నందుకా..లేక తండ్రి అధికారంతో లక్షకోట్లు.. నాలుగున్నరేళ్లలో రూ. 2.50 లక్షలకోట్లు కొట్టేసినందుకా?
• ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలపై దాడులు చేస్తున్న తనపార్టీవారిని.. మహిళలపై దారుణాలకు తెగబడుతున్న కామాంధుల్ని రక్షిస్తున్నందుకా?
• ఇసుక కుంభకోణంలో జగన్ రెడ్డి…సజ్జల… పెద్దిరెడ్డి జైలుకెళ్లడం ఖాయం
• జగన్ రెడ్డి..సజ్జల .. ధనుంజయరెడ్డి కలిసి రాష్ట్రంలో దొంగఓట్లు నమోదు చేయిస్తూ.. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారు
• వందలకోట్లు ఖర్చుపెట్టి ముద్రించిన నకిలీ బ్యాలెట్ పత్రాలు వాలంటీర్లు.. సచివాలయ సిబ్బందికి ఇచ్చి వైసీపీకి ఓటువేయాలని ప్రజల్ని భయపెడుతున్నారు
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

రాష్ట్రంలో 440 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తుంటే.. రైతాంగం 34 లక్షల ఎకరాల్లో పంటలసాగుకి స్వస్తి చెబితే.. వేసిన పంటల్లో దాదాపు 24లక్షల ఎకరాలు ఎండిపోయాయని, పక్కరాష్ట్రాలు ఏపీకి రావాల్సిన నీటిని దోచుకు పోతుంటే.. ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడని ఇలాంటి పరిస్థితి కళ్లముందు కనిపిస్తుంటే.. జగన్ రెడ్డి, సజ్జల, మంత్రులు సిగ్గులేకుండా సొంతడబ్బా కొట్టుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం రాష్ట్రమంతా రైతాంగం నీటి ఎద్దడి సమస్యతో ఇబ్బందులు పడుతోంది. నాలుగున్నరేళ్లలో ప్రజలపై పన్నులు వేయడం. .ధరలు పెంచడం.. రాష్ట్రంపై అప్పులభారం..రైతుల మెడలకు ఉరితాళ్లు.. మహిళల తాళిబొట్లు తెంచడం.. ఇవీ జగన్ రెడ్డి సాధించిన ఘనతలు. ఇలా చెబితే చాలానే ఉన్నాయి. విద్యుత్, సాగునీటి రంగాల్లో అవినీతికి తెరలేపి కమీషన్లకోసం తన బినామీలకు టెండర్లు కట్టబెట్టి, ఆయా రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. రైతులకు రోజుకి నిరంతరాయంగా 7 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వముంది.

జగన్ రెడ్డి ధనదాహానికి.. అతను అమ్మిస్తున్న జేబ్రాండ్ కల్తీ మద్యానికి రాష్ట్రంలో 30 వేల పేదల ప్రాణాలు పోయాయి. సుమారు 20 డిస్టిలరీల్లో కల్తీమద్యం తయారవుతోంది . మద్యం తయారీ.. సరఫరా..అమ్మకాలు.. మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయ వివరాలు ఏవీ ప్రభుత్వం బయటపెట్టడంలేదు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం అమ్మేవారంతా వైసీపీవారే. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు.. మంత్రుల కనుసన్నల్లోనే మొత్తం మద్యం మాఫియా నడుస్తోంది. నాసిరకం మద్యం అమ్ముతున్నా.. బెల్ట్ షాపులు రేయింబవళ్లు తెరిచి ఉంచుతున్నా కూడా ఎక్సైజ్ అధికారులు ఎక్కడా ఒక్క దుకాణం మూసేసింది లేదు.

