-మహిళలకు భద్రత కల్పించలేని చేతకాని ప్రభుత్వం
-నిస్సిగ్గుగా ట్రోల్స్ చేస్తుంటే పోలీసులు ఏమయ్యారు?
-ఉమెన్ ట్రాఫికింగ్లో దేశంలోనే మూడో స్థానం
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని విలేఖరుల సమావేశం లో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. అసలు శాంతి భద్రతల విషయం లో ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. 650 మందికి పైగా మహిళలపై దారుణాలు, దాడులు జరిగాయి. ఇద్దరు మహిళలు హోంమంత్రులుగా పనిచేసినా అరికట్ట లేకపోయారు. అసమర్థత, బాధ్యత లేని నిర్లక్ష్యపు ప్రభుత్వం. మహిళలు, ప్రజల భద్రత కోసం కనీసం బడ్జెట్లో నిధులు కేటాయింపు కూడా లేని జగన్ నా చెల్లి, నా అక్క అంటూ మాయ మాటలు చెబుతున్నాడు. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం ఏపీలో 22 వేల మందికి పైగా మహి ళలు, బాలికలు అదృశ్యం అయ్యారు.
డీజీపీ అవాస్తవాలు చెబుతూ బాగా ఉందని ప్రకటించుకుంటున్నారు. అసలు ఎంతమంది అదృశ్యం అయ్యారు..ఎంతమందిని వెనక్కి తీసుకువచ్చారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? ఉమెన్ ట్రాఫికింగ్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉంది. వేలాది కిలోల డ్రగ్స్, గంజాయి, ఏరులై పారిస్తున్న మద్యంతో యువత జీవితాలను ప్రభుత్వమే నాశనం చేస్తుంది. సీఎం ఇంటికి సమీపంలో జరిగిన ఘటనలో నిందితులను ఎందుకు శిక్షించలేకపోయారు? సీఎం సొంత జిల్లాలోనూ మహిళలపై అత్యా చారాలు జరిగాయి. 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసినా శిక్షలు లేవు. రాష్ట్రంలో పోలీసులు, ప్రభుత్వం ఉందా? ప్రజలకు రక్షణ కల్పించడం చేతకానప్పుడు మీరంతా ఎందుకు? ఇన్ని దారుణాలు జరిగితే ఎంతమందికి ఉరి శిక్షలు వేశారు? గన్ కంటే జగన్ ముందుకు వస్తాడని ప్రగల్భాలు పలికిన వారు ఏమ య్యారు? అని ప్రశ్నించారు.
మహిళలపై నిస్సిగ్గుగా ట్రోల్స్ చేస్తారా?
హోంమంత్రిగా ఉన్న వనిత.. మహిళలనే కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం నీచం కాదా? వైసీపీ నాయకులు మహిళలను లైంగికంగా వేధించారు. ఇటువంటి వారు అధికారంలో ఉంటే.. ఇక ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది? త్వరలోనే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది… నేరం చేసిన వాడి తాట తీస్తుందని హెచ్చరిం చారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏపీలో శాంతి లేదు, భధ్రత లేదు. ప్రశాంతంగా ఉండే విశాఖలోనూ ఫ్యాక్షన్ను పరిచయం చేశారు. గన్ పెట్టి మరీ ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారు.
తిరుపతిలో కూడా గన్తో బెదిరించి ఆస్తులు లాక్కున్నారు. రెవెన్యూ వ్యవస్థలో కూడా కొంతమంది అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల యువకుడిని హత్య చేశారు. విశాఖలో సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు. గంజాయి, డ్రగ్స్కు క్యాపిటల్గా ఏపీని మార్చిన ఘనత వైసీపీదేనన్నారు. ఏపీలో మహిళలపై జరిగిన దాడులలో 47 శాతం పెరిగింది. దీనికి పోలీసు, ప్రభుత్వం సిగ్గుపడాలని హితవుపలికారు. టీడీపీ ఉపాధ్యక్షుడు ఆనంద్ సూర్య మాట్లాడుతూ పోలీసులు ప్రతిపక్ష పార్టీల నేతలే లక్ష్యంగా వైసీపీ చట్టాన్ని అమలు చేస్తూ తొత్తులుగా మారారు. వారు కోర్టులో దోషులుగా నిలబడక తప్పదన్నారు. వైసీపీ నేతలు హత్యలు చేసినా, దాడులు చేసినా కేసులు పెట్టరు..ఇటువంటి పోలీసులు ఖాకీ డ్రస్ వదిలిపెట్టి వైసీపీ కార్యకర్తలుగా పనిచేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయని డీజీపీ సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు.