Suryaa.co.in

Devotional

జన్మలు ఎన్ని రకాలు.. మానవ జన్మ ఎప్పుడు పొందుతారు…

కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయా…?
అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది.అసలు జన్మలు 3 రకాలు..
1. దేవజన్మ
2. మానవజన్మ
3. జంతుజన్మ
మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు.ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్నీ పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవ జన్మ నెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు. అందువల్ల పరమాత్మ నందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడలేదు.
తన కర్మఫలాల ననుసరించి బోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయం కాగానే..
‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి’ అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని మానవలోకాన్ని చేరుకోవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే. ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్ధులుంటాయే గాని కర్మజేయుటకు సాధనమైన స్థూల శరీరం ఉండదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ.
ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు. ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు,దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడుతాడు. జంతు జన్మలో కర్మలు చేస్తూన్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనిచేసేవికావు. కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. కారణం ఈ జన్మలలో శరీరం – మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మకూడా ఉపయోగపడదు.
ఇక పుణ్యపాపకర్మల ఫలలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు. పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు, బాధలు, అవమానాలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మ ఫలాలనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉన్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మ నందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు. 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవజన్మను “జంతూనాం నరజన్మ దుర్లభం” అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేయటం జరిగింది. ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్థకం చేసుకోవాలి.

LEAVE A RESPONSE