జగన్ రెడ్డి ఇసుక మాపియాకు సహకరిస్తూ వెంకటరెడ్డి నెలకు రూ.2కోట్లు కొట్టేస్తూ.. తాడేపల్లి ప్యాలెస్ కు లక్షలకోట్లు జమచేస్తున్నాడు
మరోవైపు ఇసుకదోపిడీతో జగన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలోని ఇసుక రీచ్ లన్నింటినీ భారీ గోతులుగా మార్చాడు. ఆఖరికి ప్రజలకు ఉచితంగా ఇసుక అందించామని చంద్రబాబు పై .. నాపై… మా మహిళా నాయకురాలు పీతల సుజాత.. మరికొందరిపై జగన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టించాడు. కొత్తఇసుక పాలసీ పేరుతో ముఖ్యమంత్రి తన సోదరుడు అనిల్ రెడ్డికి అతని మనుషులకు ఇసుక రీచ్ లు కట్టబెట్టాడు. గతంలో రీచ్ లలో తూతూమంత్రంగా తెల్లకాగితంపై ముద్రించిన దొంగబిల్లుల్ని ఇచ్చేవారు.

ఇప్పుడు ఆకుపచ్చరంగు బిల్లులు ఇస్తున్నారు. ఏపీ ఎండీసీ ఎండీ వెంకటరెడ్డి ఇసుక మాఫియాకు సహకరిస్తూ నెలకు రూ.2కోట్లు కొట్టేస్తున్నాడు. తనవంతుగా లక్షల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు అప్పగిస్తున్నాడు. జీఎస్టీ కట్టకుండా.. ప్రభుత్వ అవసరాల ముసుగులో పేదల ఇళ్లకు.. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలలకు ఇసుక సరఫరా చేశారు. ఇసుక కుంభకోణం ద్వారానే జగన్ రెడ్డి.. పెద్దిరెడ్డి… సజ్జల అందరూ కలిసి రూ.40వేలకోట్లకు పైగా దోచేశారు. ఈ దోపిడీలో భాగస్వాములైన ప్రతిఒక్కరూ జైలు కెళ్లడం ఖాయం.

జగన్ రెడ్డి గొప్పలు చెబుతున్న డీబీటీ విధానంలోభారీ కుంభకోణం జరిగింది
జగన్ రెడ్డి గొప్పలు చెబుతున్న డీబీటీ పద్ధతిలో భారీ కుంభకోణం జరుగుతోంది. వైసీపీ వారే… ప్రజల ముసుగులో ప్రభుత్వసొమ్ముని మింగేస్తున్నారు. గతంలో టీడీపీప్రభు త్వం అధికారుల ద్వారా ప్రజలకు పథకాలు అందించేది. అంతా ఎక్కడికక్కడ పారదర్శ కంగా జరిగేది. జగన్ రెడ్డి లక్షలకోట్లు ప్రజలకు ఇచ్చానంటున్నాడు.. అందులో ఎంత సొమ్ము ప్రజలకు అందిందో, ఎంత సొమ్ము వైసీపీనేతలు, కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిందో ముఖ్యమంత్రి తక్షణమే తేల్చాలని డిమాండ్ చేస్తున్నాం.

జగన్ రెడ్డి బస్సుయాత్ర పేరుతో ఊదరగొడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కు నాలుగేళ్లలో పంగనామాలు పెట్టాడు. ఆయా వర్గాలకు టీడీపీప్రభుత్వం అందించిన 120కి పైగా పథకాలు జగన్ రెడ్డి రద్దుచేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి వెచ్చించాల్సిన కార్పొరేషన్ల నిధుల్ని జగన్ రెడ్డి స్వాహాచేశాడు. నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి సుమారు 14లక్షల అసైన్డ్ భూములు కొట్టేశాడు. విశాఖపట్నంలోనే విజయసాయి నేత్రత్వంలో 40వేల ఎకరాలు కొట్టేశారు. విశాఖ పట్నం మహానగరంలో ఖాళీస్థలం కనిపిస్తే వైసీపీ వాళ్లు జెండాలు పాతుతున్నారు.

జీవోనెం-3 రద్దుతో ఎస్టీలకు అన్యాయం చేశాడు. దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టి స్తున్నాడు. ఆఖరికి రైతులు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోళ్ల ముసుగులో వైసీపీ ఎమ్మెల్యేలు… కార్యకర్తలు ఒక్కో బస్తాపై రూ.200 నుంచి రూ.400వరకు కొట్టేశారు.

జగన్ రెడ్డి..అతని ప్రభుత్వం నోరు తెరవనందునే కృష్ణాజలాలపై కేంద్రం పున:సమీక్ష ఆదేశాలిచ్చింది
తన చేతగానితనం.. అసమర్థతతో కృష్ణాజలాలపై ఏపీకి ఉన్న హక్కుల్ని కూడా జగన్ ఇతర రాష్ట్రాలకు తాకట్టుపెట్టేశాడు. అపెక్స్ కౌన్సిల్లో జగన్ రెడ్డి..అతని ప్రభుత్వం నోరు తెరవనందునే కృష్ణాజలాలపై కేంద్రం పున:సమీక్ష చేయమని ఆదేశాలిచ్చింది. టీడీపీ ప్రభుత్వం 72శాతం నిర్మించిన పోలవరాన్ని పండబెట్టాడు.. పట్టిసీమలో అవినీతి జరిగింది..పంపులు పీకుతానన్నాడు. జగన్ రెడ్డి పట్టిసీమ పంపుల జోలికి వెళ్తే రైతు లు వీపులు పగలగొట్టడం ఖాయం. కృష్ణాడెల్టాలో 10లక్షల ఎకరాలు పండటానికి చంద్రబాబు నిర్మించిన పట్టిసీమే కారణం. పట్టిసీమ దండగో..పండగో జగన్ ఇప్పుడు సమాధానం చెప్పాలి.

ఈ చేతగాని ముఖ్యమంత్రి నిర్వాకంతో 120 టీఎంసీలు రావాల్సిన పట్టిసీమ నీళ్లు.. త్వరలోనే 50 టీఎంసీలకు తగ్గిపోనున్నాయి. పోలవరం నిర్వాసితుల్ని గోదావరిలో ముంచి.. జాతీయ ప్రాజెక్టుని పక్కరాష్ట్రానికి తాకట్టు పెట్టాడు. పట్టిసీమ లిఫ్ట్ లోని 24 పంపుల్ని పనిచేయించలేని ఈ చేతగాని జగన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమా? అందుకే ప్రజలంతా ఏపీ హేట్స్ జగన్ అంటున్నారు. రాష్ట్రంలోని పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో .. పారిశుద్యం పడకేసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జగన్ రెడ్డి గొప్పలు చెబుతున్న జగనన్నసురక్ష పథకం పేరుగొప్ప…ఊరుదిబ్బగా మారింది.

జగన్ మరలా రాష్ట్రానికి ఎందుకు అవసరం?
వివేకానందరెడ్డిని చంపినవారిని కాపాడుతున్నందుకు రాష్ట్రానికి మరలా జగన్ అవ సరమా? తన దోపిడీని..అవినీతిని..దుర్మార్గపు పాలనను ప్రశ్నించిన మీడియాపై.. ప్రతి పక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నందుకు జగన్ అవసరమా? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్నందుకు జగన్ రెడ్డి మరలా ప్రజలకు కావాలా? తండ్రి అధికారంతో గతంలో రూ.లక్షకోట్లు.. నాలుగున్నరేళ్ల అధికారంతో రూ.2.50లక్ష లకోట్లు కొట్టేసినందుకు రాష్ట్రానికి జగన్ అవసరమా?

తన దుర్మార్గపు పాలన..దోపిడీని ప్రశ్నిస్తూ…ఆధారాలతో సహా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాడన్న అక్కసుతో చంద్రబాబుని అన్యాయంగా 52 రోజులు జైల్లో పెట్టినందుకు మరలా రాష్ట్రానికి జగన్ కావాలా? ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణలేకుండా చేసినందుకు మరలా జగన్ రాష్ట్రానికి కావాలా? అబద్ధాలు చెప్పడం.. విషప్రచారం చేయడం జగన్ రెడ్డి నైజం.

నాడు హిట్లర్ వద్ద గోబెల్స్.. నేడు సజ్జల వద్ద సజ్జల దొంగఓట్లు.. నకిలీ బ్యాలెట్ పత్రాలను ప్రజలముందు ఉంచి చేస్తున్న బెదిరింపులపై కలెక్టర్లు తక్షణమే స్పందించాలి
హిట్లర్ హాయాంలో అతనివద్ద పనిచేసిన గోబెల్స్ ను నేడు జగన్ వద్ద పనిచేస్తున్న సజ్జల మించిపోయాడు. దొంగఓట్లతో అధికారంలోకి రావడానికి జగన్ రెడ్డి..సజ్జల కొత్త కుట్రలకు తెరలేపారు. వాలంటీర్లు.. సచివాలయ వ్యవస్థని అడ్డంపెట్టుకొని, నకిలీ బ్యాలెట్ పత్రాలు ముద్రవేయించి.. వాటిని ప్రజలముందు ఉంచి ఓట్లు ఎలా వేయాలో చూపిస్తున్నామంటూ.. ప్రజల్ని భయపెట్టడానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యాడు.

ఓటర్ల జాబితాలో జరిగే అవకతవకలు.. దొంగఓట్ల వ్యవహారంపై .. నకిలీ బ్యాలెట్ పత్రాలపై కలెక్టర్లు తక్షణమే స్పందించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులదే. కలెక్టర్లూ జరభద్రం. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని తెలుసుకోండి. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అవకతవకలు.. అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. బ్యాలెట్ పత్రాలు ముద్రేసి..వాటిని ప్రజలముందు పెట్టి..వైసీపీకి ఓటు వేయకపతే పథకాలు అపేస్తామని వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది బెదిరిస్తుంటే, కలెక్టర్లు పట్టించుకోరా?

జరిగే వ్యవహరమంతా రాజ్యాంగప్రక్రియకు విరుద్ధంగా జరుగు తున్నదే. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు.. దొంగఓట్ల నమో దు అంతా జగన్ రెడ్డి… సజ్జల రామకృష్ణారెడ్డి.. ధనుంజయ రెడ్డి పర్యవేక్షణలోనే జరుగుతోంది. ఎన్నికల ప్రక్రియను అపహాస్యంగా మార్చే ప్రక్రియలో జరుగుతున్న చర్యలపై జిల్లా కలెక్టర్లు తక్షణమే స్పందించాలి.

తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన సీబీఐ నోటీసులపై జగన్ నోరువిప్పాలి
బాబాయ్ హత్యకేసులో తనకు వచ్చిన సీబీఐ నోటీసులపై జగన్ నోరువిప్పాలి. తప్పుడు కేసులతో టీడీపీపై..చంద్రబాబుని వేధిస్తున్న జగన్ రెడ్డి ఇంతకు ఇంత మూల్యం చెల్లించుకుంటాడు. జగన్ రెడ్డికి దమ్ము ధైర్యముంటే మీడియాసాక్షిగా ప్రజల్లోకి వచ్చి జనం ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రైతుల కళ్లల్లో రక్తం కారుతుంటే జగన్ రెడ్డికి, వ్యవసాయమంత్రికి కనిపించడంలేదా? ఆర్టీసీసంస్థను కాపాడలేని.. జగన్ ప్రభుత్వం కూడా ప్రభుత్వమేనా? డ్రైవర్లు.కండక్టర్లను సస్పెండ్ చేయడం కాదు జగన్ రెడ్డి.. నిన్ను, నీప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా సస్పెండ్ చేస్తారు.” అని దేవినేని ఉమా తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE