Suryaa.co.in

Andhra Pradesh

డ్రగ్స్ మాఫియాపై జగన్ నోరు విప్పాలి

– డ్రగ్స్ మాఫియా  జగన్ బినామీ దారులే
-కేంద్ర నిధులు దారిమళ్లించడం సిగ్గుచేటు
-హైదరాబాద్‌లో ఉంటూ బాబు ప్రకటనలా?
-సర్కారుపై ఇక కమలం సమరశంఖం
– జగన్ సర్కారుపై బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ నిప్పులు
గుంటూరు: జగన్ సర్కారుపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ నిప్పులు కురిపించారు. రాష్ట్ర ప్రతిష్ఠకు మచ్చ తెచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై నిగ్గుతేల్చాలని, అందులో జగన్ బినామీల హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రనిధులను పక్కదారి పట్టిస్తున్న జగన్ నిర్ణయాల వల్ల, సమస్యలు పెరుతున్నాయన్నారు. చిన్న గుంత కూడా పూడ్చడానికి నిధుల్లేని ప్రభుత్వాన్ని ఏపీలోనే చూస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో కూర్చుని చంద్రబాబు జనాలను తిరుగుబాటు చేయమని పిలుపునివ్వడాన్ని ఎద్దేవా చేశారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీ నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ కార్యకర్తలు సమరశంఖం పూరించి, సమస్యల పరిష్కారంలో ముందుండాలని పిలుపునిచ్చారు. గుంటూరులో పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన సత్యకుమార్ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బినామీ దారులదేనని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా మారడం సిగ్గు


చేటన్నారు. దీనిపై ప్రజలకు ముఖ్యమంత్రి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని పొన్నూరు రోడ్డు లో గురువారం ఎలక్ట్రికల్ సూపర్డెంట్ కార్యాలయం ఎదుట పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ బిజెపి చేపట్టిన మహాధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ధర్నాకు కు జిల్లా పార్టీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షత వహించారు.
సత్య కుమార్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజలను వంచించి అధికారం చేపట్టిన జగన్, రెండున్నర ఏళ్ల అధికారం తర్వాత మారువేషంలో ప్రజా వంచన యాత్రకు శ్రీకారం చుట్టాలని కోరారు.

ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి నిలిచారన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు పెంచితే ప్రతిపక్షంలో ఉన్న జగన్.. చంద్రబాబును తుపాకీతో కాల్చాలనిసెలవిచ్చిన నేటి ముఖ్యమంత్రి జగన్ ను, ఏం చేయాలో ప్రజలే చెప్పాలన్నారు.
నవరత్నాల పేరుతో ప్రజలను వంచించి, తన బినామీలకు కోట్ల రూపాయలు హోల్ సేల్ గా దోచి పెడుతున్నారు. వ్యాపారానికి ఏది అనర్హం కాదు అంటూ సహజ వనరులతో వ్యాపారం చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఇసుక, చెత్త, మద్యం, మాంసం, గంజాయి, ఇప్పుడు డ్రగ్స్ ఇలా అన్ని

