Suryaa.co.in

Andhra Pradesh

బీసీలను అణచివేసేలా జగన్ రెడ్డి కుట్రలు

-ఎన్టీఆర్, చంద్రన్న ప్రోత్సాహంతోనే బీసీలకు రాజకీయ అవకాశాలు
-నాయీ బ్రాహ్మణ, పెరిక సాధికార సమితుల శిక్షణా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర

బీసీలు రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉండడానికి నాడు ఎన్టీఆర్ తీసుకున్న కల్పించిన రిజర్వేషన్లు, రాజకీయ అవకాశాలు, తర్వాత చంద్రబాబు నాయుడు అందించిన ఆర్ధిక, సామాజిక ప్రోత్సాహమే కారణం. బీసీల్లో నాయకత్వాన్ని పెంచాలి, తద్వారా వారి సామాజిక వర్గంలోని వెనుకబాటుతనాన్ని పారద్రోలేందుకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు కంకణబద్దులై ఉన్నారని బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి ఆధ్వర్యంలో నాయీ బ్రాహ్మణ, పెరిక సాధికార సమితుల సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ ఆది నుండి బీసీల అభ్యున్నతే లక్ష్యంగా పని చేసింది. వారిని ఆర్ధికంగా ఎదిగేలా చేసినపుడే అసలైన స్వాతంత్ర్యం లభిస్తుందని నమ్మి పని చేస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విజన్ 2020 అంటే కొందరు ఆశ్చర్యంగా చూశారు. కొందరు హేళన చేశారు. కానీ నాడు రూపొందించిన విజన్.. హైదరబాద్‌ను ప్రపంచంలో అగ్రస్థాయి నగరాల జాబితాలో 65వ స్థానంలో నిలిపింది. మరో 10ఏళ్లలో టాప్ టెన్ లో నిలవడం తధ్యం.

అదే రీతిలో అమరావతిని, రాష్ట్రాన్ని నిలపాలని చంద్రబాబు భావించారు. కానీ జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ముందుకు వెళ్లనీయకపోగా, వెనక్కి నెట్టారు. ఏపీని చూసి పక్క రాష్ట్రాల నాయకులు నవ్వే పరిస్థితికి తెచ్చారు. అందుకు ఇక్కడ కులాల పేరుతో జగన్ రెడ్డి చేస్తున్న రాజకీయమే కారణం. జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను, జగన్ రెడ్డి సోషల్ మీడియా మాఫియా చేసే దుష్ప్రచారాలను గ్రామ గ్రామాన చర్చించాలి. జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిద్దాం.

బీసీలంతా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలి. జరుగుతున్న అన్యాయాన్ని, ఏం చేస్తే మేలు జరుగుతుందో గుర్తించి, సమస్యల పరిష్కారానికి సాధికార సభ్యులే నాయకులుగా నిలవాలి. కుల వృత్తులు, చేతివృత్తుల్ని దశాబ్దాలుగా చులకన చేశారు. కానీ ఇప్పుడు వాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ గుర్తించి శిక్షణ ఇప్పించాలి. నైపుణ్యం పెంచి ఆర్ధికంగా వృద్ధిలోకి తెచ్చేలా ఏర్పాటు చేద్దాం. జిల్లాల వారీగా బీసీల సమస్యలు తెలుసుకునేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసి రాష్ట్రంలోని బీసీలందరినీ ఏకం చేద్దాం.

నాయీ బ్రాహ్మణులను ఏమీ అనకపోయినా, ఏదో అన్నారు అన్నట్లు క్రియేట్ చేసి జగన్ రెడ్డి బీసీలను దగా చేశారు. ఇప్పుడు కూడా బీసీలను టీడీపీకి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. పెరిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంద్రబాబు ఎమ్మెల్యేగా చేస్తే.. జగన్ రెడ్డి తోట చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్త గుండెలపై కూర్చొని వైసీపీ జెండా మోయాలన్నా.. నిరాకరించినందుకు గొంతు కోసి చంపారు. కష్టబడేవారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందనే విషయాన్ని మరచిపోకూడదు. గ్రామస్థాయిలో కులాలను బలోపేతం చేద్దాం. పార్టీ కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన వారిని గౌరవించుకుంటామని పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం సభ్యులు, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం నందమూరి తారకరామారావు. పేదలకు సంక్షేమం అందించడంతో పాటుగా రాజకీయంగానూ అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. ఎన్టీఆర్ తీసుకున్న చొరవను చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి సాధించేలా చేశారు. ఆదరణ, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిల్స్, సబ్సిడీ రుణాలు, విదేశీ విద్య, ఇలా చంద్రబాబు అమలు చేసిన పథకాలన్నీ బీసీలను ఆర్ధికంగా బలోపేతం చేసేలా ప్రోత్సహించినవే. కానీ నేడు జగన్ రెడ్డి అన్నీ రద్దు చేసి ఉద్దరించేలా అంటూ పిచ్చి ప్రచారం చేసుకుంటూ బీసీలను దగా చేస్తున్నాడు.

