Suryaa.co.in

Andhra Pradesh

నిన్నటి సూసైడ్.. నేడు రేప్‌గా ఎలా మారింది? జగన్ గారూ..

శ్రీసత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును అత్యాచార కేసుగా మారుస్తున్నట్లు ఎస్పీ రాహుల్ దేవ్ వెల్లడించారు. మరోవైపు ఈ కేసును దిశ పోలీసులకు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 4న గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలో ప్రియుడు సాదిక్‌కు సంబంధించిన ఓ షెడ్డులో తేజస్విని ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులు తొలుత తేజస్విని మృతిని ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం సామూహిక అత్యాచారం, హత్యగా అనుమానించడంతో అత్యాచార కేసుగా నమెదు చేసినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

ఈ మేరకు బీ ఫార్మసీ విద్యార్థిని కేసు విషయంలో ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. బీ ఫార్మసీ స్టూడెంట్ తేజస్విని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం ముమ్మాటికీ వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్‌ను తప్పించే ఎత్తుగడే అని ఆరోపించారు. తమ బిడ్డని రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తే.. పోస్ట్ మార్టం కాకుండానే ఆత్మహత్యగా డీఎస్పీ ఎలా సర్టిఫై చేస్తారని లోకేష్ ప్రశ్నించారు. సీఎం జగన్ కళ్లల్లో ఆనందం కోసమే పోలీసులు వ్యవహరిస్తోన్నట్టు అర్థమవుతోందని మండిపడ్డారు. నిన్నటి సూసైడ్ ఇవాళ రేప్‌గా ఎలా మారింది జగన్ గారూ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇది యాగీ చేయడం కాదని.. మీ బిడ్డలకో, మీ నేతల పిల్లలకో ఇదే అన్యాయం జరిగితే ఇలానే స్పందిస్తారా అని సూటిగా నిలదీశారు.

LEAVE A RESPONSE