Suryaa.co.in

Andhra Pradesh

ఏ దేశమేగినా…ఎదిగి… ఒదిగిపోతున్న భారతీయులు!

-అమెరికా జనాభాలో ఒక శాతమే ఉన్నా 6 శాతం పన్నులు చెల్లించేది ఇండియన్లే!
-ఎంపీ విజయసాయిరెడ్డి

ఏటా పాశ్చాత్య దేశాల్లో, ఇతర అభివృద్ధిచెందిన దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడానికి పయనమయ్యే వారి సంఖ్య ఇండియాలో పెరిగిపోతోంది. ఇలా యువతీయువకులైన నిపుణులు, ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు అమెరికా, కెనడా వంటి అమెరికా ఖండ దేశాలకు, ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి ఐరోపా దేశాలకు వెళ్లడం దేశవ్యాప్తంగా– ప్రధానంగా తెలుగునాట మనందరికీ కనిపించే దృశ్యం.

చదువు, ఉపాధి కోసం దేశ ప్రజలు ఇతర సంపన్న దేశాలకు వలసపోవడం భారతదేశానికి ప్రయోజనకరమేగాని గతంలో పొరపాటున భావించినట్టు నష్టదాయకం కానేకాదు. ప్రపంచంలో అన్ని రంగాల్లో ఎనలేని ప్రగతి సాధించిన అమెరికాలో భారత సంతతి ప్రజల పాత్ర అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందే. గత పాతికేళ్లుగా ఇండియా నుంచి ముఖ్యంగా తెలుగు ప్రాంతాల నుంచి విద్యార్థులుగా అమెరికా వెళ్లి ఉద్యోగులుగా అక్కడ స్థిరపడుతున్న యువతీయువకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.

వారికే కొన్నాళ్లకు గ్రీన్‌ కార్డులు, తర్వాత అమెరికా పౌరసత్వం లభిస్తున్నాయి. 1965 నుంచీ ఇలా అమెరికా వెళ్లిన డాక్లర్లు, ఇంజనీర్లు ఇతర వృత్తినిపుణల సంఖ్య ఇప్పటికి శరవేగంతో పెరిగిపోవడంతో అమెరికాలో భారతీయ–అమెరికన్ల జనాభా ఒక శాతానికి చేరుకుంది. అమెరికా జనాభాలో భారత సంతతి జనం 42 లక్షల వరకూ ఉంటారని అంచనా. ఇతర జాతుల అమెరికన్ల తలసరి ఆదాయంతో పోల్చితే భారతీయుల ఆదాయం చాలా ఎక్కువ. ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారితో పోల్చి చూస్తే–ఇండియన్లు అత్యధిక ఆదాయం, వేతనాలు వచ్చే నైపుణ్యమున్న ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉండడమే దీనికి కారణం.

ఒక శాతం జనాభా ఉన్న భారతీయులు మొత్తం పన్నుల్లో 6 శాతం చెల్లిస్తున్నారట!
పైన వివరించినట్టు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక శాతానికి కాస్త ఎక్కువ ఉన్న భారత సంతతి ప్రజలు అక్కడి ప్రభుత్వాలకు వసూలయ్యే పన్నుల మొత్తంలో 6 శాతం చెల్లిస్తున్నారంటే వారు ఎంతటి అభివృద్ధి సాధించారో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఇటీవల అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన అమెరికా (కాంగ్రెస్‌లోని దిగువసభ) ప్రతినిధుల సభ సభ్యుడు రిచ్మండ్‌ మెక్‌ కార్మిక్‌ వెల్లడించడం విశేషం. ‘వారు (భారతీయులు) అమెరికా సమాజంలో ఒక శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ఆరు శాతం పన్నులు చెల్లిస్తున్నారు.

ఇండియన్ల ఉత్పాదక శక్తి అత్యధికం. వారు సమస్యలు సృష్టించరు. చట్టాలకు విధేయులై ఉంటారు,’ అని మెక్‌ కార్మిక్‌ ప్రశంసించారు. ఇటీవల అంటే–21వ శతాబ్దం మొదటి పాతికేళ్లలో భారతీయులు విద్యార్థులుగా విదేశాలకు వెళ్లి ఉద్యోగులుగా పాశ్చాత్య దేశాల్లో స్థిరపడడం వల్లే వారు ఊహించలేనంత ఎక్కువగా ప్రగతి సాధిస్తున్నారు. 2022లో ఇండియా నుంచి ఏడున్నర లక్షల మంది విద్యార్థులు 150 దేశాల్లోని యూనివర్సిటీల్లో చదవడానికి వెళ్లారు.

వారిలో మూడొంతుల మంది ప్రధానంగా అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వర్సిటీల్లో చేరారు. ఇలా పాశ్చాత్యదేశాల్లో ఉన్నత విద్య భారతదేశానికి ఆదాయంతోపాటు ఆయా దేశాలకు భారతీయుల నుంచి పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుతోంది.

LEAVE A RESPONSE