* రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పిలుపు
* మే 2న రూ.లక్ష కోట్ల పనులకు పీఎం నరేంద్రమోడి శంకుస్థాపన
* ప్రధాని సభకు మైలవరం నుంచి పెద్ద ఎత్తున తరలిరండి…
* నియోజక వర్గ వాసులకు మంత్రి సవిత పిలుపు
* మోడి రాక ఏపీకి పండగ : ఎంపీ కేశినేని చిన్ని
* వసంతకృష్ణ ప్రసాద్ తో తనకెటువంటి విభేధాల్లేవ్…
* ‘సాక్షి’వి ఎర్రి రాతలు : ఎంపీ చిన్ని ఆగ్రహం
* అమరావతితోనే మైలవరం అభివృద్ధి : ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్
* వైసీపీ ఓ విషపు మొక్క
* ఇబ్రహీంపట్నంలో మైలవరం కూటమి నాయకుల సమన్వయం సమావేశం
ఇబ్రహీంపట్నం : ప్రధానమంత్రి నరేంద్రమోడి పర్యటనను విజయవంతం చేద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కూటమి నాయకులతో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, అయితాబత్తుల ఆనందరావుతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, మే రెండో తేదీన లక్ష కోట్ల రూపాయలతో చేపట్టనున్న అమరావతి రాజధాని పనులకు ప్రధాన మంత్రి నరేంద్రమోడి చేతుల మీదుగా శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్రమోడికి ఘన స్వాగత పలుకుదామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. మైలవరం నియోజక వర్గంలోని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ప్రధాని పర్యటనను విజయం చేయాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏపీలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోడి అండదండలు అందిస్తున్నారన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి రాజధాని అని అన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారమందిస్తోందన్నారు. 2014 రాష్ట్ర విభజన తరవాత ఏపీ రాజధాని లేకుండా అయిపోయిందన్నారు. అమరావతి ప్రాంత రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా 34 వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారని, వారి త్యాగం మరువలేనిదని ధన్యవాదాలు తెలిపారు. ఆనాడు అమరావతి నిర్మాణానికి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిన జగన్… తరవాత పనులను అడ్డుకున్నారన్నారు.
జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడన్నారు. ఆయన అసమర్థ పాలనతో విసిగివేశారని ప్రజలు…సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి జై కొట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడి సహకారంతో రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ఏపీపై ప్రధాని నరేంద్రమోడి ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
ఆయన సహకారంతో అమరావతి రాజధాని పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ఈ నెల రెండో తేదీన అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి పీఎం నరేంద్రమోడి రాష్ట్రానికి వస్తున్నారన్నారు. ఆయనకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలకాలన్నారు. ఇందుకోసం మైలవరం నియోజక వర్గం నుంచి అధిక సంఖ్యలో కూటమి నాయకులు, ప్రజలు తరలిరావాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్రమోడి రాక మనకో పండగ: ఎంపీ కేశినేని చిన్ని
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడి రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పండగలాంటిదని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందన్నారు. పోలవరం, రాజధాని అమరావతి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, విశాఖ పరిశ్రమకు ఆర్థిక సాయం, రైల్వే జోన్ ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు పీఎం నరేంద్రమోడి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. అమరావతి అభివృద్ది చెందితే, మైలవరం నియోజక వర్గానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఏపీకి ఎంతో మేలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీకి మైలవరం పెట్టనికోటన్నారు. నియోజక వర్గం నుంచి మోడి పర్యటనకు 25 వేల మంది తరలిరావడం ఖాయమని ఎంపీ తెలిపారు.
టీడీపీలో గ్రూపుల్లేవ్
తనకు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు మధ్య వివాదం ఉందని సాక్షి పత్రికల్లో ఎర్రి రాతలు రాస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని మండిపడ్డారు. తమ మధ్య ఎటువంటి గ్రూపుల్లేవని, ఏ నిర్ణయమైనా కలిసే తీసుకుంటామని స్పష్టంచేశారు. అమరావతి పనులు అడ్డుకోడానికి వైసీపీ సైకోలు కుట్రలు పన్నుతున్నారన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని ఎంపీ చిన్ని మండిపడ్డారు.
వైసీపీతో పెను ప్రమాదం : ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
రాజధాని అభివృద్ధితోనే మైలవరం కూడా ప్రగతిపథం దూసుకుపోతుందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హై వే వంటి ఎన్నో అభివృద్ధి నియోజక వర్గంలో చురుగ్గా సాగుతున్నాయన్నారు. మైలవరంలో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. సాక్షిలో వచ్చే తప్పుడు వార్తలు నిజమని నమ్మి వైసీపీ నాయకులు ఎప్పుడూ మైకంలో ఉంటారని ఎద్దేవా చేశారు.
వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆ పత్రికను తానెప్పుడూ చూడలేదని, చదవలేదని తెలిపారు. పొరపాటున సాక్షి చదివితే మైండ్ డిస్టర్బ్ అవుద్దన్నారు. నియోజక వర్గంలో వైసీపీ పేరే వినిపించకూడదని, ఇందుకోసం కూటమి నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. వైసీపీ అనే విషపు మొక్క మొలిస్తే….మైలవరానికి పెనుశాపంగా మారుతుందని హెచ్చరించారు. రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఘన స్వాగతం పలుకడానికి మైలవరం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తరలిరావాలని నియోజక వర్గ వాసులకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు.
మరో సమన్వయ కర్త ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి సవితను ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎన్టీవిగ్రహానికి మంత్రి సవిత, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.