Suryaa.co.in

Andhra Pradesh

పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే విజనరీ లీడర్ షిప్ అవసరం!

-ఎపిని ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలన్నది చంద్రబాబు సంకల్పం
-కోయంబత్తూరు 2.0 అభివృద్ధికి అన్నామలైని గెలిపించుకోవాలి
-తెలుగు పారిశ్రామికవేత్తలతో యువనేత నారా లోకేష్ ప్రసంగం
-బెంగళూరులో ప్రచారానికి లోకేష్ ను ఆహ్వానించిన తేజస్వి సూర్య

కోయంబత్తూరు: హైదరాబాద్ తో పోలిస్తే అభివృద్ధి విస్తృతమైన అవకాశాలు ఉన్నప్పటికీ చెన్నయ్ వెనకబడిపోవడానికి విజనరీ లీడర్ షిప్ లేకపోవడమే ప్రధాన కారణమని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కోయంబత్తూరు పార్లమెంటు పరిధిలోని సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్ లో బిజెపి అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా తెలుగు పారిశ్రామికవేత్తలతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిజెపి అభ్యర్థి అన్నామలైని మంగళగిరి చేనేతలు నేసిన ప్రత్యేక శాలువతో లోకేష్ సత్కరించగా, కోయంబత్తూరు శాలువాతో అన్నామలై యువనేతను సత్కరించారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ… విజనరీ లీడర్ లేకపోవడంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది. గతంలో ప్రఖ్యాతిగాంచిన అంబాసిడర్ కార్లు ఇక్కడ తయారయ్యేవి. ఒక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకురావడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. కియా విషయంలో తమిళనాడు పోటీపడి ఆనాడు మేం ఎపికి ఆ పరిశ్రమను తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్లుగా సరైన నాయకుడు లేని కారణంగా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయి. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఎపికంటే తమిళనాడు, కర్నాటక. ఒరిస్సా రాష్ట్రాలు ప్రస్తుతం ముందున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు ఈజీ కాదు
భారతదేశ ఆర్థికవ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడానికి ప్రధాని నరేంద్రమోడీ కృషిచేస్తున్నారు. ఎపి ఎకానమీని ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది మా నాయకుడు చంద్రబాబు సంకల్పం. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు ఈజీ కాదు. ఐపిఎస్ ను త్యాగం చేసి అన్నామలై రాజకీయాల్లోకి వచ్చారు. కోయంబత్తూరులో ఇన్ ఫ్రా, డ్రింకింగ్ వాటర్ సమస్యల పరిష్కరించాల్సి ఉంది. హ్యాండ్ లూమ్, పవర్ లూమ్, ఫౌండ్రీస్ పరిశ్రమను అప్ గ్రేడ్ చేసి అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకోసం అవసరమైన నిధులు కేంద్రం నుంచి రాబట్టాలంటే అన్నామలై లాంటి పోరాటయోధుడు కోయంబత్తూరుకు అవసరం.

విజనరీ లీడర్ అన్నామలై ద్వారా కోయంబత్తూరు 2.0 అభివృద్ధి సాధ్యం. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి అన్నామలైని గెలిపించుకోవాల్సి ఉంది. రాబోయే ఎన్నికల్లో ప్రతిఓటు కీలకమైనది. ఈ ఎన్నికలు దేశానికి, తమిళనాడు భవిష్యత్తుకి ముఖ్యమైనవి. కోయంబత్తూరు సమస్యల పరిష్కారంతోపాటు వేగవంతంగా అభివృద్ధి చెందాలంటే బలమైన గొంతుక అవసరం. ఈ ఎన్నికల్లో అన్నామలై ఘనవిజయం సాధించి పార్లమెంటులో అడుగుపెడతారని నేను బలంగా నమ్ముతున్నాను. అన్నామలై ఎంపిగా ఎన్నికయ్యాక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి అభివృద్ధిలో కోయంబత్తూరును కొత్తపుంతలు తొక్కించగలరన్న ఆశాభావాన్ని లోకేష్ వ్యక్తంచేశారు.

బెంగళూరులో ప్రచారానికి లోకేష్ రావాలి: తేజస్వి సూర్య
బెంగుళూరు సౌత్ ఎంపి తేజస్వి సూర్య మాట్లాడుతూ అభివృద్ధిపై అన్నామలైకి ప్రత్యేకమైన ఐడియాలజీ ఉంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కోయంబత్తూరు వైపు చూస్తోంది. ఇక్కడ ప్రజలు ప్రత్యామ్నాయ నేత కోసం ఎదురుచూస్తున్నారు. ఎపి యువనేత నారా లోకేష్ మా నియోజకవర్గంలో ప్రచారానికి రావాలని కోరుతున్నాను.

కోయంబత్తూరులో అన్నామలై చారిత్రాత్మక విజయం సాధించబోతున్నారు. యువమోర్చా నేత అమరప్రసాద్ రెడ్డి వారియర్ లా ఇక్కడ పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో మా నియోజకవర్గంలో 53శాతం మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. చదువుకున్నవారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడం విచారకరం. ఈనెల 19వతేదీన జరిగే ఎన్నికల్లో అన్నామలైకు మద్దతుగా యువత ఓట్లరూపంలో సంఘీభావం తెలపాలని కోరారు.

కోయంబత్తూరు అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్: అన్నామలై
బిజెపి అభ్యర్థి అన్నామలై మాట్లాడుతూ… కోయంబత్తూరు అభివృద్ధిలో ప్రభుత్వ పాత్ర చాలా తక్కువగా ఉంది. షణ్ముగంశెట్టి ఆర్థికమంత్రిగా ఉన్నపుడు ఇక్కడ సమస్యలపై దృష్టి సారించారు. ప్రస్తుతం అర్బన్ ఇన్ఫ్రాపై దృష్టిసారించాల్సి ఉంది. రాబోయే 20 ఏళ్లు కోయంబత్తూరు అభివృద్ధికి 140 అంశాలతో డాక్యుమెంట్ రూపొందించాను. దేశంలో ఎక్కడా లేనివిధంగా కోయంబత్తూరు 300 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఎన్ఐఎ ప్రాంతీయ కార్యాలయం, నార్కొటిక్ బ్యూరో కార్యాలయం ఉంది. కేరళ బార్డర్ లో ఉండటంతో ఇక్కడ డ్రగ్స్ రవాణాసవాల్ గా మారింది. నారా లోకేష్ పాదయాత్ర ద్వారా అక్కడ సమస్యలపై అధ్యయనం చేశారు. చంద్రబాబు అధికారం చేపట్టి ఎపి పునర్నిర్మాణం చేస్తారు. రాబోయేరోజుల్లో కోయంబత్తూరు అభివృద్ధికి వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నామలై పేర్కొన్నారు.

LEAVE A RESPONSE