– విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
– రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ. 16 లక్షల కోట్లకు విస్తరించింది
– బీసీల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామన్న గవర్నర్
– బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
అమరావతి: సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తలసరి ఆదాయం పెరిగింది. ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తున్నాం.పెన్షన్లను రూ. 4 వేలకు పెంచాం.
విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం. పోలవరం, అమరావతిని పట్టాలెక్కించాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు రూ. 6.5 లక్షల పెట్టుబడులు పెట్టారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ. 16 లక్షల కోట్లకు విస్తరించింది.
పరిశ్రమలు, పరిపాలన, ఆర్థిక వృద్ధిలో ఏఐని వినియోగిస్తున్నాం. పీపుల్స్ ఫస్ట్ విధానంతో స్వర్ణాంధ్ర సాధనకు సమగ్ర రోడ్ మ్యాప్ సిద్ధం చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాం. నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాం.
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిపోయింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. మెరిట్ ఆధారంగా 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. 2027 నాటికి పోలవరంను పూర్తి చేస్తాం. పోలవరం-బనకచర్ల పూర్తయితే రాయలసీమలో కరవు ఉండదు. ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలనేది మా లక్ష్యం.
ఏపీని ఐటీలో టాప్ లో నిలిపేలా కొత్త ఐటీ పాలసీ తీసుకొచ్చాం. వైసీపీ నిలిపివేసిన 93 కేంద్ర పథకాల్లో 74 పథకాలను పునరుద్ధరించాం. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్ట్ ను త్వరలోనే పూర్తిచేస్తాం.
10 పోర్టులను అంతర్జాతీయ పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నాం. 2029 నాటికి విశాఖలో 46 కిలోమీటర్లు, విజయవాడలో 38.40 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణం జరుగుతుంది. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేశాం.