– మంత్రి నాదెండ్ల మనోహర్
ఢిల్లీ/విజయవాడ: భారత స్టాండర్డ్లు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి.ఐ.ఎస్.) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు.
2014-15లో భారత్లో కేవలం 2,000 స్టాండర్డ్స్ మాత్రమే ఉన్నాయని.. 2025 నాటి ఆ సంఖ్య 23,000లకు చేరిందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన మంగళవారం జరిగిన బీఐఎస్ 9వ పాలక మండలి సమావేశానికి హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, దేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలోబీఐఎస్ అద్భుతంగా పని చేస్తుందన్నారు. ప్రామాణీకరణ సంఖ్యను 55,000 వరకు పెంచడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
భారత్ తయారు చేసిన స్టాండర్డ్స్ 95 శాతం హార్మొనైజ్డ్గా గుర్తింపు పొందాయని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమన్వయం చేయబడ్డాయని తెలిపారు. భారత స్టాండర్డ్లు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయని పేర్కొన్నారు. హాల్ మార్కింగ్ విషయంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందన్నారు. ఇప్పటివరకు 371 జిల్లాల్లో బంగారం హాల్ మార్కింగ్ అమలులో ఉందని, దేశ వ్యాప్తంగా విస్తరణలో భాగంగా ప్రతి జిల్లాలో హాల్మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
త్వరలో బులియన్ హాల్ మార్కింగ్ ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారని మంత్రి చెప్పారు. వెండి ఆభరణాల కోసం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. త్వరలో వెండి ఆభరణాలపై హాల్ మార్కింగ్ కోసం విధాన ప్రకటన చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. భారతదేశంలో ప్రమాణాల పరిరక్షణ, నాణ్యత నియంత్రణ, వినియోగదారుల న్యాయ హక్కుల పరిరక్షణలో బీఐఎస్ పాత్రను స్పష్టంగా ప్రతిబింబిస్తుందని అన్నారు.