తెలుగుదేశం పార్టీ నాలెడ్జి సెంటర్ ఛైర్మన్ గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ.. నందిని పంది అని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. నాలుగేళ్లుగా సంక్షేమం పేరుతో దగా చేస్తున్నారు. సగానికి పైగా జనాభా ఉన్నప్పటికీ బీసీలకు బడ్జెట్ కేటాయింపులు, అందిస్తున్న సంక్షేమంలో చేస్తున్న మోసాన్ని తెలుసుకున్నపుడే బీసీల బలం జగన్ రెడ్డికి తెలిసొస్తుంది. ఒకే అబద్దాన్ని పదేపదే చెబుతూ.. బీసీలను ఇంకా నయవంచనకు గురి చేస్తున్నారు. రూ.75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు.

8వేల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు లాక్కున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కుదించాడు. విద్యా పథకాలు దూరం చేసి చదువుకోకుండా చేస్తున్నాడు. 28 బీసీ పథకాలు రద్దు చేశాడు. అయినా బీసీలను ఉద్దరించానని చెప్పుకుంటున్నాడు. బీసీలు అంతా జగన్ రెడ్డి చేస్తున్న దగాపై అవగాహన చెందితే జగన్ రెడ్డికి శ్రీకృష్ణ జన్మస్థానమే దిక్కని తెలిసే బీసీలను విడగొట్టి రాజకీయం చేస్తున్నాడు. మనం అవగాహన చెందడమే కాకుండా, మనతోటి వారికి కూడా జగన్ రెడ్డి దగా గురించి వివరించాలని పిలుపునిచ్చారు.

కోనేరు సురేష్ మాట్లాడుతూ.. ఎన్నికల కోసం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రచారం చేసినా, ఎన్నికల జాబితా సరిగా లేకుంటే ఎవరూ ఏమీ చేయలేమని, ఓటర్ల విషయంలో పక్క ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్క సభ్యుడు కూడా తమ పరిధిలోని ఓటర్ జాబితాను ప్రతి మూడు నెలలకు ఒకసారి పరిశీలించి జాబితాను సరి చూసుకోవాలి. ఓటర్ జాబితాను మేనిప్యులేట్ చేయడంలో జగన్ రెడ్డి సిద్ధహస్తుడని, దొంగ ఓట్ల చేరికలపై జగన్ రెడ్డి ఎక్కువగా దృష్టిపెట్టినందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

టీడీపీ మానవ వనరుల విభాగం సభ్యుడు ఎస్.పి.సాహెబ్ మాట్లాడుతూ.. చంద్రబాబు తన అనుభవంతో బీసీలందరినీ ఏకం చేయాలని భావించి బీసీ సాధికార సమితులకు రూపకల్పన చేశారు. నాయకత్వాన్ని పెంచడం, బీసీల్లో రాజకీయ అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి బీసీలకు జరిగిన అన్యాయం కంటే.. జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో జరిగిన అన్యాయమే ఎక్కువ. జనాభాలో 50శాతం ఉన్నప్పటికీ నిధులు సాధించుకోవడంలో వెనుకబడ్డాం. టీడీపీ భూములిచ్చింది. సబ్ ప్లాన్ తో నిధులిచ్చింది. కానీ ఇప్పుడు నిధులు లేవు. భూములు లాక్కుంటున్నారు. బీసీలు ఏకమైతే జగన్ రెడ్డికి చుక్కలు కనిపిస్తాయని తెలిసే కులాల వారీగా విడగొట్టి నకిలీ కార్పొరేషన్లు పెట్టాడు. సంక్షేమ పథకాలు రద్దు చేసి, నిధులు మళ్లించడం బీసీ ద్రోహం కాదా అని ప్రశ్నించారు.

బీసీ సెల్ సాధికార సమితి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గంజాం రాఘవేంద్ర మాట్లాడుతూ.. బీసీ సెల్ తరఫున మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లకుంటే ప్రయోజనం ఉండదు. అందుకే సోషల్ మీడియా వినియోగంపై బీసీలు అవగాహన పొందాలి. గ్రామగ్రామాన ఉండే బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియా వేధికగా ప్రజల్లోకి తీసుకెళ్లి హోరెత్తిద్దామని, జగన్ రెడ్డికి బీసీల సత్తా ఏంటో చాటిచెబుదామన్నారు.

కార్యక్రమంలో.. నాయీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ వైద్యం శాంతారాం, పెరిక సాధికార సమితి కన్వీనర్ వనపర్తి బద్రి, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్, బీసీ సెల్ కార్యదర్శి మంగళి ఆదినారాయణ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE