Suryaa.co.in

Telangana

రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణం

– యూనివర్సిటీకి యూజీసీ ద్వారా ఫండింగ్
– రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీ అభివృద్ధికి కృషి
-సమ్మక్క, సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఇవాళ జాకారంలోని.. యూత్ ట్రైనింగ్ సెంటర్ ప్రాంగణంలో.. తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటుచేసుకుంటున్నాం. వచ్చే విద్యాసంవత్సరం (2024 -25) నుంచే క్లాసులు మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది బీఏ ఇంగ్లీష్, బీఏ సోషల్ సైన్సెస్.. క్లాసులు ప్రారంభిస్తాం. 337 ఎకరాల స్థలం బదిలీ ప్రక్రియ.. పూర్తయిన తర్వాత వర్సిటీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

అడ్మిషన్ల ప్రక్రియ, అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాల నిర్వహణకు క్యాంప్ ఆఫీసును కేంద్రంగా ఉండనుంది. ఈ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి మెంటార్ యూనివర్సిటీగా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీకృష్ణా రెడ్డి గారు.. మన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ OSDగా నియామకమయ్యారు. OSD గారి ఆధ్వర్యంలో.. ఈ క్యాంపు ఆఫీస్ ద్వారానే.. అడ్మిషన్లు, అడ్మినిస్ట్రేషన్లతోపాటుగా.. రాష్ట్ర ప్రభుత్వం, UoH మధ్య సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ కి నిర్మాణానికి అవసరమైన భూమార్పిడి ప్రక్రియకు సంబంధించిన పనుల పర్యవేక్షణ జరుగుతుంది.

పూర్తిస్థాయి క్యాంపస్ నిర్మాణానికి భూసేకరణ జరుగుతోంది. అది పూర్తికాగానే పనులు ప్రారంభిస్తాం. తెలంగాణలో తొలి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పడటం.. ఈ వర్గాల అభ్యున్నతి విషయంలో ఓ మేలి మలుపు లాంటిది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 9.08 శాతం గిరిజనులు ఉన్నారు. వారి అక్షరాస్యతా శాతం, 2011 జనాభా లెక్కల ప్రకారం, 49.51%. మొత్తం తెలంగాణ అక్షరాస్యత 66.5%. గిరిజన మహిళల్లో అక్షరాస్యత 39.5%.

ఇలాంటి పరిస్థితుల్లో గిరిజనుల్లో అక్షరాస్యతను పెంచడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా దిశానిర్దేశం జరుగుతుంది. దాదాపు రూ.900 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీకి యూజీసీ ద్వారా ఫండింగ్ అందుతుంది. దీని ద్వారా తెలంగాణతోపాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల గిరిజనులకు న్యాయం జరుగుతుంది.

గిరిజన ఆచారాల కేంద్రిత విద్యను, పరిశోధనను ప్రోత్సహించడంతోపాటుగా..
కళలు, వైద్యానికి పనికొచ్చే మూలికా వ్యవస్థపై, అడవుల ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు, గిరిజన సంస్కృతి, ఆచార వ్యవహారాలు తదితర అంశాలపై ఈ యూనివర్సిటీ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. దాదాపు 30 శాతం గిరిజన జనాభా ఉన్న ములుగు జిల్లాలో ఈ యూనివర్సిటీ ఏర్పాటుచేయడం సంతోషకరం.

యూనివర్సిటీ ఏర్పాటు సమయంలో ఈ యూనివర్సిటీకి.. గిరిజనుల ఆరాధ్యదైవమైన వనదేవతలు సమ్మక, సారక్క పేర్లను పెట్టాలని సూచించగానే.. మోదీ వెంటనే అంగీకరించడం మనందరికీ గర్వకారణం. ఈ ప్రాంతంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది.

75 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో మన రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం మనందరికీ గర్వకారణం. రామప్ప పరిసర ప్రాంతాల్లో.. పర్యాటకుల సౌకర్యాలు, ఇతర అభివృద్ధి పనులకు రూ.62 కోట్లు ఇచ్చాం. ఈ పనులను పర్యవేక్షించేందుకు వెళ్తున్నాను. మనమంతా రాజకీయాలకు అతీతంగా.. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి కృషిచేద్దాం.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, ములుగు జిల్లా కలెక్టర్ ఇళా త్రిపాఠీ, ములుగు ఎస్పీ శబరీష్, ఐటీడీఏ పీవో చిత్ర శర్మ, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE