– రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి
– ఐదేళ్లు కష్టపడితే మన సమయం వస్తుంది
– విజయసాయిరెడ్డికైనా విశ్వసనీయత ముఖ్యం
విజయవాడ: ‘‘బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలి. ప్రలోభాలకు లొంగో.. భయపడో.. రాజీపడో వెళ్లిపోతే ఎలా? రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి. ఐదేళ్లు కష్టపడితే మన సమయం వస్తుంది. విజయసాయిరెడ్డికైనా, మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యమ’’ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీలో నెంబర్టూగా ఉన్న ఎంపి విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో పార్టీ అధినేత జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ వ్యవహారంతో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? మిథున్ తండ్రి పెద్దిరెడ్డి ఏ శాఖకు మంత్రి? ఆయనకు లిక్కర్ కు ఏం సంబంధం? ఎవరినో ఒకరిని ఇరికించడం, కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని జగన్ విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని, సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు కూడా వెళ్లామని తెలిపారు. ‘‘అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరుపై వాళ్లు ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టం. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకు? ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై కోర్టుకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పాల’’ని జగన్ డిమాండ్ చేశారు.