Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలన దోపిడీల పర్వమే

– ప్రతి రోజు మీ పొలాలు, స్థలాలు ఉన్నాయో లేదో చూసుకోండి
– వైసీపీ నేతలకు ఏది కనిపించినా దోచేస్తున్నారు
– చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రభవిష్యత్తు బాగుంటుంది
– బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు భువనేశ్వరి పిలుపు

బద్వేల్, పోరుమామిళ్ల: జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన మొత్తం దోపిడీల పర్వంగా కొనసాగిందే తప్ప, సామాన్యులకు లాభకరమైన పనులేవీ వైసీపీ ప్రభుత్వం చేయలేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. బద్వేల్ నియోజకవర్గం, పోరుమామిళ్లలో చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి గురువారం పరామర్శించారు.

పరామర్శల అనంతరం పోరుమామిళ్ల ప్రజలతో భువనేశ్వరి మాట్లాడుతూ… వైసీపీ పాలనలో కల్తీమద్యం, ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, గంజాయి, డ్రగ్స్, మహిళలపై దాడుల్లో ఏపీని భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి మొదటిస్థానంలో నిలబెట్టాడు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీని నిలబెట్టారు. తెలుగుదేశం పాలనలో ఏపీకి పెట్టుబడులు భారీగా వచ్చాయి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి.

గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో ఒక్క పెట్టుబడి కూడా రాలేదు..ఒక్క కంపెనీ కూడా రాలేదు. యువత నిరుద్యోగ సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ పాలనలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన కంపెనీలన్నీ ప్రక్కనున్న రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయి.ఏపీకి రాజధాని లేకుండా చేసి రాష్ట్రం పరువు తీసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.

గత ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఏపీ రూపురేఖలు తెలంగాణాను తలదన్నేలా మారేవి.తెలంగాణ నేడు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి గల కారణం చంద్రబాబు ముందు చూపుతో తెచ్చిన కంపెనీలు.
నేడు తెలంగాణలో స్థిరపడిన ఐటీ ఉద్యోగులు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.

రాష్ట్రానికి మేలు చేస్తారని, ప్రజల్లో బలంగా నిలిచిపోతారనే కుట్రతోనే చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమంగా జైల్లో పెట్టింది. ఒక్క కేసును కూడా నేటికీ నిరూపించలేకపోయారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అనేక దారుణాలను టీడీపీ నేతలు, కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వారిపై వైసీపీ ప్రభుత్వం అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టింది. వందలాది టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపి పొట్టనపెట్టుకుంది.

పార్టీకోసం ప్రాణాలర్పించిన కార్యకర్తలందరికీ నా జోహార్లు. తెలుగుదేశంపార్టీకి కార్యకర్తలే రథ సారధులు..నా ధైర్యం కూడా అదే. పార్టీ కార్యకర్తలు రక్షణగా ఉన్నారనే ధైర్యంతోనే నేను అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. బయటకు వచ్చి ధైర్యంగా తిరగగలుగుతున్నాను. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఎన్నికలు. దీనికి ప్రతి కార్యకర్త, నాయకుడు సంసిద్ధంగా ఉండాలి.

వైసీపీ చేసే అరాచకాలను ధైర్యంగా తిప్పికొట్టి, 2024 ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో దుర్మార్గుల పాలనను అంతం చేయాలి. రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు మీ ఓటు జాబితాలో ఉందో, లేదో సరిచూసుకోవాలి. అదేవిధంగా మీకు సంబంధించిన స్థలాలు, పొలాలు కూడా ఉన్నాయా, లేదా చూసుకోవాలి. వైసీపీ నాయకులు తమకు ఏది కనిపిస్తే దాన్ని ఇష్టారీతిన దోచుకుంటున్నారు..అడిగితే దాడులు చేస్తున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు…భావితరాల భవిష్యత్తు బాగుంటుంది.
చంద్రబాబు సీఎం అయితే సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తారు. సంక్షేమంతో పాటు భవిష్యత్తుకు కూడా గ్యారెంటీ ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి అని భువనేశ్వరి అన్నారు.

LEAVE A RESPONSE