వ్యాపారాలలో వేలు పెట్టి కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను సంక్షేమ పథకాలకు దారి మళ్లిస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం ఘనతగా చెప్పుకుంటూ మోడీ ఫోటో కూడా లేకుండా తన ఫోటో లు వేసుకొని, కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇలా చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరిస్తున్నారన్నారు. జగన్ ఇప్పటికైనా ప్యాలెస్ నుండి బయటకు రావాలని ఆయన కోరారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు హైదరాబాదుకు పరిమితమై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగబడతారని రెచ్చగొట్టడం సహేతుకం కాదన్నారు. బిజెపి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని వివరించారు.
డ్రగ్స్‌లో కొలంబియా లాంటి పరిస్థితులు ఏపీలో ఉందని కొంతమంది అడుగుతున్నారని అన్నారు. ఏపీలో మాదక ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాల్లా దొరుకుతున్నాయని విమర్శించారు. ఏపీలో గంజాయి గల్లిగల్లిల్లో దొరుకుతున్నాయన్నారు. హెరాయిన్‌కి మంత్రులకి, ఎమ్మెల్యేలకి సంబంధం ఉందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. సీఎం అనుచరులు మద్యం తయారీ డిస్టలర్రీల్లో మాదక ద్రవ్యాలు వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయన్నారు. హెరాయిన్‌కు మీకు సంబంధం లేదని సీఎం ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గుజరాత్‌లో హెరాయిన్ పట్టుకున్నదే మోదీ అని…ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని హితవుపలికారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిఆర్ఐ డ్రగ్స్ పట్టుకుందన్నారు. సీఎం తెలుగు విరోధి అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో చదువుకొని వచ్చారని… తెలుగుపై నిషేధం విధించారని మండిపడ్డారు. జగన్ ఇచ్చిన డిక్షనరిలో దేవుడంటే ముస్లింలు, క్రిష్టియన్లు ఎవరిని సృష్టించాడో అతనే దేవుడు అని ఉందని..తమరు తీసుకొచ్చిన డిక్షనరీల్లో హిందువులకు స్థానం లేదా అని ప్రశ్నించారు. కులాలను వేరు చేసి రాజకీయ లబ్ది పొందుతున్నారనిఆగ్రహం వ్యక్తం చేశారు.జగనన్న కడప జిల్లా పరువును తాకట్టు పెడుతున్నారన్నారు. ఆటవిక రాజ్యం నుండి రాష్ట్రానికి విముక్తి కావాలని అన్నారు.
బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రిని మనం చూసి ఉండమని అన్నారు. అసమర్థత, అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి

శూన్యం అని విమర్శించారు. నియంత, అసమర్ధుడు సీఎం అయితే ఎలా ఉంటుందో జగన్ పాలన చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. జగన్ ఒక్క చాన్స్ తీసుకోని, ప్రజలకు బ్రతికే చాన్స్ లేకుండా చేశారన్నారు. ప్రభుత్వ ఆస్తులను జగన్ వాళ్ల తాత ఆస్తుల మాదిరిగా తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. అమ్మ ఒడి

పేరుతో డబ్బులు ఇచ్చి నాన్న చేతిలో మద్యం బాటిల్ పెట్టి దోచుకుంటున్నారన్నారు. నవరత్నాలు పేరుతో ఓట్లు కొనుకొంటున్నారని విమర్శించారు. ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నాడని, ఏపీని అప్పుల ఆంద్రప్రదేశ్‌‌గా మార్చారని కన్నా మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ,రావెల కిషోర్ బాబు,శనక్కాయల అరుణ,వల్లూరి జయప్రకాష్ నారాయణ, సైదారెడ్డి,తాళ్ల వెంకటేష్ యాదవ్,యడ్లపాటి స్వరూపరాణి,అమ్మిశెట్టి ఆంజనేయులు, రమాకుమారి,లంక దినకర్, జాగ్గారపు రాము, పునుగుళ్ల రవిశంకర్,నిజ్జాముద్దీన్,పాలపాటి రవికుమార్, వనమా నరేంద్ర, ఈదర శ్రీనివాసరెడ్డి,అడపా నాగేంద్ర, రాచుమల్లు భాస్కర్, చరక కుమార్ గౌడ, అప్పిశెట్టి రంగారావు, గారపాటి పూర్ణ, గాజుల వెంకయ్యనాయుడు, నమ్రత చౌదరి, అనుమోలు ఏడుకొండలు గౌడ, బుజ్జిబాబు, ఎస్ ఎం బాష, ఉయ్యాలశ్యాంవరప్రసాద్,నీలం ప్రసాద్, మల్లల లక్ష్మణ్, పాలిశెట్టి రఘు, దార అంబేద్కర్, నాగుల్ మీరా,కృష్ణ కాంత్,బుల్లిబాబు, బొల్లాప్రగడ శ్రీదేవి,కర్రి నాగలక్ష్మి,ఏలూరి లక్ష్మి, రేణుక దేవి,కరుణశ్రీ,నాగ మల్లీశ్వరి,సీతాదేవి,
సరోజిని,రమాదేవి పాల్గొన్నారు.

LEAVE A RESPONSE