Suryaa.co.in

Andhra Pradesh

సహకార సంఘాల్లో అక్రమాలపై హౌస్ కమిటీ ఏర్పాటు

* సహకార అవినీతిపై అసెంబ్లీలో ధ్వజమెత్తిన యార్లగడ్డ

గన్నవరం : రాష్ట్రంలోని ఆప్కాబ్, డిసిసిబిలు, సహకార పరపతి సంఘాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహకార సంఘాల్లో, డిసిసిబిల్లో జరుగుతున్న అక్రమాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ వీటన్నిటిపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వెంకటరావుకు మద్దతుగా పలువురు సభ్యులు సైతం సహకార అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.

దీంతో సహకారం రంగంలో జరుగుతున్న అక్రమాలపై హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అసెంబ్లీలో తీర్మానం మేరకు కొణతాల రామకృష్ణ చైర్మన్గా,కోన రవికుమార్, డి నరేంద్ర కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్, యార్లగడ్డ వెంకట్రావు, బుర్ల రామాంజనేయులు, ఎం అమర్నాథ్ రెడ్డి సభ్యులుగా హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తూ అయన పాత్రుడు సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

సహకార రంగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించి ఆరు నెలల్లోపు నివేదిక సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. తన డిమాండ్ మేరకు హౌస్ కమిటీని ఏర్పాటు చేసిన అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజులకు, ప్రభుత్వానికి ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE