– హైడ్రా చెరువు పునరుద్ధరణ పనులు
– పైప్ లైన్ పగిలి నీరు ఉబికి వచ్చిందని భావించిన స్థానికులు
– భూగర్భం నుండి నీరు వచ్చిందని ధృవీకరించిన జలమండలి
హైదరాబాద్: అంబర్పేటలో గల బతుకమ్మకుంటలో హైడ్రా వర్గాలు చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించాయి. ఇక్కడ జేసీబీలతో మోకాలి లోతు వరకు తవ్వగానే నీరు ఉబికి వచ్చింది. దీంతో హైడ్రా అధికారులతో పాటు స్థానికులు ఆశ్చర్యపోయారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు ఎక్కడో పైపు లైన్ పగిలి నీరు ఉబికి వచ్చిందని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. దీంతో, ఎక్కడైనా పైపు లైన్ పగిలిందా? అనే కోణంలో జలమండలి అధికారులు పరిశీలన జరిపారు. కానీ పునరుద్ధరణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎక్కడా, ఎలాంటి పైపు లైన్ లేదని, భూగర్భం నుండి మాత్రమే నీరు ఉబికి వచ్చిందని నిర్ధారించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. “మోకాలి లోతుకే ఉప్పొంగిన గంగ, హైడ్రా తవ్వకాల్లో బయటపడిన బతుకమ్మకుంట” అంటూ హైడ్రా ట్వీట్ చేసింది.